Friday, February 27, 2015

9. Enaginta Kiriyarilla - Basavanna

కన్నడ వచనం 

ಎನಗಿಂತ ಕಿರಿಯರಿಲ್ಲ!
ಶಿವಭಕ್ತರಿಗಿಂತ ಹಿರಿಯರಿಲ್ಲ.
ನಿಮ್ಮ ಪಾದ ಸಾಕ್ಷಿ ಎನ್ನ ಮನ ಸಾಕ್ಷಿ!
ಕೂಡಲಸಂಗಮದೇವಾ ಎನಗಿದೇ ದಿಬ್ಯ.



తెలుగు లిపిలో 
ఎనగింత కిరియరిల్ల, శివభక్తరిగింత హిరియరిల్ల!
నిమ్మ పాద సాక్షి, ఎన్న మన సాక్షి
కూడలసంగమదేవా ఎనగిదే దిబ్య. 

తెలుగు వచనం 
నాకన్నా అల్పులు లేరు, శివభక్తుల మించు శ్రేష్ఠులు లేరు! 
నీ పాద సాక్షి , నా మనస్సు సాక్షి  
కూడలసంగమదేవా నాకిదే దివ్యం!

వచనకర్త ఆంతర్యం:
శివభక్తుల ముందు నా స్థానం చాలా చిన్నదని తలచి శరణు-శరణార్థి అని పలకాలి. అవి కేవలం వాడుక పదములేగాక శివచరణార్పితమైన మనస్సాక్షిగా నమ్మిన మాటలు, చేసే ప్రమాణం. అటువంటి విశ్వాసమే నాకు దివ్యపదం.   

విశ్లేషణ:

ఈ చిన్న వచనంలో భక్తుడు తన మనస్సును నిర్దేశించుకోవడాన్ని, ఇతరులతో వ్యవహరించే విధానాన్ని చెబుతోంది.  

వీరశైవులు పాటించే ఆచారాలలో భృత్యాచారం ఒకటి. బసవన్నఈ ఆచారాన్ని తన జీవన శైలిలో జీర్నింపజేసి చూపిన ఘటనలు అతని చరిత్రలో చాలా కనిపిస్తాయి. అయితే భృత్యాచారాన్ని పాటించేవాడు ఆలోచించే విధానన్ని ఈ వచనం స్పష్టంగా చుపెడతోంది. ఇది బసవన్న తనకు తాను వ్రాసుకున్న వచనంగా అగుపిస్తోంది. 

సాధారణంగా నేను ఇతరులకంటే గొప్పవాన్ని కావాలనే తాపత్రయం ప్రతివానికి మానసికంగా అలవాటు పడి ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఇతరులతో పోటీపడి జగడాలుపడుతూ ఉంటారు. ఈ కాలములో చదువులో, ఆటలలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, అన్నింటిలో పోటీలు అధికమైనాయి. అయితే ఈ పోటీలు ఆరోగ్యకరమైతే ఫరవాలేదు. చాలా సందర్భాలలో నేను "ఇతరులకంటే గొప్పవాణ్ణి అనిపించుకోవాలనే"  అలోచన, చుట్టూ ఉండే వాతావరణాన్ని మార్చి మనస్పర్ధలకు, అనవసర తగవులకు  దారి తీస్తాయి. కొన్ని సార్లు ప్రత్యక్షంగా కనబడతాయి. కొన్నిసార్లు పరోక్షంగా మనకు తెలియకుండానే మనస్సును తొలుస్తూ ఉంటాయి. 
ఈ వ్యవహారం వ్యక్తులకే గాక సమాజాలకు, జాతులకు, దేశాలకూ వర్తిస్తాయి. ఉదాహరణకు కొన్ని దేశాలు తమ ఆధిక్యాన్ని చాటుకోవడానికి పరోక్షయుద్ధం (cold war) లో చాలాకాలం ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా తమ మతం ఇతరుల మతం కన్నా గొప్పదన్న భావంతో హింసకు పాల్పడుతున్న వారిని చూస్తున్నాము.        

ఈ విషయాన్నీ కొంచం పరిశీలిస్తే, ఒక వ్యక్తి తను గొప్పవాడు కావాలనో, గొప్ప పని చేయాలనో అనుకోవడంలో తప్పులేదు. కానీ ఇతరులకన్నా అధికున్నని అనుకోవడం, గొప్ప వస్తువులన్నీ ఇతరులకు కాక తనకే చెందాలనుకోవడంవల్ల మాత్రమే ముప్పు వస్తుంది. ఈ మహా ప్రపంచంలో ప్రతీ జీవికి ఎదో ఒక విషయంలో ప్రావిణ్యం పొంది రాణించగలిగే సామర్థ్యం ఆ శివుడే కలిగించాడు. ఏ ఒక్కరు  అన్నివిషయాల్లో శ్రేష్ఠులు కాలేరు. ఈ జగత్తులో ఒకరిపై ఒకరం ప్రత్యక్షంగానో పరోక్షంగానో అధారపడవలసిందే.  అంతెందుకు ఆ శివుడే అన్నిజీవుల యందు ఉన్నవాడు, వారి రూపంలో ఉంటాడు అని భావించినప్పుడు ఇతరులను, వారి సామర్థ్యం తెలిసినా తెలియక పోయినా, ముందు వారిని గౌరవించడం అలవాటవుతుంది. ఇంట్లో పని చేసే పనిమనిషిని కూడా "ఏమమ్మా" అని గౌరవంగా సంభోదించడం మొదలవుతుంది.  
గొప్పగా మారడం దైవప్రవుత్తి అయితే, గొప్పవన్నీ తనకు మాత్రమే చెందాలనుకోవడం రాక్షస లక్షణం. అంటే గొప్ప పనులు చేయడం, ఇతరులకన్నా నేను గొప్పవాన్ననుకోవడం - ఈ రెంటి మధ్య ఒక కనిపించని సరిహద్దు ఉంది.  మనస్సుకి ఈ సరిహద్దును అలవాటు చేయడం ఇక్కడ చేస్తున్న ప్రస్తావన. 

నేను ఇతరులకన్నాఅధికున్నికాను అనే వినయాన్ని అలవరచుకోవడం, నేను చిన్నవాన్ని అన్న దానిలో తృప్తిచెందడం చాలా అవసరమని ఈ వచనం గుర్తు చేస్తుంది. ఒక పెద్ద అధికారిక పదవిలో ఉన్న వ్యక్తికి, లేదా కొన్ని ఘనకార్యాలు సాధించిన వ్యక్తికి ఇలాంటి అనకువ భావం కలగడం కొంచం కష్టమే.గర్వపడే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కానీ వినయాన్నిఅలవరచు కోవడం చాలా ముఖ్యం. అది ఇతరుల ప్రబోధాల వల్ల సాధ్యం కాదు. ఇలాంటి సూచనను ఎవరికి వారు తమ మనస్సుకు చెప్పుకుంటూ ఉండాలి.  అందుకే ఇది ఇతరులకు భోదించడానికి వ్రాసిన వచనంలా కాకుండా తనకు తాను వ్రాసుకున్న వచనంలా చెప్పబడింది. బసవన్న ఒక దేశానికే ప్రధానమంత్రి పదవిలో ఉన్నవాడు. చక్రవర్తి చేత గౌరవించబడిన వాడు. ఒక నూతన సమాజానికి పునాది వేసిన వాడు. మరి అంతటి ఉన్నత పదవిలో ఉన్న బసవన్న శివశరణుల, జంగమల పాదాక్రాన్తుడయ్యేవాడు. అది ఎలా కుదిరింది? అంటే, ఈ వచనాన్ని నిత్యం మనస్సుకి అలవరచు కోవడం వల్ల. 

ఈ భావాన్ని తరువాతి కాలంలో చాలామంది భక్తులు స్వీకరించారు. ఉదాహరణకు త్యాగరాజ  పంచరత్న కీర్తనలలో మిక్కిలి ప్రాచుర్యం పొందిన "ఎందఱో మహానుభావులు, అందరికీ వందనములు" అందరికి పరిచయమే. 

తను చేస్తున్న ప్రతిపనిని శివాజ్ఞగా భావిస్తే, ఎదైనా ఘనత కలిగే కార్యం చేస్తే అది తన గొప్పతనముగా కాక శివుడిచ్చిన అవకాశంగా,  ఆపనిలో కీర్తి లభిస్తే దాన్ని శివుని ఉపకారంగా మనస్సుకు అలవాటు చేయడం వల్ల ఈ అణకువతనం (Modesty) మనోలక్షణమవుతుంది.     

