Sunday, July 26, 2015

29. Kombeya Melana Markatadamte - Basavanna


కన్నడ వచనం 

ಕೊಂಬೆಯ ಮೇಲಣ ಮರ್ಕಟನಂತೆ ಲಂಘಿಸುವುದೆನ್ನ ಮನವು
ನಿಂದಲ್ಲಿ ನಿಲಲೀಯದೆನ್ನ ಮನವು
ಹೊಂದಿದಲ್ಲಿ ಹೊಂದಲೀಯದೆನ್ನ ಮನವು
ಕೂಡಲಸಂಗಮದೇವಾ, ನಿಮ್ಮ ಚರಣ ಕಮಲದಲ್ಲಿ ಭ್ರಮರನಾಗಿರಿಸು ನಿಮ್ಮ ಧರ್ಮ

తెలుగు లిపిలో 

కొంబెయ మేలణ మర్కటదంతె లంఘిసువుదెన్న మనవు 
నిందల్లి నిలలీయదెన్న మనవు 
హొందిదల్లి హొందలీయదెన్న మనవు 
కూడలసంగమ దేవా, నిమ్మ చరణ కమలదల్లి భ్రమరనాగిరిసు నిమ్మ ధర్మ 
  
తెలుగు వచనం 

కొమ్మ మీద మర్కటమువలె లంఘించు నా మనసు 
నిలువగ నిలువనీయదు నా మనసు 
పొందుగ పొందికతోనుండదు నా మనసు 
కూడలసంగమ దేవా, నీ చరణ కమలమందు భ్రమరముగామార్చు, అది నీ ధర్మము!! 

వచనకర్త ఆంతర్యం 
మనస్సుని అదుపులో పెట్టడం నాచే కానిపని. నీవే నీ ధర్మంగా స్వీకరించి నీ చుట్టూ తిప్పుకోవయ్యా!


విశ్లేషణ 

ఈ వచనం బాగా అర్థం చేసుకోవాలంటే కొద్దిగా యోగ శాస్త్రంలో వివరించిన కొన్నితత్వాలను తెలుసు కోవాలి. మన శరీరం ఎలా పని చేస్తుందో ఎవరి అదుపులో ఉంటుందో ఆలోచించవలసి ఉంటుంది. 
 
మనందరికీ పంచ జ్ఞానేంద్రియాలు (అంటే త్వక్, శ్రోత్ర, రసన, ఘ్రాణ, నేత్రములు వాడుక భాషలో చెప్పాలంటే చెవులు, చర్మము, నాలుక, కళ్ళు, ముక్కు అన్నమాట)  ఉన్నాయి. వీటి వల్ల పంచ తన్మాత్రలను అనుభవిస్తాము ( అంటే శబ్ద స్పర్శ రస రూప గంధములు లేదా వాడుక భాషలో  వినికిడి, స్పర్శ, రుచి, రూపము, వాసనలు).ఈ  విషయాలను జ్ఞానేంద్రియాలు బయటి విషయాలను గ్రహించి లోపలికి చేరుస్తుంటాయి (అంటే Inputs అన్నమాట) వీటివల్ల తప్ప మనకి బయట ప్రపంచం నుండి ఏ విషయాలు తెలుసుకొనే మార్గం లేదు.  

అలాగే  పంచ కర్మేంద్రియాలు  (అంటే వాక్కు, పాణి, పాదం, ఉపాస్త, పాయువుల వాడుక భాషలో కంఠము, చేతులు, కాల్లు, జననాంగములు, విసర్జనాంగములు) ఉన్నాయి. వీటితో మాట్లాడడము, పని చేయడము, అటు ఇటు వెళ్ళగలగడము, సంతానం కనడము, మలమూత్ర విసర్జనము జరుగుతాయి. ఈ కర్మేంద్రియముల ద్వారా మనము లోని భావాలను బయటకి వ్యక్తపరుస్తుంటాము (అంటే Outputs అన్నమాట). వీటివల్ల  తప్ప ఇంకే విధంగా మనలని మనం వ్యక్త పరచలేము. 

అయితే వీటన్నిటి వెనక ఉండేవి, మనకు కనబడనివి అంతఃకరణములు - ఇవి మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అనే నాలుగు. 
- నేనున్నాననే చైతన్యమే 'చిత్తము'. 
- నేను, నాది అని తలపించేదే 'అహంకారము'.  
- తప్పొప్పులను ఆలోచింపజేసేదే 'బుద్ధి'. 
- సంకల్ప వికల్పములకు ఆలవాలము 'మనస్సు'. 

ఈ వచనమ్లో ప్రధానము మనస్సు గురించిన చర్చ. మనసెప్పుడు ఎదో చెయ్యాలి (సంకల్పం), ఏదో చేయకూడదు (వికల్పం) అని తలుస్తూ ఉంటుంది. ఉదాహరణకు, ఉన్నట్టుంది మొన్న వంకాయ కూర బావుండింది, మళ్ళి తినాలి అనిపిస్తుంది; కొనడానికి వెళ్ళారు. వెంటనే దానికన్నా ఈ దుకాణంలో బెండకాయలు ఇంకా బాగున్నాయి, వంకాయరేపు చెయ్యొచ్చులే అని ఇంకో అలోచన. 
ఎప్పుడూ ఇది ఇష్టం, ఇది అయిష్టం అని చెబుతూ ఉంటుంది. చిన్న పిల్లలనుండి, ముసలివారి వరకు అందరిలోనూ మనసు చేసే పని ఇదే. 

