Friday, April 3, 2015

17. Madakeya Maduvade - Basavanna

కన్నడ వచనం 
ಮಡಕೆಯ ಮಾಡುವಡೆ ಮಣ್ಣೇ ಮೊದಲು,
ತೊಡಿಗೆಯ ಮಾಡುವಡೆ ಹೊನ್ನೇ ಮೊದಲು,
ಶಿವಪಥವನರಿವಡೆ ಗುರುಪಥವೇ ಮೊದಲು
ಕೂಡಲಸಂಗಮದೇವನರಿವಡೆ ಶರಣರ ಸಂಗವೇ ಮೊದಲು


తెలుగు లిపిలో 

మడకెయ మాడువడె మణ్ణే మొదలు
తొడిగెయ మాడువడె హొన్నే మొదలు 
శివపథవనరివడె గురుపథవే మొదలు 
కూడలసంగమదేవనరివడె శరణర సంగవే మొదలు 

తెలుగు వచనం 
మట్టికుండ చేయవలెనన్న మన్నే మొదలు 
పెట్టుతొడుగు చేయవలెనన్న స్వర్ణమే మొదలు 
శివపథము తెలియవలెనన్న గురుపథమే మొదలు 
కూడలసంగముదేవుని తెలియవలెనన్న శరణుల సంగమే మొదలు 

వచనకర్త ఆంతర్యం:
శివున్ని చేరవలెనన్న సద్గురుబోధ వల్ల, శివశరణుల సాంగత్యమువల్ల  మార్గము అవగతమవుతుంది. ఎలాగైతే వస్తువులు చేయటానికి ముడిపదార్థములు ఉంటాయో, శివ జ్ఞానము కలగడానికి గురువు, శరణులే ముడిపదార్థములు.   

విశ్లేషణ:
గురువు, శరణ సాంగత్యముల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే వచనమిది. 

గురు, లింగ, జంగమలను వీరశైవులకు ముఖ్యంగా ప్రతిపాదిస్తూ వాటిలో గురువుని మొదటి స్థానంలో ఉంచారు. "గురు సాక్షాత్పరబ్రహ్మ తస్మైస్రిగురవే నమః" అన్నట్టు, గురువు సాక్షాత్ పరశివబ్రహ్మమే.  ఒక తల్లి, తండ్రి పుత్రునికి  నడవడం ఎలా నేర్పిస్తారో, శిష్యునికి గురువు శివమార్గంలో నడవడం అంతే శ్రద్ధతో, ఉత్సాహంతో, జాగ్రత్తతో నేర్పిస్తాడు. బాలుడు నడుస్తూ క్రింద పడితే ఎత్తి మరీ మళ్లీ నడవడానికి ప్రోత్సహించినట్టు శివమార్గమ్లో కలిగే అంతరాయలను ఎప్పటికప్పుడు నివారిస్తూ చేయిపట్టుకు నిడిపించేవాడే గురువు. 

సంసారిక జీవితంలో ఉంటూనే ఆత్మజ్ఞానాన్ని, శివైక్యాన్ని సాధించే మార్గం వీరశైవులది. ఇతర మార్గాలవారు వర్ణాశ్రమ ధర్మము ప్రకారము వానప్రస్తము, సన్యాసములోగాని ఇలాంటి ఉపాసన చేయరు. వారికి సన్యాసాశ్రమము స్వీకరించేటప్పుడు అలాంటి దీక్షా ఇవ్వబడుతుంది. కానీ వీరశైవులు శివదీక్షను చిన్నతనంలోనే గురువు ద్వారా పొంది జీవితాంతం ఉపాసించవలసి ఉంటుంది. అందుకే ప్రతీ కుటుంబానికి గురువులను ఏర్పరచి గురుపరంపరను ప్రోత్సహించింది వీరశైవం. ప్రతీ  విషయములో గురువు సలహాను తీసుకోవాలని నిర్దేశించింది. అంటే దైనందిన జీవితంలో ఉంటూ శివదీక్షా మార్గాన్ని దారి తప్పకుండా చూసుకునే వాడు గురువు. అతనే మన మంచి చెడుల నిర్ణయించే సలహాదారు (consultant), జీవన మార్గనిర్దేశకుడు(guide), సమస్యలను తీర్చే మానసిక శాస్త్రవేత్త (psychiatrist). 