ఇక రెండో ప్రస్తావన శివభక్తుల గొప్పదనం. 
శివభక్తులంటే తమ తన, మన, ధన, ప్రాణాలను శివాధీనం చేసి, స్వార్థాన్ని మరచి, లోక శ్రేయస్సుకై పాటుపడేవారు. దధీచి వృత్తాంతాన్ని గుర్తు చేసుకోండి. ఒకనాడు దక్ష యజ్ఞంలో దక్షున్నీ, దేవతలనూ ఆక్షేపించిన శివభక్తుడు. అక్కడ జరుగుతున్న విపరీతాన్ని నిర్మొహమాటంగా ప్రతిఘటించి వెళ్లిపోయాడు. అదే దధీచి అవసరం పడిననాడు, మరోమారు ఆలోచించక, ప్రాణ త్యాగంచేసి తన వెన్నెముకను వజ్రయుధానికి ధారపోసాడు. శివభక్తులంటే అలా ఉంటారు. తమ జీవితాన్ని కేవలం శివారాధనకు అర్పించి, నిత్య శివస్మరణతో, శివోహ భావంతో, శివ జ్ఞానాన్ని పంచుతూ, లింగాంగ సామరస్యంతో, సంచరించే శివస్వరూపులైన శివభక్తులకంటే గొప్పవారుంటారా? 
వారిని గౌరవించడం, వారి ఆజ్ఞను శిరసావహించడం ఎంత ముఖ్యమో తెలిసి ఈ భావాన్ని అలవరచుకోవడం, పాటిస్తానని ఆ శివుని సాక్షిగా ప్రమాణం చేసుకోవడం ప్రతీ వీరశైవుని ధర్మం.   

శరణు శరణార్థి !!               

                           



  

Sunday, February 22, 2015

8. Papiya Dhana Prayashcittakkallade - Basavanna

కన్నడ వచనము:

ಪಾಪಿಯ ಧನ ಪ್ರಾಯಶ್ಚಿತ್ತಕ್ಕಲ್ಲದೆ, ಸತ್ಪಾತ್ರಕ್ಕೆ ಸಲ್ಲದಯ್ಯ!
ನಾಯ ಹಾಲು ನಾಯಿಂಗಲ್ಲದೆ, ಪಂಚಾಮೃತಕ್ಕೆ ಸಲ್ಲದಯ್ಯ!
ನಮ್ಮ ಕೂಡಲಸಂಗನ ಶರಣರಿಗಲ್ಲದೆ
ಮಾಡುವ ಅರ್ಥ ವ್ಯರ್ಥ ಕಂಡಯ್ಯ.


తెలుగు లిపిలో: 

పాపియ ధన ప్రాయశ్చిత్తక్కల్లదె, సత్పాత్రక్కె సల్లదయ్య!
నాయ హాలు నాయింగల్లదె, పంచామృతక్కె సల్లదయ్య!
నమ్మ కూడలసంగన శరణరిగల్లదె 
మాడువ అర్థ వ్యర్థ కండయ్య. 

తెలుగు వచనం:

పాపపు ధనము ప్రాయశ్చిత్తమునకుగాక సత్పాత్రకు చెల్లదయ్యా!
కుక్క పాలు కుక్కలకుగాక పంచమృతమునకు చెల్లదయ్యా!
మా కూడలసంగని శరణులకైగాక చేసెడి అర్థము వ్యర్థము చూడయ్య.

వచనకర్త ఆంతర్యం:

పాపపు సంపాదన సత్కార్యములకు పనికిరాదు. పశ్చాత్తపముతో చేయు ప్రాయశ్చిత్తమునకు పని చేయునేమో! ఎలాగంటే కుక్కపాలు కుక్కపిల్లకు మాత్రమే ఉపయోగపడును కాని పంచామృతమునకు గాదు. అంతేగాక శివశరణులను విస్మరించి చేసే ధనార్జన, ధనసేకరణ కూడా వ్యర్థమే!   

విశ్లేషణ:

 ఈ వచనం సంపాదన విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గుర్తుజేస్తూ, అలాంటి ధనాన్ని ఇతరులతో పంచుకునే విషయాన్నీ బోధిస్తోంది. 

పాపపు ధనము అంటే మోసము, దొంగతనము, లంచము, జూదము, హింస, వేట వంటి వాటివల్ల తెచ్చిన ధనము. అలాంటి ధనం ఈ పాపములు తెలిసి ప్రాయశ్చిత్తము చేసుకోవాలనుకునే కార్యాలకు పనికి వస్తుందే కాని, దైవకార్యాలకు, మంచివారికి ఇచ్చే దానానికి పనికిరాదు.  ఈనాడు దేవాలయాల్లో వేస్తున్న నల్లధనాన్ని చూస్తూ ఉన్నాము. దుష్ట సంపాదనను ఎలా దాచుకోవలో అర్థంకాక  హుండీలో వేయడం, దేవునికి వజ్రపుకిరీటలు చేయించడం వంటివి వాళ్ళని కాపాడతయానుకోవడం మూర్ఖత్వం. ఇదే విషయాన్ని ఈ వచనం ప్రాబోధిస్తుంది. దేవాలయ నిర్వాహకులు దీన్ని కొంచం గంభీరంగా ఆలోచిస్తే , అలానే కొన్ని నిబంధనలను, తనిఖీలను (checks and balances) ఏర్పాటు చేస్తే, దుష్టధనాన్ని దేవునికి అర్పించవద్దని తీర్మానిస్తే బావుంటుంది. 

అయితే నిత్యం సంపాదించే విషయంలో ప్రతిఒక్కరు దీని గురించి ఆలోచిస్తే సమాజాన్ని పట్టి పీడిస్తున్న లంచగొండితనం, నల్లధనం, ఘరానా మోసాలు (scams), వరకట్నం వంటి కీలక సమస్యలను తొలగించవచ్చు. 

భాధ్యతాయుతమైన ఉద్యోగాలలో ఉండే వ్యక్తులు కొంతమంది లంచం తీసుకోవడం వాళ్ల అధికారంగా భావిస్తున్నారు. దానిని సమర్థించుకునేందుకు యేవో పొంతులేని కారణాలను వెతికి బహిర్గతంగా సిగ్గువిడిచి చెప్పుకుంటారు. దుర్మార్గపు ధనం ఎంత అనుపయోగకరమో, అది దానానికి కూడ అర్హం కాదని, దాన్ని భగవత్కార్యాలకు ఉపయోగించకూడదని తెలుసుకుంటే, అలాంటి ధనాన్ని స్వంత ప్రయోజనాలకు వాడడంవల్ల ఎంత దోషమో అర్థం చేసుకోగలుగుతారు. 

అంతే గాక పరులసొమ్ము పనికి రానిదని నమ్మితే, స్వయంకృషిపై ఆధారపడి బ్రతుకుతారు. తమ పెద్దలు తమకు ఆస్తులు ఇవ్వలేదనే తాపత్రయం, వాటివల్ల కుటుంబంలోనే జరిగే తగాదాలు వంటివి పోతాయి. వరకట్నం పేరుతో ఇతరుల ధనంపై ఆశలు పెంచుకోవడంవంటివి ఎంత చెడుఅలవాట్లో అర్థమై తమ కష్టార్జితం కానిది ముట్టుకోరు.   

ఈ వచనంలో అలాంటి పాపపు ధనాన్ని కుక్కపాలతో పోల్చారు బసవన్న!  కుక్కపాలు మనుషులు త్రాగగలరా? అసలు పిల్లలకు ఇవ్వవలసిన వారసత్వములు -  వినయంతో కూడిన విద్య, తమ కాళ్ళపై తాము నిలబడి ఇతరులకు సహాయ పడగలిగే సామర్త్యం, అచంచలమైన శివభక్తి తప్ప ధనము, ఆస్తులు కావని గ్రహించి, వారికి చిన్నతనం నుండే ఆ అలోచనలను నూరిపోస్తే వాళ్ళ భావిష్యత్తులో ఒకవిధంగా శాంతిని నింపినవారిమవుతాము. దానివల్ల వార్ధక్యంలో (ముసలితనంలో) మనమూ శాంతంగా ఉండగల్గుతామని  నా అభిప్రాయము.

ఇక సంపాదించిన ధనాన్ని శివశరణులకు ఉపయోగపడకపోతే అది వ్యర్థమని ఇంకొక ప్రతిపాదన. శివశరణులంటే సమాజ శ్రేయస్సుని కోరేవారే. వాళ్ళకి అర్పించిన ధనాన్ని తమ స్వార్థ ప్రయోజనాలకు వాడనివారు. అవసరమైన వారికి ఉపయోగపడేలా వనరులను సమకూర్చేవారు. అలా అవసరమున్న వారిని అక్కున చేర్చి వారికి విద్యనేర్పి ప్రయోజకులను చేసే మఠాలు ఈనాటికీ ఉన్నాయి. 

