కన్నడ వచనం
ದೇವಸಹಿತ ಭಕ್ತ ಮನೆಗೆ ಬಂದರೆ
ಕಾಯಕವಾವುದೆಂದು ಬೆಸಗೊಂಡೆನಾದರೆ
ನಿಮ್ಮಾಣೆ, ನಿಮ್ಮ ಪುರಾತರಾಣೆ, ತಲೆದಂಡ,
ತಲೆದಂಡ ಕೂಡಲಸಂಗಮದೇವಾ, ಭಕ್ತರಲ್ಲಿ ಕುಲವನರಸಿದರೆ ನಿಮ್ಮ ರಾಣಿವಾಸದಾಣೆ.
తెలుగు లిపిలో
దేవసహిత భక్త మనెగె బందరె
కాయకవావుదెందు బెసగొండెనాదరె
నిమ్మాణె, నిమ్మ పురాతరాణె తలెదండ
తలెదండ కూడలసంగమ దేవా భక్తరల్లి కులవనరసిదరె నిమ్మ రాణివాసదాణె
తెలుగు వచనం
దేవునితోడఁ భక్తుడు ఇంటికరుదెంచిన
కాయకమేదని నిశ్చయించదలచిన
మీయాన, మీ పురాతనుల ఆన తలనంటు
తలనంటు కూడలసంగమ దేవా, భక్తుల కులమడిగిన మీ రాణివాసపుయాన
అర్థం
శివధర్మమును ఆచరించు శరణుల వృత్తిని బట్టి కులబేధములు ఎంచుట తప్పు. అట్లు చేసిన శివగణముల శాపమునకు గురవుతాను; మీ రాణి శాపమునకు గురవుతాను.
విశ్లేషణ
వీరశైవధర్మ పునరుద్ధరణలో బసవన్న ఎదుర్కొన్న అతి పెద్ద సమస్య వర్ణవివక్ష. ఈ సమస్య కళ్యాణకటకములో క్రాంతికి బీజమై, బసవన్న తను నమ్మిన ధర్మనిరతికై ఉద్యోగమును, రాచ సంబంధమును వదలి కళ్యాణమును విడిచి వెళ్ళే పరిస్థితికి కారణమైంది. బసవన్న ఇంతగా నమ్మిన ధర్మము, మనకు ప్రసాదించిన ధర్మము ఏమి చెబుతుందో చూద్దాము.
సిద్ధాంత శిఖామణి, 10వ పరిచ్ఛేదమైన మహేశ్వరస్థలములో, "పూర్వాశ్రమ నిరసన" స్థలం ఈ విధంగా వ్యాఖ్యానిస్తుంది:
34
విశుద్ధాః ప్రాకృతాశ్చేతి ద్వివిధా మానుషాః స్మృతాః
శివసంస్కారిణః శుద్ధాః ప్రాకృతా ఇతరే మతాః ||
విశుద్ధులు, ప్రకృతులు అని మనుషులను రెండు విధములుగా స్మృతులు విభజించాయి. శివసంస్కారము పొందిన వారు విశుద్ధులు (అంటే మోక్ష మార్గంలో నడిచే వారు). ఇతరులు ప్రకృత మతస్తులు. వీరి సాంప్రదాయాలు వేరేగా ఉంటాయి అని గ్రహించాలి. బసవన్న మొదలగు శివదీక్ష స్వీకరించిన శరణులంతా విశుద్ధులుగా మారినవారు.
35.
వర్ణాశ్రమాది ధర్మాణాం వ్యవస్థా హి ద్విధా మాతా|
ఏకా శివేన నిర్దిష్టా, బ్రహ్మణా కథితా పరా ||
వర్ణాశ్రమ ధర్మముల వ్యవస్థ రెండు రకాలు. మొదటిది శివునిచేత నిర్దిష్ఠమైనది - ఇది విశుద్ధులు పాటించేది.
రెండవది బ్రహ్మ చేత చెప్పబడినది - అది సాధారణంగా మనకు కనబడే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అంత్యజుల వ్యవస్థ. విశుద్ధులు దీన్ని పాటించరు. వారు శివుని మార్గంలోనే ఉంటారు.
36.
శివోక్త ధర్మనిష్ఠా తు శివాశ్రమ నిషేవిణాం |
శివసంస్కార హీనానాం ధర్మః పైతామహః స్మృతః ||
శివునిచే చెప్పబడిన వ్యవస్థ శివాశ్రమ తత్పరులైన వీరశైవులకు సంబంధించింది. శివసంస్కారము లేనివారికి బ్రహ్మ చేత ప్రతిపాదించబడింది.
37.
శివసంస్కార యుక్తేషు జాతిభేదో న విద్యతే |
కాష్ఠేషు వహ్నిదగ్ధేషు యథా రూపం న విద్యతే ||
ఎలాగైతే అగ్నిలో కాలిన కట్టెలకు పూర్వరూపం ఉండదో, అదేవిధంగా శివసంస్కారయుక్తుడైన వానికి పూర్వపు జాతి భేదములు వర్తించవు.
38.
తస్మాత్సర్వ ప్రయత్నేన శివసంస్కారసంయుతః |
జాతి భేదం న కుర్వీత శివభక్తే కదాచన ||
కాబట్టి ప్రయత్నపూర్వకంగా (అంటే అప్రమత్తతతో) శివసంస్కార సంపన్నులయిన శివభక్తులలో జాతిభేదములు ఎంచరాదు.
వారి జాతి భేదములు ఎంచడం తప్పు. పైనున్న బసవన్న వచనం పూర్వాశ్రమ నిరసన స్థలాన్ని చెబుతోంది.
"ఇంటికి వచ్చిన శివలింగధారి అయిన శరణుని వృత్తి అడిగితే, వారి శాపము, వారి పూర్వజులైన శివగణముల శాపము నా తలనంటు గాక.
