Friday, February 13, 2015

5. Ollenembudu Vairaagya - Basavanna


కన్నడ వచనం:

ಒಲ್ಲೆನೆಂಬುದು ವೈರಾಗ್ಯ, ಒಲಿವೆನೆಂಬುದು ಕಾಯಗುಣ. ಆವ ಪದಾರ್ಥವಾದರೇನು?
ತಾನಿದ್ದೆಡೆಗೆ ಬಂದುದ ಲಿಂಗಾರ್ಪಿತವ ಮಾಡಿ ಭೋಗಿಸುವುದೇ ಆಚಾರ !
ಕೂಡಲಸಂಗಮದೇವನ ಒಲಿಸ ಬಂದ ಪ್ರಸಾದಕಾಯವ ಕೆಡಿಸಲಾಗದು


తెలుగు లిపిలో:

ఒల్లెనెంబుదు వైరాగ్య, ఒలివెనెంబుదు కాయగుణ; ఆవపదార్థవాదరేను!!
తానిద్దెడెగె బందుద లింగార్పితవ మాడి భోగిసువుదే ఆచార
కూడలసంగమదేవన  ఒలిస బంద ప్రసాదకాయవ కెడిసలాగదు 

తెలుగు వచనం:

వలదనుకోవడం వైరాగ్యం, ఇష్టపడడం కాయగుణం 
తనవద్దకు వచ్చినది లింగార్పితము చేసి అనుభవించడం ఆచారం !
కూడలసంగమదేవునికిష్టమై వచ్చిన ప్రసాదకాయము చెడునదికాదు 


వచన కర్త ఆంతర్యం:

విషయ సుఖములపై విరక్తి చెందడం వైరాగ్యం అవుతుంది. కానీ శరీరము, మనస్సు కావాలని అడుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు స్వీకరించకుండా ఉండగలమా? అంతే గాక ఈ భౌతిక ప్రపంచంలో జీవించే సాధారణ మనుషులకు ఒద్దనుకునే వైరాగ్యం ఎలా సాధ్యమవుతుంది? 
తన స్వీకారం కోసం వచ్చిన ప్రతి పదార్థాన్ని శివలింగానికి అర్పించి అనుభవించడమే వీరశైవుడు ఆచరాణగా పెట్టుకుంటాడు. అలా శివప్రసాదన్ని స్వీకరించేవాని శరీరము శివమయమై, శుభకరమై ఉంటుంది. 

విశ్లేషణ

బసవన్న ఇక్కడ షటస్థలములలో ఒకటైన ప్రసాది స్థలాన్ని వివరిస్తున్నారు. 

వీరశైవులు ప్రాపంచిక సుఖముల మధ్య బ్రతుకుతూ పాశములు అంటక జీవించాల్సి ఉంటుంది. దీనిని తామరాకుపై నీటి బిందువుతో పోలుస్తారు. ఎలాగైతే నీరు తామరాకుపై ఉంటూ, దానిని అంటుకోకుండా ఉంటుందో అలా మనిషి ఈ ప్రపంచంలో ఉంటూ విషయములపై ఎక్కువ ఇష్టం పెంచుకోకుండా ఉండడం. 

అలా ఉండడం ఎలా సాధ్యమవుతుంది? శరీరం, మనస్సు ఎప్పుడు ఏవో కావాలనే కోరుకుంటాయి కదా? చూపు, రుచి, వాసన, శబ్దము, స్పర్శ (శబ్ద,స్పర్శ,రస,రూప,గంధములు)  అనే జ్ఞానేంద్రియాలవల్ల కొన్ని అలవాట్లకు బానిసగా మారిన మనస్సు ఒద్దంటే వినడం ఎంత కష్టం? 
సన్యాసం స్వీకరించి ప్రపంచానికి దూరంగా బ్రతికేవారికైతే కొంత వరకూ వైరాగ్యం (ఒద్దనుకోవడం) అలవాటు చేసుకోవచ్చేమో! కాని అందరి మధ్యా, అన్నింటి మధ్యా ఉంటూ చేయడం ఎలా? మనస్సును గాడిలో పెట్టడం ఎలా?

ఈ కష్టాన్ని గ్రహించి, వీరశైవులు "భక్త" స్థలం  నుండి (శివ) "ఐక్య" స్థలం వరకూ వెళ్ళే షట్ స్థల మార్గంలో,  "ప్రసాది" స్థలాన్ని ఉంచారు. ప్రసాది స్థలాన్ని ఆచరించే వీరశైవుడు తను పొందినది, స్వీకరించే ముందు దానిని శివునికి అర్పిస్తాడు. అది తిను పదార్థమైనా, కట్టుకునే వస్త్రమయినా, ఆభరణమైనా, గృహమయినా, వాహనమైనా, ఏదైనా, చివరికి ఔషధమయినా సరే - దాన్ని శివునికి అర్పించక ముట్టుకోడు. ఇది చాదస్తం కాదు. ఈ మార్గము ఎలా ఉపయోగ పడుతుందో ఆలోచిద్దాం. 

