కన్నడ వచనం
ಇವನಾರವ ಇವನಾರವ ಇವನಾರವನೆಂದು ಎನಿಸದಿರಯ್ಯ.
ಇವ ನಮ್ಮವ ಇವ ನಮ್ಮವ, ಇವ ನಮ್ಮವನೆಂದು ಎನಿಸಯ್ಯ.
ಕೂಡಲ ಸಂಗಮದೇವಾ ನಿಮ್ಮ ಮನೆಯ ಮಗನೆಂದು ಎನಿಸಯ್ಯ.
తెలుగు లిపిలో
ఇవనారవ? ఇవనారవ? ఇవనారవనెందు ఎనిసదిరయ్య
ఇవ నమ్మవ, ఇవ నమ్మవ, ఇవ నమ్మవనెందు ఎనిసయ్య
కూడల సంగమ దేవా నిమ్మ మానెయ మగనెందు ఎనిసయ్య!
తెలుగు వచనం
ఇతనెవరో? ఇతనెవరో? ఇతనెవరోయని తలపింపకుమయ్య
ఇతను మావాడే, ఇతను మావాడే, ఇతను మావాడేయని తలపింపుమయ్య
కూడల సంగమదేవా, మీ ఇంటి పుత్రుడని తలపింపుమయ్య!
వచన కర్త ఆంతర్యం
నా మనస్సులో పరులనే భావన కలుగకుండు గాక. అందరూ నావారే, శివుని సంతానమనే నెనుపు ఎల్లపుడు ఉండబడుగాక!
విశ్లేషణ
చిన్న వచనమైనా, చాలా గంభీరమైన విషయాన్ని ప్రతిపాదించే వచనమిది.
"మనము" అన్న భావన మరచి "నేను" అనే స్వార్థం పెరుగుతున్న నేటి సమాజానికి ఈ వచనం చాలా అవసరమని నా అభిప్రాయము. ఒక తరం క్రితం నుండి ఉమ్మడి కుటుంబాలు పోయి, చిన్న కుటుంబాలు వచ్చాయి - నేను, నా భార్యాపిల్లలు అని. ఈ తరంలో చిన్న కుటుంబ వ్యవస్థ కూడా బీటలు వారుతుంది; నేను మాత్రమే మిగులుతోంది. ఇలాంటి సందర్భంలో ఈ వచనం చాలా దూరం ఆలోచింపజేస్తుంది.
మన మనస్సు ఎలా పనిచేస్తుందని కొంచెం పరిశీలిస్తే - ఎవరినైనా చూడగానే మనస్సు మొదటగా ప్రశ్నించుకుంటుంది. 'వీరు నావారా?' లేదా 'ఈ జీవి నాకు సంబందించిందా కాదా?' అని. ఆ ప్రశ్నకి సమాధానం ప్రకారం ఇష్టాయిష్టాలను, వారితో ప్రవర్తించే స్వభావాన్ని మనసు నిర్ణయించుకుంటుంది. తనవారనిపిస్తే వారిని కులుపుకుపోయే విధంగా, తనవారు కారనిపిస్తే వెంటనే స్వార్థ పూరితమైన నిర్ణయాలు చేస్తుంది. అంటే ఇతరులతో మన వ్యవహారమంతా మనకు తెలియకుండానే మనస్సు యొక్క "నా వారా, లేక పరులా?" అనే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇది ప్రతీక్షణం లోలోన జరిగే వ్యవహారం. కానీ పరిణామాలు మాత్రం తీవ్రం. ఉదాహరణకు ఇంటికి వస్తున్నారు, ఒక పదేళ్ళ కుర్రాడు-బిచ్చగాడు వాహనం నిలిచిన చోటికి వచ్చాడు. కాళ్ళకి చెప్పులు లేవు ఎండలో అలానే నడుస్తున్నాడు. మీకు చూసి జాలేసింది. ఒక పది రూపాయలు ఇచ్చారు. ఇంటికొచ్చిన తరువాత పదేళ్ళ మీ స్వంత కొడుకు, రాయి తగిలి చెప్పు తెగింది. కాలికి చిన్న గాయమైంది. వెంటనే దుకాణానికి తెసుకుపోయి రెండువందల రూపాయలతో క్రొత్త చెప్పుల జతకొన్నారు. అంటే తనవాడని అనిపించినందుకు మీ పుత్రునికి కొత్త చెప్పులజత. తనవాడు కాడనిపించినందువల్ల ఇంకో కుర్రానికి పది రూపాయలు. ఇలా ఉంటుంది మనసు నిర్ణయం. తప్పని కాదు; కాని అలా ఆలోచిస్తుంది అని చెప్పడం.
ఇక్కడ బసవన్న కోరుకుంటున్నది అలాంటి అనునిత్యం సాగే కీలకమైన నిర్ణయాన్ని మార్చమని, ఎవరిని చూసినా "తనవార"ని మనసు తలవాలని. అంటే అందరూ తనవారైతే, అందరూ ఆ పరమేశ్వరుని సంతానమని సతతం తలిస్తే, మనకు వారిపట్ల వ్యవహరించే ధృక్పదం సంపూర్ణంగా మారి స్వార్థం నశిస్తుంది అని. అందరూ శివుని వారమే, మనదంతా ఒకే కుటుంబం, శివభక్తులంతా నా బంధువులే, పరులెవ్వరూ లేరు, అనే భావనే ఏంతో ధైర్యాన్నిస్తుంది. నేను అనే భావన తగ్గి మనము అనే భావన పెరగుతుంది. ఇలా అందరూ ఆలోచిస్తే పరస్పరం సహకరించు కుంటూ వసుధైకకుటుంబమే ఏర్పడదా?
మతాచ పార్వతీదేవి, పితా దేవో మహేశ్వరః
భాందవం శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం॥
అన్న శ్లోకంలో ఉండే తాత్పర్యాన్నే ఇక్కడ బసవన్న మనకి మనోనిర్ణయాలతో జతజేసి చెప్పారు.
అయితే ఇంకొరరికి భోదించడం కాకుండా ఎవరికి వారు తమ మనస్సుని చక్కబరచుకోవడం ఇక్కడ ప్రతిపాదన. చెప్పడమే కాదు బసవన్న అలా వ్యవహరించారు కూడా. చౌర్యానికి దొంగలు ఇంటికి వస్తే, వారిని సైనికులు పట్టుకున్నా కూడా వారికి కావలసినవి తీసిచ్చి వారిని మార్చారు బసవన్న.
లోకంలో అందరూ ఆత్మ పరిశీలన చేసుకుంటూ తమ ప్రవర్తనను మార్చుకుంటే, ఈ మూడు భువనాలలో అందరూ మన చుట్టాలే!!
శరణు శరణార్థి!!
No comments:
Post a Comment