వారి కులమును విచారిస్తే, మీ రాణివాసపు శాపము తలనంటు గాక" అని బసవన్న తన రాజు బిజ్జలునితో చెబుతున్నారు. బహుశా రాజ్యాన్ని వదిలే ముందు చెప్పిన వచనమై ఉంటుంది.
బసవన్న కాలంలో, ఆ తరువాత కూడా భక్తి తత్పరులైన వారు ఎందరో శివసంస్కారాన్ని పొంది వీరశైవం స్వీకరించారు. కులభేదాలను ఎంచక భక్తి ఉన్నవారందరికీ శివదీక్షను ప్రసాదించిన గొప్పవారు మన జంగమగురువులు. సమాజాన్ని వర్ణవ్యవస్థతో శాషిస్తున్న కాలంలో ఇది చాలా ఆశ్చర్యకరమైన పరివర్తన. ఆనాడు ప్రపంచంలో ఇంకెక్కడా జరగని వింత- అందుకే అది భక్తి క్రాంతిగా మారింది.దీన్ని ఈనాటి భక్తిహీన క్రాంతులతో పోల్వడం మన దురదృష్టం. సహపంక్తి భోజనములు, విచార సభలు, అనుభవ గోష్ఠులు నడిపి బసవన్న శివశరణులనందరిని సమానంగా చూడాలని ఆచరించి చూపించారు.
ఈనాటి వీరశైవులలోనూ అన్ని పనులు చేసే వారూ ఉంటారు. వారు నిత్య శివధర్మచారులైనందున సాధారణ సనాతన సంప్రదాయికులవలె వారి వృత్తి ప్రకారము వారికి కులము వర్తించదని గుర్తుంచుకోవాలి. ఎవరైనా వారి కులమెత్తి చూపిన నిరసించాలి.
కాలక్రమేణా మన సమాజంలో ఈ విషయంపట్ల అవగాహన తరిగి ఉచ్ఛనీచాలని ఎంచే దురదృష్టం మొదలైంది. భక్తి తగ్గి, ఈ ధర్మమార్గములో ఉన్నవారు ధర్మాన్ని నిలబెట్టుకోక, ఇతరులకు భక్తి మార్గాన్ని నిరూపించి చూపించక పోవడంతో ధర్మాన్ని స్వీకరించాలనే వారు కరువై పోతున్నారు. పైగా వీరశైవాన్ని మనిషికి మోక్షకారకమైన ధర్మంగా కాక ఒక కులంగా మార్చేశారు. దాంతోపటు వెనకబడిన తరగతులలో చేర్చండని పోరాటం; సాధించామని గొప్పచెప్పుకోవడం!! మన ధర్మము కులరహితము అనే ఇంకిత జ్ఞానం కరువైంది. ఈ పరిస్థితిని దిద్దుకోకపోతే పై బసవన్న వచనానికి అర్థమే ఉండదు.
ఈ వచనంతో అంతగా పొత్తు లేకపోయినా సందర్భానుసారంగా చర్చించుకోవలసిన ముఖ్యమైన అంశం ఒకటుంది. కులాన్ని రాజకీయానికి వాడుకోవడం గత కొన్నేళ్లలో మరీ ఎక్కువైంది. నాయకుడు చెడ్డవాడయినా సరే, తప్పుచేసినా సరే, కులంపేరుతో వారి కులబలగం వెనక దాగటం అలవాటైంది. వారికి వత్తాసు పలికే మూర్ఖులకు కొదవే లేదు. దురదృష్ట వశాత్తు ఈ దుఃసాంప్రదాయం వీరశైవులలోకూడా పాకింది. భక్తి, ధర్మము, సదాచారములతో కూడిన మార్గంతో కులసంస్కృతిని సమూలంగా అణచ వలసిన అవసరం ఈనాడు మరీ ఎక్కువగా ఉంది. లేని పక్షంలో మన పిల్లలే మన ధర్మాన్ని ప్రశ్నించి ఇతర మతముల పట్ల ఆకర్షితులయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. వీరశైవులంటే ఒక "vote bank" కాదని, శివధర్మమని మనమే మన పెద్దలకు/నాయకులకు నొక్కి చెప్పలి, మన సమాజాన్ని రాజకీయ నాయకుల ఆటబొమ్మగా మార్చొద్దని ప్రాధేయపడాలి - లేకపోతే మన వ్యవస్థకి అర్థం మారిపోతుంది. ప్రతివాన్ని మర్యాదతో చూసే మార్గాన్ని నేర్పిన గురువు మన బసవన్న. అతని చిత్రపటం ప్రక్కన నోటికి అదుపు లేక ఇతరులను కించపరిచి మాట్లాడే రాజకీయ నాయకుల చిత్రాలని ముద్రించే దుస్థితి సృష్టించి బసవన్న గొప్పదనాన్ని దిగజార్చే హక్కు మనకు ఎవరిచ్చారు?
శివభక్తులందరి కులం ఒక్కటే అని గట్టిగా నమ్మినవాడు, ఆచరణలో పెట్టినవాడు బసవన్న. శివశరణుల పూర్వ కులాన్ని బట్టి వారి మధ్య వివాహం జరపరాదన్న రాజు శాసనాన్ని వ్యతిరేకించాడు. ధర్మానికి నమ్మకమునకు అడ్డొచ్చిన వాడు రాజే అయినప్పుడు, రాజ్యాన్ని వదిలిపెట్టాడు కానీ తాను నమ్మిన ధర్మాన్ని కాదు. ప్రతి వీరశైవుడు అనుదినం గుర్తుంచుకోవలసిన అంశమిది.
శరణు శరణార్థి!!