కన్నడ వచనం:
ನುಡಿದರೆ ಮುತ್ತಿನ ಹಾರದಂತಿರಬೇಕು!
ನುಡಿದರೆ ಮಾಣಿಕ್ಯದ ದೀಪ್ತಿಯಂತಿರಬೇಕು!
ನುಡಿದರೆ ಸ್ಫಟಿಕದ ಶಲಾಕೆಯಂತಿರಬೇಕು!
ನುಡಿದರೆ ಲಿಂಗ ಮೆಚ್ಚಿ ಅಹುದೆನಬೇಕು!
ನುಡಿಯೊಳಗಾಗಿ ನಡೆಯದಿದ್ದರೆಕೂಡಲಸಂಗಮದೇವನೆಂತೊಲಿವನಯ್ಯ
తెలుగు లిపిలో:
నుడిదరె ముత్తిన హారదంతిరబేకు!
నుడిదరె మాణిక్యద దీప్తియంతిరబేకు!
నుడిదరె స్ఫటికద శలాకెయంతిరబేకు!
నుడిదరె లింగ మెచ్చి అహుదెనబేకు!
నుడియొళగాగి నడెయదిద్దరె కూడలసంగమదేవనెంతొలివనయ్య
తెలుగు వచనం:
మాటలు ముత్యపు హారమువలె యుండాలి
మాటలు మాణిక్యపు కాంతివలే మెరవాలి
మాటలు స్ఫటికపు మెరుపువలే యుండాలి
మాటలు లింగము మెచ్చి అవునునిజమనాలి, కాని
మాటతప్పి నడచిన కూడలసంగమ దేవుడేలమెచ్చునయ్య?
వచనకర్త ఆంతర్యం:
మాటలు వ్యక్తమౌనప్పుడు నొప్పించనివై, ఒక్కొక్క పదం ముత్యమై, వాక్యము తెల్లని ముత్యాల హారంవలే అల్లుకుంటూ ఏంతో వినసొంపుగా ఉండాలి. అటువంటి వాక్కులో పనికిమాలిన విషయాలుగాక జ్ఞానము మాణిక్యపు కాంతివలే వెలువడాలి. గంభీరమైన విషయం చెబుతున్నా స్ఫటికపు పారదర్శకతలా ఎక్కడా స్పష్టత కొరవడకుండా, ఉన్నదున్నట్టుగా, నిర్మొహమాటంగా రాజిల్లాలి. ఆడిన మాట సత్యమై ఉండాలి. అప్పుడు అంతరంగం లోని శివుడు కూడా అవునని తలూపుతాడు. వినేవాల్లందరూ మెచ్చుతారు. అటువంటి మాటని గౌరవించి దానిపై నిలబడాలి కూడా!! కాని మాట వేరు, బాట వేరైతే అట్టివారిని శివుడు ఎలా మెచ్చుతాడు? దూరముంచడా?
విశ్లేషణ:
ఒక మనిషికి సమాజంతో ఉండే అనుబంధమంతా అతని మాటపై, నడవడిపై ఆధారపడి ఉంటుంది. బసవన్న ఈ వచనంలో ఆ మాటా, నడవడి ఎలా ఉండాలో చెబుతున్నారు. సమాజంలో ఉన్నప్పుడు అందరి హితం కోసం కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. అందులో అతి ముఖ్యమైనవి మంచి మాట, మాట నిలబెట్టుకోవడం.
పనికి మాలిన మాటలు, అహంకారపు వ్యాక్యలు, ఇతరులను దూషించడం, ద్వేషాన్ని పెంచడం వంటి మాటలవల్ల మనస్సు వికలమై, ఆ రోజే పాడై పోతూ ఉంటుంది .ప్రాజ్ఞులు అటువంటి వాటికి, అలాంటి వారికి సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూఉంటారు. అలాంటి మాటలు చాలాకాలం నుండి అలవాటై వాటివల్ల కలిగే దుష్ప్రయోజనాలను గ్రహించలేక అలాగే బ్రతుకుతున్న వాళ్ళు చాలామందిని, ప్రతీ ఇంట్లోచూస్తూ ఉంటాం.
అంతేగాక దుర్భాష పదజాలం కొంతమందికి వాడుక భాషగా మారిపోయింది. సమాజంలో గొప్పా హోదాలో ఉండి, ప్రతినిధులుగా ఉంటూ ఏంతో భాధ్యతతో ఉండవలసిన ప్రముఖులు కూడా దుర్భాషలాడడం చూస్తూ ఉన్నాం. వారికి తప్పూ చేస్తున్నామన్న భావన కూడా ఉండదు.
ఈ సమస్యలు ఇంత వ్యాపించిన కారణం చేత, బసవన్న మాటలు ఎలా ఉండాలో చెబుతున్న విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. స్వయంగానే ఎవరికి వారే కాకుండా, ముఖ్యంగా ఇంట్లో పిల్లలకి నిత్యం గుర్తుచేస్తూ, వారి మాటలను అప్రమత్తతతో గమనిస్తూ ఉండాలి.
మంచి మాటలు మాట్లాడండి. ఆడే ముందు ఆలోచించండి. ఆడిన మాటలో అర్థం ఉండాలి, జ్ఞానం ఉండాలి, సత్యం ఉండాలి, స్పష్టత ఉండాలి. అప్పుడు అందరికి ఆమోదయోగ్యమౌతాయి. ధర్మము చేత అంగీకరించబడతాయి. శివునికి నచ్చుతాయి.
మాటలాడటం ఒకెత్తయితే, మాట మీద నిలవడం ఇంకొక ఎత్తు. మాటిచ్చి నిలవకపోవడం మోసo. మోసకారులను మనుషులు సహించరు, శివుడూ సహించడు!! కాబట్టి మాట ఇచ్చే ముందు కూడా విశేషంగా ఆలోచించ వలసిందే.
కొందరికి మోసం చేసే ఉద్దేశ్యం లేకపోయినా సాధ్యాసాధ్యాలు విచారించకుండా మాటిచ్చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటి మాటలవల్ల తమతో పాటు ఇతరులను కూడా కష్టాల పాలు చేస్తూ ఉంటారు. దానివల్ల మనస్పర్ధలు, జగడాలు వగైరా! కాబట్టి మాటిచ్చే ముందు కూడా జాగ్రత్త; నిలబడగలనా? అని పదిసార్లు ఆలోచించవలసిందే.
నిజమేకదా? వీటిని సరిదిద్దుకుంటే న్యాయస్థానాల్లో సగం సమస్యలు తగ్గిపోతాయి.
No comments:
Post a Comment