ఇలాంటి గురుపరంపర, గురుమార్గనిర్ధేశణ వంటి వాటిపై నమ్మకాలు తొలగినందువల్ల నేడు మన సమాజంలో కూడా రకరకాల కుటుంబ సమస్యలు, మానసిక ఇబ్బందులు మొదలయ్యాయని నా అభిప్రాయం. మనస్సు శివకార్య నిమగ్నమై, ప్రశాంత చిత్తంతోఉంటూ శివజ్ఞానానికి ఉదాహరణగా పొగడబడిన వీరశైవులు, ఈనాడు సాధారణ బాధలైన కుటుంబ కలహాలు, ఇతరులతో పేచీలు వంటి చిల్లర సమస్యలతో సతమతమవుతూ మంచి చెడుల విచక్షణ కోల్పోయి తమ పారమార్థిక ఉద్దేశ్యాన్ని మరచిపోతున్నారు. నిత్యం శివున్ని గురించి ఆలోచించే వారికి ఈ చిల్లర సమస్యలు పడతాయా? దైవచింతన నింపవలసిన మనస్సులో చింతలు, రాజకీయాలు, మాత్సర్యము నిండుతోంది. ఒక తరమువారు బయటి వాళ్లతో జగడాలు తెస్తే, ఇంకో తరంవాళ్ళు ఇంట్లోనే జగడాలతో ఆఖరుకి ఆలుమగల సంసారాలు కూడా పట్టుమని పది రోజులు నిలవటంలేదు. ఈ దుస్థితికి కారణం? తరాలుగాలేని ఈ సమస్యలు ఈమధ్య  ఎందుకు పెరిగిపోతున్నాయి? 
ఇక్కడ నా అభిప్రాయం ఎవరినీ ఉద్దేశించినది కాదు. కొంత కాలంగా కేవలం భుక్తికోసం, ధనార్జన కోసం చదువులు, అని నమ్మి, మిగితావన్ని నిరుపయోగమని తలచి అలానే తమ పిల్లలను పెంచడం ప్రారంభించాము. వాళ్ళకి చదువు చెప్పించడంపై చూపిన శ్రద్ధ మన పారంపరిక భక్తివిశ్వాసాలపై పెట్టకపోవడం సాగింది.  అలా పెరిగిన వారికి శివజ్ఞానం, శివభక్తి పై నమ్మకం నామమాత్రం. ఇక వారి తరువాతి తరంవారైతే ఏమి చేసినా చెల్లు; వారికి అసలే తెలియదు.  శివచింతన లేని హృదయం, శివున్ని తమ జీవితలక్ష్యంగా పరిగణించడం మానేయడంతో ప్రతీ విషయంలో స్వార్థం పెరిగి "మనము" అనే అలోచన మాని "నేను, నాది" అనే అలోచన ఎక్కువైంది. వ్యక్తుల మధ్య విభేదాలు పెరిగాయి. దానికి తోడు గురువుపై విశ్వాసము పోయి మార్గనిర్దేశణ పూర్తిగా లోపించింది. దాని అనుసంగ ప్రభావమే (side effect) నేటి సమస్యలు అని నా అభిప్రాయము. 

ఇక గురువుతో పాటు శరణసాంగత్యాన్ని కూడా మరల ప్రస్తావిస్తోంది ఈ వచనం.శరణులు నిత్య హితులుగా స్నేహితులుగా ఉంటూ శివచింతన-అన్యనిరసనలో తోడ్పడుతూ ఉంటారు.  ఈ విషయాన్నీ ఇప్పటికే   13. Gnanada Baladinda Agnanada Kedu - Basavanna14. Maramara Mathanadindagni Hutti - Basavanna వంటి వచనాలలో విశ్లేషించాము. 

కుండలు చేయటానికి మన్ను ఎంత ముఖ్యమో అంటే మన్ను లేని కుండ లేనట్లుగా, ఆభరణాలు చేయటానికి బంగారము ఎంత ముఖ్యమో అంటే బంగారము లేక ఆభరణము లేనట్లుగా, శివదీక్ష శివున్ని చేరే మార్గంలో నడవాలంటే గురువు, శివజ్ఞానము కలగాలంటే  శరణులు అవసరమని ఇక్కడ బసవన్న బోధ. 

  





               


1 comment:

  1. Nijeme.maa balyamlo lingayathlaku oka lnti guruvu undewaru.prathi year guruvugaru intiki pvachhi.rendu rojulu undevaru.poojalu cheaininch waru.pillallaku bakthi gadhalu cheppevaru. Ippdu alanti paristhilu Levi.e vachana valla guruvu goorthsthunnru

    ReplyDelete