వీరశైవులు పాటించే ఆచారాలలో గణాచారం, భృత్యాచరము వంటివి  దాసోహం, దానము, శివశరణులకు అర్పించిన తరువాతగాని భుజించక పోవడం వంటి  సద్గుణాలను నేర్పుతాయి. ఇలాంటి ఆచారాలను పాటించే మహానుభావులు ఇప్పటికి ఉన్నారు.అన్నీ చేయడం మాకిప్పుడప్పుదే సాధ్యం కాదేమో అనుకోవడం సబబే. అయితే మనకు సాధ్యమైనంత చేయగలము కదా:  కష్టపడి సంపాదించిన ద్రవ్యంలోకొంతైనా సత్పాత్రదానం చేయగలమా? ప్రయత్నపూర్వకంగా మంచి పనులు చేస్తున్న సంస్థలకు సహాయపడగలమా? మనము తినేముందు చుట్టూ ఉన్నవారు తిన్నారో లేదో తెలుసుకోగలమా? వారితో పంచుకోగలమా? ఇతరుల నుండి ఏమి ఆశించకుండా వారి కష్టాలను తెలుసుకోగలమా?అటువంటివి అలవాటు చేసుకుంటే శివశరణులను తృప్తి పరిచినట్లే.  తద్వార ఈ వచనాన్ని జీవనవిధానంలోకి కూడా జీర్ణింపజేయగలము.  

       


              

Friday, February 20, 2015

7. Madidenembudu manadalli holedare - Basavanna

కన్నడ వచనము 

ಮಾಡಿದೆನೆಂಬುದು ಮನದಲ್ಲಿ ಹೊಳೆದರೆ

ಏಡಿಸಿ ಕಾಡಿತ್ತು ಶಿವನ ಡಂಗುರ.

ಮಾಡಿದೆನೆನ್ನದಿರಾ ಲಿಂಗಕ್ಕೆ, ಮಾಡಿದೆನೆನ್ನದಿರಾ ಜಂಗಮಕ್ಕೆ!

ಮಾಡಿದೆನೆಂಬುದು ಮನದಲಿಲ್ಲದಿದ್ದರೆ

ಬೇಡಿದ್ದನೀವ ಕೂಡಲಸಂಗಮದೇವ!



తెలుగు లిపిలో:

మాడిదెనెంబుదు మనదల్లి హొళెదరె
ఏడిసి కాడిత్తు శివన డంగుర
మాడిదెనెన్నదిరా లింగక్కె, మాడిదెనెన్నదిరా జంగమక్కె!
మాడిదెనెంబుదు  మనదలిల్లదిద్దరె 
బేడీద్దనీవ కూడలసంగమదేవ! 

తెలుగు వచనము:
చేసితినని మనసునదలిస్తే 
ఏసి వేటాడు శివుని డమరుకం 
చేసితిననకు లింగమునకు, చేసితిననకు జంగమమునకు 
చేసితినని మనసున లేకున్న 
వేడినదిచ్చును కూడలసంగమ దేవుడు!

వచనకర్త ఆంతర్యం:
చేసితినని తలంచిన వెంటనే అహంకారము వెంటాడుతుంది. తదహంకారము శివుని డమరుకం వలే నిన్ను వేటాడి నాశన హేతువౌను. అందుకే చేసేది నేనని అహంకారించకు. లింగమును పూజించినా, జంగమమున కర్పించినా నే చేసితినని తలంచకు. శివాజ్ఞగా గ్రహించి, చేసినది నేనని తలంచకున్న, ఆ శివుడే ఈప్సితములు తీర్చును. 

విశ్లేషణ:

బసవన్న ఈ వచనంలో రెండు విషయాలు చర్చించారు:
1. నిష్కామకర్మ
2. అహంకారముపై హెచ్చరిక 

ఏ సుకర్మ చేసినా దానిని నేను చేసాననే మనోవికల్పము వెంటనే కల్గుతుంది.  ఉదాహరణకు నేను ఆ బడి కట్టించాను, ఆ గుడిలో ఇంత దానము చేసాను అని ప్రకటించుకోవడం మనకు నిత్యం కనబడుతూ ఉంటుంది. అంతెందుకు మీరు ఒక గుడికి వెళ్లి చూసినా, సత్రానికి వెళ్లి చూసినా, ప్రతీ వస్తువుపై దాత పేరు వ్రాసుకుంటున్నారు. గోడ పైన, తలుపుల పైన, చివరకు చిన్న వ్యజనపు రెక్కపై  (fan's blade) కూడా దాత పేరు కనబడుతుంది. అంటే దాత ఆ వస్తువు దానంగా ఇచ్చిన తరువాత కూడా దానిపై తన అధికారాన్ని ప్రకటించుకుంటున్నాడు. అలాంటిది దానమవుతుందా? 

వీరశైవులకు ఇచ్చిన దానిని తలంచడం నిషేధమని బసవన్న గట్టిగ చెబుతున్నారు. అలా చేయడం దోషమని, అలాంటి వారిని శివుని డమరుకం వెంటాడుతుందని, పీడిస్తుందని చెప్పడం ఉపమానం. ఒక మనిషి తను చేసిన పనిని తలంచుకొని గర్వపడితే, వెంటనే అంతరంగంలో బుద్ధి యొక్క హెచ్చరిక వినిపిస్తుంది. ఆ హెచ్చరికను డమరుక నాదంతో పోలుస్తున్నారు. అహంకారం పెరిగేకొద్దీ హెచ్చరిక పెరిగి వెంటాడుతూనే ఉంటుంది. 

అయితే ఈ గర్వపడడం బహిర్గతంగా ఇతరులతో అననక్కరలేదు - అంటే నే చేసాననే గొప్పదనం ఇతరులతో చెప్పుకునే దాకా కూడా కాదు. మనస్సులో తలచినంత మాత్రముచేత తప్పుచేసిన వాడి వవుతావని అంటున్నారంటే, ఎంత జాగ్రత్తగా మనోవ్యవహారాన్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ఉండాలో అర్థం చేసుకోవాలి. ఎవరి మనస్సులో వారే తమ దోషాలను నివారించుకోవాలి అనేది ఇక్కడ ఉద్దేశ్యం. 

ముఖ్యంగా వీరశైవులు ఆచరించే లింగారాధన, జంగమారాధన విషయంలో గర్వించడం, డాంబికాన్ని ప్రదర్శిండం క్షమించరాని అపరాధమవుతుంది.    

వీరశైవులు ఏ కార్యం/కర్మ చేసినా శివార్పణా భావంతో చేస్తారు. సద్గురువు నుండి శివదీక్ష స్వీకరించిన శిష్యునికి సంచితకర్మలన్నీ(accumulation of deeds from previous births) గురుకటాక్షంతో హరించుకు పోతాయని విశ్వాసం. అంతే గాక కర్మకాండలకు దూరంగా ఉంటారు - యజ్ఞయాగాదులు వంటివి చేయరు. ఉదాహరణకు ధనం కలగాలని కొందరు పూజలు చేయిస్తుంటారు. కొందరు స్వర్గానికి వెళ్తామని యజ్ఞం చేయిస్తారు. ఇలాంటివి ఫలితాలు కలగడానికి చేసే కర్మకాండలు వీరశైవులకు నిషేదించబడ్డాయి. ఏమీ ఆశించక చేసే గురు, లింగ, జంగమ పూజ మాత్రమే వీరశైవధర్మఆచారం.   

అయితే జీవితం కొనసాగించాలంటే కర్మ చేయడం తప్పదు కదా? మరి ఈ జన్మలో చేసే కర్మల ఫలం మాటేమిటి? ఒక మంచి వ్యక్తిగా జీవించాలంటే మంచి పనులు మాత్రమే చేయాలి - అంటే  ఇష్టలింగ పూజ, గురు పూజ, జంగమ పూజ,దాసోహం, దానం మొదలైనవి. వీటి కర్మఫలం (results of tasks) మనని అంటకుండా ఉండాలంటే, ఎలా? 

ప్రతి కర్మని శివార్పణ భావంతో, అంటే శివుడే చేయిస్తున్నడన్న భావంతో చేస్తే, అంతేగాక వాటి ఫలితాలు శివునికే అర్పిస్తే, ఆ కర్మలు చేసినా వాటి ఫలితాలు అంటవు. ఇది ఒక మానసిక ప్రక్రియ (mental tuning).  నీ మనస్సులో నీవు ఇది నా గొప్పదనం అని అహంకరించకుండా, శివుని కృపవల్ల చేయగల్గుతున్నాననే అనకువను అలవరచుకోవడం. ముందు నోటితో అన్నా, క్రమంగా ఈ శివార్పణ భావం మనస్సుకి అలవాటైపోతుంది.  అలా చేసిన కర్మ నిష్కామ కర్మ అవుతుంది. అలా జీవించిన వాడు జీవన్ముక్తికి , అంటే చావుకు కాదు - శివసాయుజ్యానికి, అర్హతను సంపాదించుకుంటాడు. 

అయితే సంసారంలో ఉన్నవానికి ఈప్సితములు (నిత్య అవసరములు, కోరికలు) ఉంటాయి కదా? అని అడిగితే  అవి శివుడే తప్పకుండా అనుగ్రహిస్తాడని బసవన్న చెబుతున్నారు . 

