Sunday, July 12, 2015

27. Saganiya Benakana Madi - Basavanna

కన్నడ వచనం 

ಸಗಣಿಯ ಬೆನಕನ ಮಾಡಿ ಸಂಪಿಗೆಯರಳಲ್ಲಿ ಪೂಜಿಸಿದರೆ
ರಂಜನೆಯಹುದಲ್ಲದೆ, ಅದರ ಗಂಜಳ ಬಿಡದಣ್ಣ!
ಮಣ್ಣ ಪ್ರತಿಮೆಯ ಮಾಡಿ ಮಜ್ಜನಕ್ಕೆರೆದರೆ
ನಿಚ್ಚ ಕೆಸರಹುದಲ್ಲದೆ ಅದರಚ್ಚಿಗ ಬಿಡದಣ್ಣ!!
ಲೋಕದ ಮಾನವಂಗೆ ಶಿವದೀಕ್ಷೆಯ ಕೊಟ್ಟರೆ
ಆ ಕೆಟ್ಟವನೇಕೆ ಸದ್ಭಕ್ತನಹನು ಕೂಡಲಸಂಗಮದೇವಾ ?

తెలుగు లిపిలో 
సగణియ బెనకన మాడి సంపిగెయరళల్లి పూజిసిదెరె 
రంజెనెయహుదల్లెదె, అదర గంజల బిడదణ్ణ!
మణ్ణ ప్రతిమెయ మాడి మజ్జనక్కెరెదరె 
నిచ్చ కెసరహుదల్లదె ఆదరచ్చిగ బిడదణ్ణ!
లోకద మానవంగె శివదీక్షయ కొట్టరె 
ఆ కెట్టవనేకె సద్భక్తనహను కూడలసంగమదేవా ?


తెలుగు వచనం 

పెండ గణపతి చేసి సంపెంగపూలతో పూజించిన 
రంజనమగునేమోగాని, దాని పేడకంపు విడదన్న!
మన్ను ప్రతిమను జేసి మంచినీట్లోముంచిన
బురదముద్దగ మారునేగాక తననైజం విడదన్న!
లోకపు మానవునికి శివదీక్షను ఇచ్చిన 
ఆ చెడ్డవాడెందుకు సద్భక్తుడగును కూడలసంగమదేవా?

వచనకర్త ఆంతర్యం 

శివదీక్షను ఇచ్చే ముందు దీక్షార్హతను పరికించి ఇవ్వాలి. చెడ్డవారికి ఇస్తే వాడు మంచి వాడయిపోడు. 

విశ్లేషణ 

శివదీక్ష తీసుకోవడం ఒక గంభీరమైన విషయమని, గురువు దీక్ష ఇచ్చే ముందు పరికించి ఇవ్వాలని, దీక్షాగ్రాహి నియమనిష్టలతో ఉండవలసి ఉంటుందని ఇదివరకు మనము "కుంబళకాయిగెఉంటే  కట్ట కొట్టడె" అనే వచనంలో చర్చించుకున్నాము. అదే విషయాన్ని ఇంకో కోణంలో వేరే ఉదాహరణలతో చెబుతుంది ఈ వచనం.

పేడతో విగ్రహం చేసి సువాసనగల పూలతో పూజించినా కూడా మనకి చూడడానికి సంతోషదాయకంగా కనబడుతుందేమోగాని పేడ కంపుపోదు. ఈ ఉదాహరణ చెప్పుకోడానికి సులువుగా ఉన్నా, ఆలోచిస్తే ఒక మర్మం కనబడుతుంది. గణపతి విగ్రహం పుట్టమన్నుతో చేస్తారుగాని పేడతో చెయ్యరు. ఎదైనా చేసే ముందు సరియైన పదార్థాన్ని వాడడం ముఖ్యం. లేకపోతే ఎన్ని సుగంధ భరితమైన పుష్పాలతో అలంకరించినా కంపుపోనట్లు, దీక్ష తీసుకునే వానికి లోకంలో స్వార్థాలతో సాంగత్యం ఉంటే ధరించిన లింగాన్ని అలంకారం కోసమో, సంఘంలో పదవికోసమో, వేరే ప్రయోజనాలకోసమో వాడుకుంటాడు. అంటే వీరశైవులమనే పేరుతో ఇంట్లో నిత్య శివార్చన విషయం ఎట్లున్నా, బైట మాత్రం ఆ మిషతో రాజకీయాలు చేసి పదవులు పొందడానికి, గొప్పలు చెప్పుకోడానికి వాడుకోవడం వంటివి. అక్కడ వారికి పదవివల్ల వచ్చే ధనప్రయోజనాలు తప్ప ఆత్మప్రయోజనం ఏమీ ఉండదు. 