  • మనము ఒక పదార్థాన్నిఇంకొకరికి అర్పిస్తే, దానిపై అధికారాన్ని కోల్పోతాము. అప్పుడు దానిపై సంపూర్ణ హక్కు తీసుకున్న వారిదౌతుంది. అలానే, నిండుమనసుతో శివార్పణం గావించిన పదార్థము మనది కాదు, శివునిది అనే భావన ఏర్పరుచుకోవడం జరుగుతుంది. అప్పుడు దానిని పొందే అధికారము మనకే గాక, ప్రపంచంలో అందరిదీను! అది తెలుసుకున్న నాడు ప్రతివాడు తను తినే ముందు ఇతరుల ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తాడు - అతడు "ప్రసాది". ఐతే ప్రపంచములో ప్రతీజీవీ  ఆకలి తీర్చే "అన్నానాంపతి" (అన్నానాంపతయే నమో - రుద్రా సూక్తం) శివుడే కదా?  మరి ప్రసాది అప్పుడు శివుడిగా మారాడా?! 
  • ఒక్కసారి వచనములో బసవన చెప్పిన దాన్ని జాగ్రత్తగా చూడండి  - " కూడలసంగమదేవునికిష్టమై వచ్చిన ప్రసాదం". ఇక్కడ, మనకిష్టమైనది అనుభవించమని చెప్పట్లేదు. శివునికి ఇష్టమైనది ప్రసాదమవుతుంది. అంటే, శివార్పణం చేసిప్రసాదాన్ని మాత్రమే గ్రహించేవాడు, శివునికి ఇష్టమైనవాటినే, అంటే సాత్విక వస్తువులనే సమర్పించ వలసి ఉంటుంది. అంటే చెడు (రాజసిక - those that cause anger, తామసిక - those which cause laziness) వస్తువులకు దూరంగా ఉండడం నియమప్రకారం  నేర్చుకుంటాడు. అంతే  గాక, అభక్ష్యభక్షణములు (మాంసము, వాటి సంబందితములు), ఆపేయపానములు (సురాపానము/సారాయి, మత్తుమందులు, ధూమ్రపానము మొదలైనవి) వంటి వాటికి దూరంగా ఉంటాడు- ఎందుకంటే వీటిని దేవునికి పెట్టలేడుగా!! మరి దీనివల్ల ప్రసాది దురలవాట్ల వాసన అంటక, తనకూ, తన కుటుంబానికి, తన సమాజానికి, నష్టములు కలిగించకుండా ఉంటూ అందరిని మంచి దారిలో ఉండటానికి ఒక ఉదాహరణగా నిలుస్తాడు. ఆధ్యాత్మికంగా జీవించడానికి అనువుగా తన శరీరాన్ని మలుచుకుంటాడు. ప్రసాది అంటే శివునికి నచ్చిన విధంగా శివార్పణభావంతో జీవించడం.    
  • ఏదయినా దేవునికి సమర్పించక ముందు నైవేద్యం అంటారు. పెట్టింతరువాత, దేవుడు స్వీకరించిన తరువాత అది ప్రసాదం అవుతుంది. ఐతే శివునికి నివేదన చేయడానికి తయారు చేసిన వస్తువు శుచి, శుభ్రత పాటించి చేస్తారు కదా? అంటే అలా ప్రసాదంగా మారిన దానిని స్వీకరిస్తే ఆరోగ్యంగా ఉంటారు కదా? అంటే ఎక్కడ పడితే అక్కడ తినే, ఎలా పడితే అలా తినే అలవాట్లకు (అలాంటి వస్తువులు శివునికి అర్పించడం కష్టం కదా) సాధ్యమైనంతగా దూరంగా ఉంటారు కదా?  దానివల్ల వ్యాధులకు దూరంగా ఉంటారు కదా?  
  • ఇది కేవలం తిను పదార్థాలకే కాకుండా ఇతరములకు కూడా అణ్వయించుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు కృషితో ధర్మసమ్మతంగా సంపాదించని ధనం (మోసం, లంచాలు మొదలైన వాటితో సంపాదించిన ధనం) నైవేద్యంగా  పనికిరాదు. అలాంటప్పుడు అలా సంపాదించిన ధనంతో తెచ్చిన వస్తువులు  ప్రసాదం కాజాలవు. కాబట్టి ప్రసాది వాటికీ దూరంగా ఉంటాడు!!
ఇప్పుడు చెప్పండి. ప్రసాదిగా బ్రతకడం మనకూ, సమాజానికి ఎంత ముఖ్యం? ప్రసాది విరాగి కన్నా కూడా గొప్పవాడేమో?  వీరశైవం మనో ప్రక్షాళణకూ, సమాజ ప్రక్షాళణకూ, తద్వారా శివోహ భావానికి తోడ్పడుతుందని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.                   




     

   
   
   

No comments:

Post a Comment