పని చేయడం మానమని కాదు. పని చేస్తు శివుని కృపగా తలంచి చేయాలి, అని.  
పని చేయటం వరకు నీ బాధ్యత - ఇవ్వటం ఆయన బాధ్యత.  

ఈ వచనం మనం ప్రతిక్షణం ఆలోచించవలసిన ఆంతరంగిక హెచ్చరికగా అలవాటు చేసుకోవాలి.      



         


   


     

Sunday, February 15, 2015

6. Kalabeda Kolabeda - Basavanna

కన్నడ వచనం 

ಕಳಬೇಡ, ಕೊಲಬೇಡ, ಹುಸಿಯ ನುಡಿಯಲು ಬೇಡ,
ಮುನಿಯ ಬೇಡ, ಅನ್ಯರಿಗೆ ಅಸಹ್ಯಪಡಬೇಡ.
ತನ್ನ ಬಣ್ಣಿಸಬೇಡ, ಇದಿರ ಹಳಿಯಲು ಬೇಡ.
ಇದೇ ಅಂತರಂಗಶುದ್ಧಿ! ಇದೇ ಬಹಿರಂಗಶುದ್ಧಿ!
ಇದೆ ನಮ್ಮ ಕೂಡಲಸಂಗನನೊಲಿಸುವ ಪರಿ.


తెలుగు లిపిలో 
కళబేడ, కొలబేడ, హుసియ నుడియలు బేడ,
మునియ బేడ, అన్యరిగె అసహ్యపడబేడ 
తన్న బణ్ణిసబేడ, ఇదర హళియలు బేడ
ఇదే అంతరంగశుద్ది! ఇదే బహిరంగశుద్ధి!
ఇదే నమ్మ కూడలసంగమనొలిసువ పరి.          

తెలుగు వచనం:
దొంగాలించకు, వధించకు, అసత్యము పలుకకు, 
కోపగించకు, ఇతరులను అసహ్యపడకు, 
తన్ను పొగుడు కొనకు, ఇతరుల చిన్నబుచ్చకు
ఇదే అంతరంగ శుద్ధి! ఇదే బహిరంగశుద్ధి!
ఇదే మా కూడలసంగమునిజేర్చు దారి. 

వచనకర్త ఆంతర్యం:
దురలవాట్లైన దొంగతనము, హింస, అసత్యము, క్రోధము, ఇతరులపట్ల అసహ్యము, స్వయంస్తుతి, పరనింద వంటి వాటికి దూరంగా ఉండటంవల్ల బహిరంగశుద్దే గాక, ఆత్మశుద్ధి కూడా కలుగుతుంది. మనస్సు నిర్మలమవుతుంది. అటువంటి మనస్సుతో మాత్రమే శివానుభవం ప్రాప్తిస్తుంది. 

విశ్లేషణ:

కన్నడనాట అత్యంత ప్రాచుర్యమైన ఈ వచనం అందరూ సుఖంగా ఉండటానికి వదుల్చు కోవలసిన దురలవాట్లను ప్రస్తావిస్తోంది. ఒక వైపు నీతిని చెబుతూనే, శివానుగ్రహానికి అనువుగా శరీరాన్ని, మనస్సుని మలచుకోడానికి చేయవలసింది బసవన్న సూచిస్తున్నారు. 

 కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాల ప్రభావం వల్ల కలిగే సప్తవ్యసనాలు (దొంగతనం, సురాపానం, పరస్త్రీకాంక్ష, జూదము, వేట, వాక్పారుష్యం, పరనింద) మనస్సుని పట్టి పీడించే మాలిన్యాలుగా మారుతాయి. అలాంటి మాలిన్యాలతో కలుషితమైన మనస్సు వల్ల మనిషి యొక్క ప్రవర్తన కూడా చెడుగా మారుతుంది.    

ఐతే బాహ్యదేహాన్ని రోజు స్నానంతో శుభ్రపర్చినట్టే, మనస్సుని శుభ్రపరచుకొనే ప్రయత్నం చేయడం అవసరం. అలా చేయాలంటే నిత్యం ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉండాలి. మన నిత్య ప్రవర్తనలో వ్యక్తమయ్యే చిన్నచిన్న తప్పులను అంతరంగం ఎప్పుడు సూచిస్తూ ఉంటుంది. కానీ ఆ అంతరంగ సూచనలను మనం విస్మరిస్తూ ఉంటాం. ఐతే ప్రాజ్ఞులు అప్రమత్తంగా చిత్తం చెప్పే విషయాన్నీ వింటూ, తమ తప్పులను తామే గుర్తించి దాని వెనకాల ఉండే కారణాలను కనిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఆ కారణాలను సరిదిద్దుకుంటారు.ఈ పద్ధతి అలవాటు చేసుకుంటే మనోమాలిన్యాలను శుభ్రం చేసుకోగల్గుతాము. ఈ ఆత్మపరిశీలనకు  ధ్యానము, సత్సాంగత్యము, భగవత్ జ్ఞాన సముపార్జనము కూడా చాలా తోడ్పడతాయి. 

అలా అంతరంగ (మనస్సు యొక్క) శుద్ధి కలిగినప్పుడు, మనిషి వ్యక్తిత్వము, ప్రవర్తన సాత్వికామై బహిరంగంగా కూడా ఎవరినీ నొప్పించక, తానొవ్వక బహిరంగ శుద్దుడవుతాడు. ఇదే అంతరంగశుద్ది! ఇదే బహిరంగశుద్ధి!

అలా శుద్ధమైన మనస్సుతో మాత్రమే శివజ్ఞానం కలిగి, ఆ దారిలో శివున్ని చేరుకోగలము, శివమైపోగలం .    

             
     
  

Friday, February 13, 2015

5. Ollenembudu Vairaagya - Basavanna


కన్నడ వచనం:

ಒಲ್ಲೆನೆಂಬುದು ವೈರಾಗ್ಯ, ಒಲಿವೆನೆಂಬುದು ಕಾಯಗುಣ. ಆವ ಪದಾರ್ಥವಾದರೇನು?
ತಾನಿದ್ದೆಡೆಗೆ ಬಂದುದ ಲಿಂಗಾರ್ಪಿತವ ಮಾಡಿ ಭೋಗಿಸುವುದೇ ಆಚಾರ !
ಕೂಡಲಸಂಗಮದೇವನ ಒಲಿಸ ಬಂದ ಪ್ರಸಾದಕಾಯವ ಕೆಡಿಸಲಾಗದು


తెలుగు లిపిలో:

ఒల్లెనెంబుదు వైరాగ్య, ఒలివెనెంబుదు కాయగుణ; ఆవపదార్థవాదరేను!!
తానిద్దెడెగె బందుద లింగార్పితవ మాడి భోగిసువుదే ఆచార
కూడలసంగమదేవన  ఒలిస బంద ప్రసాదకాయవ కెడిసలాగదు 

తెలుగు వచనం:

వలదనుకోవడం వైరాగ్యం, ఇష్టపడడం కాయగుణం 
తనవద్దకు వచ్చినది లింగార్పితము చేసి అనుభవించడం ఆచారం !
కూడలసంగమదేవునికిష్టమై వచ్చిన ప్రసాదకాయము చెడునదికాదు 


వచన కర్త ఆంతర్యం:

విషయ సుఖములపై విరక్తి చెందడం వైరాగ్యం అవుతుంది. కానీ శరీరము, మనస్సు కావాలని అడుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు స్వీకరించకుండా ఉండగలమా? అంతే గాక ఈ భౌతిక ప్రపంచంలో జీవించే సాధారణ మనుషులకు ఒద్దనుకునే వైరాగ్యం ఎలా సాధ్యమవుతుంది? 
తన స్వీకారం కోసం వచ్చిన ప్రతి పదార్థాన్ని శివలింగానికి అర్పించి అనుభవించడమే వీరశైవుడు ఆచరాణగా పెట్టుకుంటాడు. అలా శివప్రసాదన్ని స్వీకరించేవాని శరీరము శివమయమై, శుభకరమై ఉంటుంది. 

విశ్లేషణ

బసవన్న ఇక్కడ షటస్థలములలో ఒకటైన ప్రసాది స్థలాన్ని వివరిస్తున్నారు. 

వీరశైవులు ప్రాపంచిక సుఖముల మధ్య బ్రతుకుతూ పాశములు అంటక జీవించాల్సి ఉంటుంది. దీనిని తామరాకుపై నీటి బిందువుతో పోలుస్తారు. ఎలాగైతే నీరు తామరాకుపై ఉంటూ, దానిని అంటుకోకుండా ఉంటుందో అలా మనిషి ఈ ప్రపంచంలో ఉంటూ విషయములపై ఎక్కువ ఇష్టం పెంచుకోకుండా ఉండడం. 