మన్నుతో చేసిన విగ్రహాన్ని అభిషేకం చేస్తే మట్టి ముద్దే అవుతుంది, బురదగా మారటం దాని నైజం. ఒక విగ్రహం చేసినప్పుడు దాన్ని వాడే విధానం కూడా అలోచించుకోవాలి. అభిషేకం చేయాలంటే ఏ రాతి విగ్రహమో, కంచు విగ్రహమో వాడాలి కాని మట్టి విగ్రహం వాడితే అది బురద ముద్దగా మారుతుంది. అలానే వీరశైవదీక్ష ఇవ్వాలంటే వాడికి కావలసిన భక్తి ఉంటే, దీక్షలో నిలబడే పట్టుదల ఉంటే, మనో స్థైర్యము ఉంటే, అటువంటి వానివల్ల ప్రయోజనం ఉంటుంది. లేకపోతే దీక్షను దురుపయోగపరచి చెడతాడు. పేరుకు వీరశైవులమని చెప్పుకుంటూ చేయకూడని విషయాలను చేసే వారిని చూస్తే అర్థమవుతుంది. లింగావంతులై ఉండి, సంప్రదాయమైన కుటుంబాలలో నుండి వచ్చి మాంసాహారము, మద్యపానము వంటివి నిషిద్ధమని తెలిసికూడా వాటిని చేసేవారిని చూస్తున్నాము - ఇదే బురదగా మారడమనడానికి  ఉదాహరణ. 

మాములు మనుష్యులకు శివదీక్షను ఇవ్వటంవల్ల  వాడు సద్భక్తుడు కాజాలడు. మరి మా ఇంట్లో పుట్టిన వారికి శివదీక్ష ఇవ్వాలా?వద్దా? అనే అలోచనలో, వెంటనే ఎందుకొచ్చిన బాధలే ఇవ్వకపోతే సరిపోతుందిగదా అని సరిపెట్టు కొనేరు! 
తల్లిదండ్రులైన వారికి పిల్లలకు తమ ఇంటి సంప్రదాయాలు నేర్పడం, వారికి స్వధర్మ బోధచేయడం తప్పించుకోలేని కర్తవ్యం. కాబట్టి ఎలాగైతే వారి చదువుకోసమని, పెళ్ళికోసమని, ఎప్పుడు ఏది కొనివ్వాలో దానికోసమని ఎలాగైతే భవిష్యత్ ప్రణాళికలు వేసుకొంటామో,అదే విధంగా అత్యంత ముఖ్యంగా చేయవలసింది వారిని శివదీక్షకు అర్హులుగా తీర్చిదిద్దే ప్రణాళిక. ఈ ప్రణాళిక ఏ ఖర్చు లేనిది, ధనం కూడబెట్టవలసిన అవసరం లేనిది, సులువుగా చేయగలిగేది - "ఏది మంచిదో, ఏది చెడో విడమరచి చెప్పడం, శివభక్తిని పెంపొందించడం, వారు భవిషత్తులో బురదగా మారకుండా నిలబెట్టడం" అంతే! అలా ముందు నుండి మలచబడినవాడు దీక్షకు సత్పాత్రుడవుతాడు.    

శరణు శరణార్థి.. 

 

       
   

     
     
     
  

1 comment:

  1. Shiva dekashaku aruhulu evranade baga vishadikarincharu.kani prasthutham diksha tesukunnavari lo chala Mandi alkanraprayagane ,untunnaru.Gudi poojari nundi dharma Martha varaku Ade paristhi,konni chotla.

    ReplyDelete