Sunday, August 14, 2016

40. Lagnavelliyado Vighavelliyado Sangayya? - Basavanna

కన్నడ వచనం
ಲಗ್ನವೆಲ್ಲಿಯದೊ  ವಿಘ್ನವೆಲ್ಲಿಯದೊ ಸಂಗಯ್ಯ?
ದೋಷವೆಲ್ಲಿಯದೊ ದುರಿತವೆಲ್ಲಿಯದೊ ಸಂಗಯ್ಯ?
ನಿಮ್ಮ ಮಾಣದೆ ನೆನೆವವಂಗೆ ಭವಕರ್ಮವೆಲ್ಲಿಯದೊ ಕೂಡಲ ಸಂಗಯ್ಯ?

తెలుగు లిపిలో 
లగ్నవెల్లియదొ విఘ్నవెల్లియదొ సంగయ్య?
దోషవేల్లియదొ దురితవెల్లియదొ సంగయ్య?
నిమ్మ మణదె నేనెవవంగె భావకర్మవెల్లియదొ కూడల సంగయ్య?   

తెలుగు వచనం
లగ్నమెక్కడిదో విఘ్నమెక్కడిదో సంగయ్య?
దోషమెక్కడిదో దురితమెక్కడిదో సంగయ్య?
మిమ్ములను మానక తలచువానికి భవకర్మమెక్కడిదో కూడల సంగయ్య?


వచనకర్త ఆంతర్యం 

పరమేశ్వరుని నిత్యమూ తలుస్తూ మైమరచి వర్తించే వీరశైవ శరణునకు శుభాశుభములు గాని, దోషములు, పాపములు గాని అంటవు. 

విశ్లేషణ 

వీరశైవధర్మానువర్తనులైన వారు కర్మపాశములు తమకు అంటవనే  ప్రగాఢవిశ్వాసముతో ఉంటారు. 
జగత్తులోని సమస్తము పరమేశ్వరుడైన శివుని సంకల్పము వల్ల జరిగే నిర్మాణమని, శివుని వల్లే నడుస్తుందని, శివునిలోనే పుట్టి శివునిలోనే లయమవుతూ ఉందని, శివేతరమైనదేది ప్రపంచములో లేదని గట్టిగా నమ్ముతారు. 

సృష్టికి పూర్వము ఎలాంటి వికారములు లేని నిర్గుణ బ్రహ్మమైన శివుడు మాత్రమే ఉండే వాడు. ఆతను తన స్వతంత్రమైన ఇచ్ఛతో తనలోనుంచే శక్తిని ప్రకటించుకొని  సృష్ట్యారంభం చేసాడని వీరశైవ సిద్ధాంత శిఖామణి వివరిస్తోంది. 

ఈ శక్తి వైశిష్టుడైన శివుడే విశ్వంలో మూడు రూపాలలో మారిపోతాడు. 
1. భోజ్యము - అనుభవించబడే జడ పదార్థము. ఉదాహరణకు మట్టి, రాళ్ళూ, నీరు, చెట్లు వంటివి అన్న మాట, 
2. జీవుడు - ఇతడు చైతన్యము కలిగిఉన్నా తాను శివుడననే నన్న విషయము మరచి, విషయ ప్రపంచములో మునిగి, అవిద్య అనే మాయతో కప్పబడిన జంతువు 
3.  మహేశ్వరుడు - మహామాయని తన వశములో ఉంచుకొని దానివల్ల ఏ విధంగానూ ప్రభావితము కాకుండా జీవులను ప్రపంచాన్ని నడిపించే వాడు. 
దీని ప్రకారము కాబట్టి ప్రపంచములోని ఏ పదార్థమైనా శివుడే అయి ఉన్నది!! 

అయితే ఇలా ప్రారంభమైన సృష్టి తదనంతరము రకరకాలుగా మారిపోయింది - ఆకాశము, నక్షత్రాలు, గ్రహాలు, భూమి, నీరు, చెట్లు -చేమలు వంటి జడ ప్రపంచము ఒకటైతే, దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, పశు, పక్షి, జంతు, మానవాది జీవులుగా మరో విధంగా క్రమంగా పరిణామము చెందింది. 