అలా ఉండడం ఎలా సాధ్యమవుతుంది? శరీరం, మనస్సు ఎప్పుడు ఏవో కావాలనే కోరుకుంటాయి కదా? చూపు, రుచి, వాసన, శబ్దము, స్పర్శ (శబ్ద,స్పర్శ,రస,రూప,గంధములు)  అనే జ్ఞానేంద్రియాలవల్ల కొన్ని అలవాట్లకు బానిసగా మారిన మనస్సు ఒద్దంటే వినడం ఎంత కష్టం? 
సన్యాసం స్వీకరించి ప్రపంచానికి దూరంగా బ్రతికేవారికైతే కొంత వరకూ వైరాగ్యం (ఒద్దనుకోవడం) అలవాటు చేసుకోవచ్చేమో! కాని అందరి మధ్యా, అన్నింటి మధ్యా ఉంటూ చేయడం ఎలా? మనస్సును గాడిలో పెట్టడం ఎలా?

ఈ కష్టాన్ని గ్రహించి, వీరశైవులు "భక్త" స్థలం  నుండి (శివ) "ఐక్య" స్థలం వరకూ వెళ్ళే షట్ స్థల మార్గంలో,  "ప్రసాది" స్థలాన్ని ఉంచారు. ప్రసాది స్థలాన్ని ఆచరించే వీరశైవుడు తను పొందినది, స్వీకరించే ముందు దానిని శివునికి అర్పిస్తాడు. అది తిను పదార్థమైనా, కట్టుకునే వస్త్రమయినా, ఆభరణమైనా, గృహమయినా, వాహనమైనా, ఏదైనా, చివరికి ఔషధమయినా సరే - దాన్ని శివునికి అర్పించక ముట్టుకోడు. ఇది చాదస్తం కాదు. ఈ మార్గము ఎలా ఉపయోగ పడుతుందో ఆలోచిద్దాం. 

  • మనము ఒక పదార్థాన్నిఇంకొకరికి అర్పిస్తే, దానిపై అధికారాన్ని కోల్పోతాము. అప్పుడు దానిపై సంపూర్ణ హక్కు తీసుకున్న వారిదౌతుంది. అలానే, నిండుమనసుతో శివార్పణం గావించిన పదార్థము మనది కాదు, శివునిది అనే భావన ఏర్పరుచుకోవడం జరుగుతుంది. అప్పుడు దానిని పొందే అధికారము మనకే గాక, ప్రపంచంలో అందరిదీను! అది తెలుసుకున్న నాడు ప్రతివాడు తను తినే ముందు ఇతరుల ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తాడు - అతడు "ప్రసాది". ఐతే ప్రపంచములో ప్రతీజీవీ  ఆకలి తీర్చే "అన్నానాంపతి" (అన్నానాంపతయే నమో - రుద్రా సూక్తం) శివుడే కదా?  మరి ప్రసాది అప్పుడు శివుడిగా మారాడా?! 
  • ఒక్కసారి వచనములో బసవన చెప్పిన దాన్ని జాగ్రత్తగా చూడండి  - " కూడలసంగమదేవునికిష్టమై వచ్చిన ప్రసాదం". ఇక్కడ, మనకిష్టమైనది అనుభవించమని చెప్పట్లేదు. శివునికి ఇష్టమైనది ప్రసాదమవుతుంది. అంటే, శివార్పణం చేసిప్రసాదాన్ని మాత్రమే గ్రహించేవాడు, శివునికి ఇష్టమైనవాటినే, అంటే సాత్విక వస్తువులనే సమర్పించ వలసి ఉంటుంది. అంటే చెడు (రాజసిక - those that cause anger, తామసిక - those which cause laziness) వస్తువులకు దూరంగా ఉండడం నియమప్రకారం  నేర్చుకుంటాడు. అంతే  గాక, అభక్ష్యభక్షణములు (మాంసము, వాటి సంబందితములు), ఆపేయపానములు (సురాపానము/సారాయి, మత్తుమందులు, ధూమ్రపానము మొదలైనవి) వంటి వాటికి దూరంగా ఉంటాడు- ఎందుకంటే వీటిని దేవునికి పెట్టలేడుగా!! మరి దీనివల్ల ప్రసాది దురలవాట్ల వాసన అంటక, తనకూ, తన కుటుంబానికి, తన సమాజానికి, నష్టములు కలిగించకుండా ఉంటూ అందరిని మంచి దారిలో ఉండటానికి ఒక ఉదాహరణగా నిలుస్తాడు. ఆధ్యాత్మికంగా జీవించడానికి అనువుగా తన శరీరాన్ని మలుచుకుంటాడు. ప్రసాది అంటే శివునికి నచ్చిన విధంగా శివార్పణభావంతో జీవించడం.    
  • ఏదయినా దేవునికి సమర్పించక ముందు నైవేద్యం అంటారు. పెట్టింతరువాత, దేవుడు స్వీకరించిన తరువాత అది ప్రసాదం అవుతుంది. ఐతే శివునికి నివేదన చేయడానికి తయారు చేసిన వస్తువు శుచి, శుభ్రత పాటించి చేస్తారు కదా? అంటే అలా ప్రసాదంగా మారిన దానిని స్వీకరిస్తే ఆరోగ్యంగా ఉంటారు కదా? అంటే ఎక్కడ పడితే అక్కడ తినే, ఎలా పడితే అలా తినే అలవాట్లకు (అలాంటి వస్తువులు శివునికి అర్పించడం కష్టం కదా) సాధ్యమైనంతగా దూరంగా ఉంటారు కదా?  దానివల్ల వ్యాధులకు దూరంగా ఉంటారు కదా?  
  • ఇది కేవలం తిను పదార్థాలకే కాకుండా ఇతరములకు కూడా అణ్వయించుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు కృషితో ధర్మసమ్మతంగా సంపాదించని ధనం (మోసం, లంచాలు మొదలైన వాటితో సంపాదించిన ధనం) నైవేద్యంగా  పనికిరాదు. అలాంటప్పుడు అలా సంపాదించిన ధనంతో తెచ్చిన వస్తువులు  ప్రసాదం కాజాలవు. కాబట్టి ప్రసాది వాటికీ దూరంగా ఉంటాడు!!
ఇప్పుడు చెప్పండి. ప్రసాదిగా బ్రతకడం మనకూ, సమాజానికి ఎంత ముఖ్యం? ప్రసాది విరాగి కన్నా కూడా గొప్పవాడేమో?  వీరశైవం మనో ప్రక్షాళణకూ, సమాజ ప్రక్షాళణకూ, తద్వారా శివోహ భావానికి తోడ్పడుతుందని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.                   




     

   
   
   

Sunday, February 8, 2015

4. Nare Kennege - Basavanna


కన్నడ వచనం:

ನರೆ ಕೆನ್ನೆಗೆ, ತೆರೆ ಗಲ್ಲಕೆ, ಶರೀರ ಗೂಡುವೋಗದ ಮುನ್ನ;
ಹಲ್ಲು ಹೋಗಿ, ಬೆನ್ನು ಬಾಗಿ, ಅನ್ಯರಿಗೆ ಹಂಗಾಗದ ಮುನ್ನ;
ಕಾಲ ಮೇಲೆ ಕೈಯನೂರಿ, ಕೋಲ ಹಿಡಿಯದ ಮುನ್ನ;
ಮುಪ್ಪಿಂದೊಪ್ಪವಳಿಯದ ಮುನ್ನ;ಮೃತ್ಯು ಮುಟ್ಟದ ಮುನ್ನ
ಪೂಜಿಸು ಕೂಡಲಸಂಗಮದೇವನ.

తెలుగు లిపిలో:

నరె కెన్నెగె తెరె గల్లకె, శరీర గూడువోగడ మున్న 
హల్లు హోగి బెన్ను బాగి, అన్యరిగె హంగాగద మున్న 
కాల మేలె కయ్యనూరి , కోల హిడియద మున్న 
ముప్పిందొప్పవలియద మున్న,  మృత్యు ముట్టద మున్న, 
పూజిసు కూడలసంగమ దేవన

తెలుగు వచనం:
కురులు తెల్లబోయి, బుగ్గలు లొట్టలుబారి, శరీరము బక్కచిక్కక ముందే 
పళ్ళు ఊడి, వెన్ను వంగి, ఇతరులకు భారమవ్వకముందే 
కాళ్ళపై చేతులేసి, కట్టె బట్టక ముందే 
ముదుసలి కాకముందే, కాటికిజాచక ముందే, మృత్యువు ముట్టక ముందే 
పూజించు కూడల సంగమదేవుని 
   
వచనకర్త ఆంతర్యం:
శివున్ని పూజించడానికి ఎన్నాళ్ళు ఆగుతావు? తెల్ల వెంట్రుకలు రావాలా? ముసలివాడివై బొక్కలు తేలాలా? బుగ్గలు లోట్టబోవలా? పళ్ళు ఊడి పోవాలా? వెన్నెముక వంగి పోయి ఇతరులపై అధారపడినప్పుడు దేవుడు గుర్తొస్తాడా?  కాళ్ళపై శరీరభారం నిలపలేక మోకాళ్ళపై చేతులేసి కర్ర సహాయంతో నడచినప్పుడు గుర్తొస్తాడా దేవుడు?  నీరసించి ఆ శివున్ని ధ్యానించలేనినాడు గుర్తొచ్చిన ఏమి లాభం? మృత్యువు నుండి ఎలా తప్పించుకోగలవు? ఒళ్ళు గట్టిగ ఉన్నప్పుడే శివున్ని పూజించడం అలవాటు చేసుకో!! 


విశ్లేషణ:
ఈ వచనం ప్రభావం తెలుగు వారిపై చాలా ఉంది. శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ముఖ్యుడైన శివకవి దూర్జటి ఈ వచనాన్ని తన శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఉన్నదున్నట్టు దించాడంటే దీని గొప్పదనం తెలుస్తుంది. బసవన్న వచనాల ప్రభావం ఆనాడు ఎందఱో కవులపై ఉండేది.  ఈనాడు మనపై ఉండాలి.  

చూడండి -    
దంతంబుల్పడనప్పుడే, తనువంధారుడి  యున్నప్పుడే 
కాంతాసంగము రోయనప్పుడే, జరాక్రాంతంబు గానప్పుడే 
వింతల్మేన చరించనప్పుడే, కురుల్వెల్లగానప్పుడే 
చింతింపన్వలె నీ పాదపద్మమ్ములన్ శ్రీ కాళహస్తీశ్వర !

దైవచింతన ఇప్పుడెందుకు? మనం ఏ పనిలేని ముసలివాళ్ళమా? నేడు ఎందుకు పనికివస్తుంది? తరువాత చూసుకుందాంలే అనుకునే యువతరానికి, మధ్యవయస్కులకి  ఈ వచనం చిన్న సలహా వంటిది. ఈ వచనము, ఈ క్రింద వేసిన ప్రశ్నలు ఎవరో మనని చిన్నబుచ్చడానికి అడిగినవిగా కాక  మనకి మనం స్వయంగా చేసుకొనే ఆత్మపరిశీలన కోసమనే గ్రహించగలరు. ఈ క్రింది ప్రస్తావన కొంచం కటువుగా అనిపిస్తే క్షమించాలి.

ధర్మం కాలక్షేపం కోసం కాదు. ధర్మం నేడు ఎలా బ్రతకాలో నేర్చుకోడానికి. బ్రతుకంతా అయిపోయింతరువాత  ఎవరికోసం ధర్మం? ఇప్పటినుండి అలవరచుకోకపోతే వృద్ధాప్యాంలో నొప్పులు తప్ప దేవుడేం గుర్తొస్తాడు? ఒచ్చినా నొప్పి తగ్గించమని కోరడమే తప్ప అప్పుడు "శాశ్వత శివసాయుజ్యము", "మోక్షము" వంటి విషయాలు తలకెక్కుతాయా? అర్థం చేసుకొనే జ్ఞానంగాని, తాపత్రయంగాని ఉంటుందా? ఒళ్ళంతా నొప్పులుంటే, యోగము చేయగలవా? ధ్యానం చేయగలవా? అప్పుడు మనస్సులో దేవున్ని నిలబెట్టుకోగలవా? వైద్యుల చుట్టూ తిరగడానికి సమయం చాలదే? కళ్ళు కనబడవే - ఒక బసవ పురాణం చదవగలవా? శివపురాణం చదువుతావా? సరే ఎవరోచదివి వినిపిస్తారంటే - చెవులు వినబడక పోతే? 

సమస్త సౌఖ్యములు (శం) తయారుచేసిన (కర), ఆ శంకరుణ్ణి తలవడానికి ఐదు నిముషాలు కరువైనాయా రోజులో? ఆ సుఖములను అనుభవించడానికి సమయం ఉందా? ఎంత కృతఘ్నత?  
ప్రతిజీవిలో తానై ఉంటూ, అనాహటంగా గుండెని నడిపిస్తూ, అవయవాలన్నింటికి శక్తిని ప్రసరిస్తూ, అలసిన శరీరాన్ని, మనస్సునూ నిత్యం ఉత్తేజ (recharge) పరుస్తూ - నిద్రతో, మనలోనే దాగున్న ఆ శివున్ని ధ్యానించాలన్న కోరిక కలగక పోతే ఎందుకా జన్మ? 

ఈ మధ్య ధ్యానం కోసమని క్లాసుల్లో వెళ్లి కూర్చుంటున్నారు చాలామంది.  ఎందుకంటే మనశ్శాంతి కోసమట. ఆ పని చిన్నప్పటి నుండి శివపూజావిధానంలో నేర్పిస్తునే ఉన్నారుగా? దానికి సమయం లేదు! స్వధర్మం మాని పరధర్మం! ఆంగ్లంలో చెబితే గొప్పా? పక్కింటి పుల్లకూర రుచా? 

సమయం సరిపోదు. చాలా busy! ఉద్యోగము, పిల్లలు, వాళ్ళ చదువులు వగైరా... నిజమా ? 
రోజుకి పది నిముషాలు శివపూజకు కేటాయించలేని దుస్థితా? ఎన్నో పనులున్నాయని అన్ని పనులకు ఎలాగోలా సమయం తీస్తామే? దేవుడొచ్చేసరికి ఎట్లా సమయం కుదరదు? చేయాలనే నిశ్చయం, కోరికా ఉంటే ఎందుకు కుదరదు? కోరిక ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడా? నిత్యం ఏ కోరికాలేక ధ్యానించమంటె గుర్తురాడా? మనని మనం ప్రశ్నించుకుంటే తెలుస్తుంది. ఇదంతా కేవలం మన మానసిక జడత్వం, సోమరితనం (laziness) అని. ఆ జడత్వాన్ని జయించ గల్గిననాడు ఇలాంటి సాకులు వెతకాల్సిన అవసరం ఉండదు.  

 ఒక్కసారి జీవితంలో అతిపెద్ద స్థాయికి ఎదిగినవారిని చూడండి. వారిలో చాలామంది, నియమనిష్ఠలతో  భగవంతున్ని ఆరాధించే వారే  కనబడతారు. 

నిత్య శివపూజ నేడు ఐహికాలను సమకూర్చి, తరువాత ఆముష్మికాలకు దెగ్గరచేసి జీవితాన్ని గాడిలో పెడుతుంది. అందుకనే వీరశైవులకి నిత్య శివపూజా విధానం, ఆచారం తప్పనిసరి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మానకండి. పిల్లలను వారికి ఊహ తెలియక ముందు నుండే శివపూజకు ప్రోత్సహించండి. తరతరాలనుండి మనకు వచ్చిన ఈ శివాచారాన్ని అర్థం అయినా, కాకున్నా మానడం, మార్చడం తప్పు. రాబోయే తరాలవారికి అందించకుండా ఉండే హక్కు మనకి లేదు. శివభక్తి వారికి చెందవలసిన నిజమైన వారసత్వం - డబ్బులు, ఆస్తులు కాదు. దానిని వదలడంవల్ల ఒచ్చే తరాలకు మోక్షజ్ఞానం కరువై, అది ఏమిటో తెలియని దుస్థితి ఏర్పడుతుంది. అది క్షమించరాని నేరమౌతుంది. తస్మాత్ జాగ్రత్త!! 

శివభక్తి తద్వారా శివజ్ఞాన ప్రాప్తిరస్తు!  

   

Saturday, February 7, 2015

3. Nudidire Muttina Haradantirabeku - Basavanna


కన్నడ వచనం:

ನುಡಿದರೆ ಮುತ್ತಿನ ಹಾರದಂತಿರಬೇಕು! 
ನುಡಿದರೆ ಮಾಣಿಕ್ಯದ ದೀಪ್ತಿಯಂತಿರಬೇಕು! 
ನುಡಿದರೆ ಸ್ಫಟಿಕದ ಶಲಾಕೆಯಂತಿರಬೇಕು! 
ನುಡಿದರೆ ಲಿಂಗ ಮೆಚ್ಚಿ ಅಹುದೆನಬೇಕು! 
ನುಡಿಯೊಳಗಾಗಿ ನಡೆಯದಿದ್ದರೆಕೂಡಲಸಂಗಮದೇವನೆಂತೊಲಿವನಯ್ಯ 

తెలుగు లిపిలో:

నుడిదరె ముత్తిన హారదంతిరబేకు!
నుడిదరె మాణిక్యద దీప్తియంతిరబేకు!
నుడిదరె స్ఫటికద శలాకెయంతిరబేకు!
నుడిదరె లింగ మెచ్చి అహుదెనబేకు!
నుడియొళగాగి నడెయదిద్దరె కూడలసంగమదేవనెంతొలివనయ్య 

తెలుగు వచనం:
మాటలు ముత్యపు హారమువలె యుండాలి 
మాటలు మాణిక్యపు కాంతివలే మెరవాలి 
మాటలు స్ఫటికపు మెరుపువలే యుండాలి 
మాటలు లింగము మెచ్చి అవునునిజమనాలి, కాని 
మాటతప్పి నడచిన కూడలసంగమ దేవుడేలమెచ్చునయ్య? 