వీరశైవేతరులు, ఈ విధంగా పరిణమించిన ప్రపంచాన్ని విడివిడిగా రకరకాలైన రూపంలో దర్శించి వాటిలో తమకు నచ్చిన చిన్న చిన్న శక్తులను తమ కోరికలను తీరుచుకోవడానికి ఆరాధిస్తారు. తాము చేసే కార్యము ఏదైనా కూడా స్వప్రయోజనమును ఆకాంక్షించి చేస్తారు. ఉదాహరణకు ఒక పూజ చేస్తే ఎదో ఒక "కార్య" సిధ్యర్థం అని సంకల్పంతో చేస్తారు. ఫలము ఆకాంక్షిస్తున్నాడు కాబట్టి అట్టి కర్మల ఫలితము పాపమైనా, పుణ్యమైనా ఆ జీవునికి అంటుకుంటుంది. ఈ కర్మ చక్రములో జీవుడు మరణించిన తరువాత కూడా ఈ పుణ్యపాపముల ఫలితములు అనుభవించడానికి మళ్ళీ ఇంకో జీవునిగా పుట్టవలసి వస్తుంది. కొన్ని సార్లు మానవ జన్మ కూడా లభిస్తుంది.  ఆత్మజ్ఞాన మార్గదర్శనం లేని మానవులు తమ కర్మలను అలానే కొనసాగిస్తూ  జీవన్మరణ/కర్మ చక్రంలో తిరుగుతూ ఉంటారు. అటువంటి వారిని "భవులు" అంటారు.  భవులు తమకు పరిస్థితులు సానుకూలంగా ఉండడానికి, విషయ వాంఛలు తీర్చుకోడానికి యజ్ఞయాగాది కర్మలు, గ్రహ శాంతి, దోష నివారణ, పాప పరిహరణకు వ్రతాలూ, పూజలు, శుభ ముహూర్థం, వర్జ్యము వంటి సమయాసమయ భేదములు, అంటూ, శౌచము వంటి పద్ధతులను సంప్రదాయంగా పాటిస్తారు.  ఎందుకంటే వారిది  కర్మ మార్గజీవనశైలి ; ఇది తప్పు అని అనడం లేదు  - వారికి  అవి అవసరం.  

ఇక  ఆత్మజ్ఞాన విచారణ, గురులింగజంగమ సంబంధముతో ముముక్షువులైన  వీరశైవులు మాత్రం ప్రపంచాన్ని విడివిడిగా గాక శివుడనే భావనతో చూడడం నేర్చుకుంటారు. ఏ కర్మ చేసిన ఎదో ఫలితం పొందాలనే ఆశతో కాక శివార్పణ భావంతో చేస్తారు- దీనివల్ల వీరికి కర్మ ఫలాలు అంటవు. నిత్య శివపూజ తప్ప ఏ వ్రతాలూ పాటించరు; అగ్నిష్టోమాది క్రతువులకు దూరంగా ఉంటారు. ప్రాపంచిక సుఖప్రయోజన ఫలాలను పొందే ప్రయోజనాధ్యేయంతో ఏ పూజలు చేయరు.  వీరికి సర్వశక్తిమంతుడైన శివుడు తప్ప ఇతరాత్ర దేవతలు ఎవ్వరు రుచించరు.
ఇటువంటి ఆచారముతో ఉంటూ భవి మార్గములకు దూరంగా ఉండే వీరశైవులకు -
- సర్వము శివస్వరూపమైనప్పుడు ఇక అంటు-ముట్టు లెటువంటివి? అయితే దీనర్థం పరిశుభ్రతతో ముడిబెట్టేరు సుమా! - నిత్యం త్రిసంధ్యలలో స్నానముతో కూడిన శివ పూజా విధానము వీరశైవులకు నియమంగా ఉంది. ఇంట్లో మరణంగాని , పిల్లలు పుట్టినప్పుడు గాని, నెలలు మొదలైన అంటులను వీరశైవులు పాటించడం కూడదని, అందరు అన్ని పరిస్థితులలోను ఇష్టలింగారాధన విడువరాదని ఖచ్చితంగా చెప్పబడింది. 
- కాలము కాలకాలుడైన శివుని సృష్టి అయినప్పుడు, శుభలగ్నము,వర్జ్యము ఎక్కడిది? అందుకే వీరశైవులు పంచాగం, వర్జ్యాలను పాటించరు.  
- అన్ని దిక్కులు శివుని ముఖములైనప్పుడు, వాస్తుదోషమెక్కడిది? ప్రాపంచిక సుఖదుఃఖములు శివ ప్రసాదంగా భావించి అనుభవించే వీరశైవులను గ్రహదోషాలు ఎలా బాధిస్తాయి?  కాబట్టి తిథి, వార, నక్షత్ర, వర్జ్యమూల వంటి కాలదోషములను వీరశైవులు పట్టించుకోరు. గ్రహశాంతి, వాస్తుదోషము, శుభాశుభ శకునములు వంటి భవ సంప్రదాయములను వీరశైవులు పాటించరు. 

నిత్య శివమార్గములో నిమగ్నులై, శివానుభవులై కర్మలకు దూరమై పాపపుణ్యములను త్యజించి జీవన్ముక్తులయ్యెడి వారు వీరశైవ శరణులు. బసవన్న ఈ విషయాన్నే ఈ వచనంలో ప్రస్తావించారు.  

శరణు శరణార్థి !!  



No comments:

Post a Comment