వచనకర్త ఆంతర్యం:
మాటలు వ్యక్తమౌనప్పుడు నొప్పించనివై, ఒక్కొక్క పదం ముత్యమై, వాక్యము  తెల్లని ముత్యాల హారంవలే అల్లుకుంటూ ఏంతో వినసొంపుగా ఉండాలి. అటువంటి వాక్కులో పనికిమాలిన విషయాలుగాక జ్ఞానము మాణిక్యపు కాంతివలే వెలువడాలి. గంభీరమైన విషయం చెబుతున్నా స్ఫటికపు పారదర్శకతలా ఎక్కడా స్పష్టత కొరవడకుండా, ఉన్నదున్నట్టుగా, నిర్మొహమాటంగా రాజిల్లాలి. ఆడిన మాట సత్యమై ఉండాలి. అప్పుడు అంతరంగం లోని శివుడు కూడా అవునని తలూపుతాడు. వినేవాల్లందరూ మెచ్చుతారు. అటువంటి మాటని గౌరవించి దానిపై నిలబడాలి కూడా!! కాని మాట వేరు, బాట వేరైతే అట్టివారిని శివుడు ఎలా మెచ్చుతాడు? దూరముంచడా?

విశ్లేషణ:

ఒక మనిషికి సమాజంతో ఉండే అనుబంధమంతా అతని మాటపై, నడవడిపై  ఆధారపడి ఉంటుంది.  బసవన్న ఈ వచనంలో ఆ మాటా, నడవడి ఎలా ఉండాలో చెబుతున్నారు. సమాజంలో ఉన్నప్పుడు అందరి హితం కోసం కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. అందులో అతి ముఖ్యమైనవి  మంచి మాట, మాట నిలబెట్టుకోవడం. 

పనికి మాలిన మాటలు,  అహంకారపు వ్యాక్యలు, ఇతరులను దూషించడం, ద్వేషాన్ని పెంచడం వంటి మాటలవల్ల మనస్సు వికలమై, ఆ రోజే  పాడై పోతూ ఉంటుంది .ప్రాజ్ఞులు అటువంటి వాటికి, అలాంటి వారికి సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూఉంటారు. అలాంటి మాటలు చాలాకాలం నుండి అలవాటై వాటివల్ల కలిగే దుష్ప్రయోజనాలను గ్రహించలేక అలాగే బ్రతుకుతున్న వాళ్ళు చాలామందిని, ప్రతీ ఇంట్లోచూస్తూ ఉంటాం. 

అంతేగాక దుర్భాష పదజాలం కొంతమందికి వాడుక భాషగా మారిపోయింది.  సమాజంలో గొప్పా హోదాలో ఉండి, ప్రతినిధులుగా ఉంటూ ఏంతో భాధ్యతతో ఉండవలసిన ప్రముఖులు కూడా దుర్భాషలాడడం చూస్తూ ఉన్నాం. వారికి తప్పూ చేస్తున్నామన్న భావన కూడా ఉండదు.  

ఈ సమస్యలు ఇంత వ్యాపించిన కారణం చేత, బసవన్న మాటలు  ఎలా ఉండాలో చెబుతున్న విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. స్వయంగానే ఎవరికి వారే కాకుండా, ముఖ్యంగా ఇంట్లో పిల్లలకి నిత్యం గుర్తుచేస్తూ, వారి మాటలను అప్రమత్తతతో గమనిస్తూ ఉండాలి.        

మంచి మాటలు మాట్లాడండి. ఆడే ముందు ఆలోచించండి. ఆడిన మాటలో అర్థం ఉండాలి, జ్ఞానం ఉండాలి, సత్యం ఉండాలి, స్పష్టత ఉండాలి.  అప్పుడు అందరికి ఆమోదయోగ్యమౌతాయి. ధర్మము చేత అంగీకరించబడతాయి. శివునికి నచ్చుతాయి. 

మాటలాడటం ఒకెత్తయితే, మాట మీద నిలవడం ఇంకొక ఎత్తు. మాటిచ్చి నిలవకపోవడం మోసo. మోసకారులను మనుషులు సహించరు, శివుడూ సహించడు!! కాబట్టి మాట ఇచ్చే ముందు కూడా విశేషంగా ఆలోచించ వలసిందే. 

కొందరికి మోసం చేసే ఉద్దేశ్యం లేకపోయినా సాధ్యాసాధ్యాలు విచారించకుండా మాటిచ్చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటి మాటలవల్ల తమతో పాటు ఇతరులను కూడా కష్టాల పాలు  చేస్తూ  ఉంటారు. దానివల్ల మనస్పర్ధలు, జగడాలు వగైరా! కాబట్టి మాటిచ్చే ముందు కూడా జాగ్రత్త; నిలబడగలనా? అని పదిసార్లు  ఆలోచించవలసిందే.   

నిజమేకదా?  వీటిని సరిదిద్దుకుంటే న్యాయస్థానాల్లో సగం సమస్యలు తగ్గిపోతాయి. 
              
    





2. Dayavillada Dharmavadevudayya - Basavanna

కన్నడ వచనం:

ದಯವಿಲ್ಲದ ಧರ್ಮವದೇವುದಯ್ಯ,
ದಯವೇ ಬೇಕು ಸರ್ವಪ್ರಾಣಿಗಳೆಲ್ಲರಲ್ಲಿ!
ದಯವೇ ಧರ್ಮದ ಮೂಲವಯ್ಯ.
ಕೂಡಲಸಂಗಯ್ಯನಂತಲ್ಲದೊಲ್ಲ ಕಂಡಯ್ಯ.

తెలుగు లిపిలో :

దయవిల్లద ధర్మవదేవుదయ్యా?
దయవే బేకు సర్వప్రాణిగళెల్లరల్లి!
దయవే ధర్మద మూలవయ్యా
కూడలసంగయ్యనంతల్లదొల్ల కండయ్యా

తెలుగు వచనం:

దయలేని ధర్మమెటువంటిదయ్యా?
దయతోనుండాలి  సర్వప్రాణులన్నింటిపై !
దయే ధర్మమునకు మూలమయ్యా
కూడలసంగయ్యఅదిలేక ఒల్లడయ్య వినవయ్యా

వచనకర్త ఆంతర్యం:

ఏ ధర్మానికైనా మూలం దయతో మొదలవ్వాలి. దయలేని ధర్మము ఏవిధంగా ఉపయోగపడుతుంది? కేవలం మనుష్యుల పైనేగాక ప్రాణికోటి అంతటిపై దయ చూపించ గలిగేదే నిజమైన ధర్మం. మతం పేరుతో అరాచకాలు, కష్టాల్లో ఉన్న జీవులను చూస్తూ మనసు చలించకపోవడం, అదే సమయంలో అటువంటి వ్యవహారాన్ని ధర్మానికి ఆపాదించడం  ఒక స్వార్థపరుల సంఘమేగాని ధర్మమనబడదు. తాను ఎంతో దయతో సృష్టించిన ఈ జగత్తులో, దయలేని జీవులను తనదెగ్గరకు రానిచ్చునా ఆ కూడల సంగమ దేవుడు? 

విశ్లేషణ:

ఆనాటి కాలంలో మనుష్యులు ధర్మము పేర కొన్ని మౌడ్యాలు,  మూఢవిశ్వాసాలు  పెరిగి, స్వార్థంతో  దయను మరిచి కొన్ని తెగల వారు ఇంతరులపై కఠినంగా వ్యవహరించి ఉండవచ్చు. అలాంటి ధర్మం పేరితో  చేసే నిర్దయత్వంపై వచన కర్త ఈవిధంగా స్పందించినట్లు అనిపిస్తుంది. కాని ఇన్ని వందల సంవత్సరాల తరువాత పరిస్థితి మారిందా?

ఈనాటి సమాజంలో కూడా ఒకవైపు మనిషి అభివృద్ధి పథంతో ముందుకి వెళ్తున్నా, ఎన్నో ప్రకృతి నియమాలను అతిక్రమిస్తూనే ఉన్నాడు. మన స్వార్థం కోసం కొంచం కూడా ఆలోచించకుండా ఎన్నో జీవాల ఉనికికి ప్రమాదమయ్యాము. కనీసం మనుషులైనా ప్రశాంతంగా లేకుండా మతం పేరుతో పిచ్చి ముదిరి ఇతరులను చంపి ఆనందించే సమాజాలను రోజు చూస్తున్నాము. కాబట్టి ఈ వచనం ఈనాటి స్థితికి ఎక్కడా తీసిపోకుండా ఉంది.

పరమేశ్వరుడు సృష్టించిన జీవులన్ని ఒకరిపై ఒకటి ఆధారపడే ఉంటాయి. అలాంటప్పుడు కారుణ్యన్ని మరచి సంచరిస్తే సమతూల్యత (balance) తగ్గి, విపరీతాలు జరుగుతాయి. ఎన్నో ప్రాకృతిక ఓషధులు, జీవులు ఇప్పుడు కనిపించకపోవడం ఇందుకు ఉదాహరణ. అలాంటి వ్యవహారాన్ని ఆ శివుడు సహించడు.

ఈ వచనంలో దయని పలు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. కారుణ్యం, సానుభూతి, భూతదయ, అహింస, ప్రేమ వంటి మెత్తని స్వభావాల మిళితమే దయ.  భగవంతుని ప్రేమ తల్లిదండ్రుల ప్రేమవలే  నిస్వార్థమైనది  (unconditional love).ఆ ప్రేమ భగవంతునికి సకలజీవకోటిపై ఉంటుంది.  అలాంటి నిస్వార్థ ప్రేమని అందరిమధ్యా ప్రేరేపించేది వీరశైవ ధర్మం.

వీటిని వీరశైవులు వారి ధర్మము నియమాలుగా, నిత్యాచారలుగా పాటిస్తూనే ఉంటారు. సమాజంలో ఒకరికొకరు సహకరించుకోవడానికే దాసోహాలను ఏర్పాటు చేసారు.  హింసకి దూరంగా ఉంటూ, కారుణ్య వ్యవహారులై శాకాహారులుగా (vegetarians) జీవనం సాగిస్తారు. ప్రతి మనిషిని దయతో, ప్రేమతో పలుకరించడం, శరణు-శరణార్థి భావంతో మెలగడం ఇవన్నీ అలాంటి ఉత్కృష్ఠ ధర్మానికి ఉదాహరణలు.  శివుణ్ణి ప్రతివస్తువులో చూడగల్గిన నాడు ఆ ప్రేమ ఉప్పొంగి వస్తుంది.

కనుక మనం ఈ నియమాల వెనక ఉండే దయాభావాన్ని ఎప్పుడు గుర్తుంచుకొని, ఈ దయతో కూడిన వీరశైవ ధర్మాన్ని విడువక సమాజంలో వ్యవహరిస్తే శివానుగ్రహం తప్పక లభిస్తుంది.







Friday, February 6, 2015

1. Ullavaru Shivaalaya Maduvaru - Basavanna

కన్నడ వచనం:

ಉಳ್ಳವರು ಶಿವಾಲಯವ ಮಾಡುವರು !
ನಾನೇನ ಮಾಡುವೆ ? ಬಡವನಯ್ಯ!
ಎನ್ನ ಕಾಲೇ ಕಂಬ, ದೇಹವೇ ದೇಗುಲ,
ಶಿರವೇ ಹೊನ್ನ ಕಳಶವಯ್ಯ!
ಕೂಡಲಸಂಗಮದೇವ ಕೇಳಯ್ಯ,
ಸ್ಥಾವರಕ್ಕಳಿವುಂಟು, ಜಂಗಮಕ್ಕಳಿವಿಲ್ಲ!

తెలుగు లిపిలో:

ఉళ్ళవరు శివాలయవ మాడువరు!
నానేన మాడువె? బడవనయ్య!
ఎన్న కాలే కంబ, దేహవే దేగుల,
శిరవే హొన్న కలశవయ్య,
కుడలసంగమదేవా కేళయ్య,
స్థావరక్కళివుంటు, జంగామక్కళివిల్ల     

తెలుగు వచనం:

ఉన్నవాళ్లు శివాలయాలు కట్టెదరు గాక!
నావల్ల ఏమౌను? బీదవాణ్నయ్యా  
నా కాళ్ళే స్థంబాలు, దేహమే దేవళము, శిరమే బంగారు కలశమయ్య
ఓ కూడల సంగమేశ్వర, వినవయ్య 
స్థావరాలకు కలి వుండు గాని జంగమునకు కాదయ్యా

వచనకర్త  ఆంతర్యం:
పేదవాణ్ని నీకు గుడి కట్టలేను స్వామి. కాని ఒక ఉపాయం ఉంది. నా కాళ్ళు గుడి స్థంబాలు గా మారుస్తాను. మరి శరీరం గుడి అవుతుంది. హృదయం గర్భగుడి అనుకో. శిరము స్వర్ణ శిఖరం. నీకింకేం కావలి చెప్పు? ఒచ్చి ఇందులో ఉండవయ్యా  ఓ కూడల సంగమేశ్వర!!
ఇందులో ఇంకో గొప్ప సౌలభ్యం ఉందయ్యో!! గుళ్ళో అయితే (స్థావరం) ఒక దెగ్గర కూర్చో బెడతారు. నేనైతే అన్ని చోట్లకి తిప్పుతా (జంగమం). నిరాటంకంగా పూజిస్తా. నాకాకలైనప్పుడల్లా నీకూ నైవేద్యం,  అందరితో మాట్లాడవచ్చు, కలసి తిరగొచ్చు, మన స్నేహానికి నాశమే లేదు కదా? మరి నా మాట విని, నా శరీరం అనే గుడిలో కొలువుండవయ్య..        

విశ్లేషణ:
బసవేశ్వరుడు ఈ వచనములో అందరికీ ఆచరణ యోగ్యమైన శివారాధన విషయాన్నీ ప్రస్థావించాడు.
1. శివారాధన గొప్పవాళ్ళు, సంపన్నులే గాక పేద వాళ్ళు కూడా సాధించ వచ్చు అనేది మొదటి ప్రస్తావన. పేదవాళ్లైనంత మాత్రాన, ధనం లేనంత మాత్రాన,  మాతో కాదని భక్తిని విడువడం సరికాదు. అది జడత్వాని ప్రతీక.  
పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నట్టు ఉన్నదానితో దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవడం ముఖ్యము. దేవుడు గొప్ప వాటినే కోరుకోడు  - మనసుని చూస్తాడు అనేది  ఎక్కడ గుర్తు చేస్తున్నారు .

2. మనిషి తన శరీరాన్ని దేవాలయంగా మార్చుకుని భగవంతుని నివాస యోగ్యoగా చేసుకోగల్గడం అనేది ఆంతరంగిక శుద్ధిని సూచిస్తుంది.  మనస్సులో శివున్ని ప్రతిష్టించు కోవడమంటే, ఎంత నిర్మలంగా ఉండాలి? కల్మషరహింతంగా, ఇతరులను బాధ పెట్టకుండా, అరిషడ్వగాలను అదుపులో పెట్టుకోగలిగే స్థితికి చేరుకుంటే, భక్తితో  తనను తాను సమర్పించుకుంటే, ఆ దేహము శివాలయమే ఆవుతుంది. అలాంటి ఆలయంలో శివుడు ఎందుకు ఉండడు?

3. స్థావరక్కలళివుంటు , జంగమక్కళివిళ్ళ: ఈ వాక్యాన్ని వివిధ రకాలుగా అర్థం చేసుకొవచ్చు. నా ఉద్దేశ్యంలో ఇది దేవుణ్ణి బ్రతిమాలు కోవడానికి బసవన్న చూపిన ఆశగా భావిస్తున్నను. నా దెగ్గరైతే  నీ పూజా పునస్కారాలకి నాశనముండదు - స్థావరం (గుడిలో) అయితే అందరు రోజు వచ్చి పూజిస్తారని ఏంటి నమ్మకం? ఆ కాలంలో జనాలు తక్కువ. ఊరి బయట, అడవుల్లో గుళ్ళకి అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళు. నా  దేహంతో ఉంటె ఎప్పుడు నిన్ను కనిపెట్టుకొని ఉంటాను అని.
కొందరు వేరే అర్థాలు చెప్పారు. గుళ్ళు అయితే నశించి పోతాయి అని. మనస్సు నశించదు అని.

4. అతి ముఖ్యమైన ప్రతిపాదన వీరశైవుల ఆంతరంగిక ఉపాసనా విధానం. బాహ్య లింగార్చన లో శివుడు జీవుడు వేరుగా ఊహించుకొని చేస్తారు. వీరశైవులు లింగాంగ సామరస్యంతో చేస్తారు. అనగా మనలోని జీవము , చేతిలోని శివలింగము ఒకటే అనే విశ్వాసము. ఇందులో లింగాన్ని విగ్రహంగా కాకుండా తన దేహానికి సమానంగా, లేదా దేహంలోని అతి ముఖ్యమైన భాగంగా (ప్రాణ  సమానంగా)  భావించడం. ఆ ప్రాణమే శివుడని నమ్మిన నాడు ఈ దేహమే దేవాలయం అవుతుంది.