ఈ మనస్సు మనకి బహిరంగంగా కనబడకపోయినా ఎప్పుడూ పైన చెప్పిన జ్ఞానేంద్రియాల నుండి ప్రతిక్షణం సమాచారం స్వీకరిస్తూ, కర్మేంద్రియాలకు ఏమి చేయాలో సూచిస్తూ, ఇంద్రియాలనన్నింటిని ఈ మనస్సు పూర్తిగా తన అదుపాజ్ఞలలో ఉంచుకుంటుంది. 

ఉదాహరణకు ఇంట్లో అంతా సంతోషంగా ఏదో మాట్లాడు తున్నారు. నా మనస్సు చికాకుగా ఉంది. వెంటనే ఎదో ఆలోచించకుండా అరిచేసాను - అంటే వాక్కు మనస్సు అధీనంలోకి వెళ్లి పోయింది. అక్కడ వాతావరణం మార్చేసాను; అది పరిణామాల తీవ్రతని ఆలోచించే విచక్షణ నా మనసుకి ఉండదు. ప్రతీ చోటా ఉండే పరిస్థితికి కారణం అక్కడ ఉండే వాళ్ళ మనస్సు యొక్క స్థితి మాత్రమే - అది సుఖమైన, దుఃఖమైనా, సంతోషమైన, ఏడుపైనా, భయమైనా, భ్రాంతైనా ఏదైనా సరే.   
   
మనస్సు కొత్తకొత్త విషయాలను ఇంద్రియాల ద్వారా నేర్చుకుని, వాటిలో తనకు నచ్చిన వాటిని మళ్లి మళ్ళి కావాలని అడుగుతుంది. ఉదాహరణకు ఒక కొత్త వంట తిన్నారనుకోండి. ఇదివరకెప్పుడూ తినలేదు. కానీ నచ్చింది. మళ్లీ అది తినిపించమని మనస్సు ఇంద్రియాలను ఉత్సాహపరుస్తుంది. ఇలాంటి మనస్సుకు వశులమై మనము నిత్యం జీవితం గడుపుతున్నాము. 

ఈ మనస్సుకి ఒక్క క్షణం కూడా తీరిక ఉండదు. నడుస్తున్నా, కూర్చున్నా, నిలబడ్డా, పడుకున్నా మనస్సుకు మాత్రం తీరిక ఉండదు.  ఎపుడూ ఒకదాని తరువాత ఒకటి ఆలోచనలు, కోరికలే! అరే పది నిముషాలు శివ పూజకు కూచుంటే అప్పుడు కూడా ఏవో ఆలోచనలు - ఉద్యోగమని, పిల్లలకు ఎదో మరిచామని, ఇంకేదో చేయాలని. ఒక చోట నిలువదే?!

అందుకే మనస్సుని కోతితో పోల్చారు బసవన్న. ఇలాంటి చపలమైన కోతిలాంటి మనస్సు నా అదుపులో ఉండట్లేదు. దీన్ని పట్టడం నావల్ల కావట్లేదు. నీకే ఇస్తున్నాను, నీ పాదాలనే పువ్వులచుట్టు తుమ్మెదవలే తిప్పుకోవయ్యా అని అడిగారు. అంతే కాదు ఇది నీ ధర్మం అని శివుని ముందలి కాళ్ళకు బంధాలు వేసేసారు. 

ఈ పోలిక కేవలం బసవన్నే కాదు. దిశంకరులు కూడా అదే కోరారు, శివానందలహరిలో -

సదా మొహాటంవ్యా చరతి యువతీనాం కుచగిరౌ
నటత్యాశాశాఖాస్వటతి ఝటితి స్వైరమభితః । 
కపాలిన్భిక్షో మే హృదయకపిమత్యంత చపలం
ధృడ భక్త్యా భంద్వా శివ భవదధీన కురు విభో॥   

ఎప్పుడూ యువతి మోహంలో వారి హృదయ స్థానాన్నిఆశిస్తూ తిరుగుతూ ఉంటుంది నామనస్సు. ఆశలనే కొమ్మలపై ఇష్టం వచ్చినట్లు అటు ఇటు దూకుతూ చంచలగా ఉంటుంది. అలాంటి అత్యంత చపలమైన ఈ మనస్సనే కోతిని నీ కపాలపు భిక్ష పాత్రలో వేస్తున్నాను. నువ్వు ధృఢభక్తి అనే తాడుతో కట్టి నీ అధీనంలో ఉంచుకోవయ్య శివా!!  

ఒక నిజభక్తునికి భగవంతున్ని ఏమి కోరాలో తెలియాలి. అందుకే గురువులంతా మన స్థానంలో తమని పెట్టుకొని బోధించారు. ఒంకొకరి దౌర్బల్యాలను ఎత్తి చూపడంకన్నా బసవన్న ఇది తన దౌర్బల్యమని తనమీద వేసుకొని ఈ వచనంలో వేరొకరిని నొప్పించకుండా బోధిస్తున్నారు- మనస్సనే కోతిని శివునికి అర్పించుకోమని.
    
ఒక్కసారి మనస్సుని నిగ్రహించగల్గితే, ఇంద్రియాలన్నీ అదుపులో ఉంటాయి. చుట్టూ వాతావరణమంతా శివమయమవుతుంది. కాని అది మనతరం కాదు - చాలా కష్టం. కాబట్టి ఈ విషయాన్నీ గ్రహించి ఆ శివున్నే వేడుకుందాం.   

శరణు శరణార్థి!!


   





 

Sunday, July 19, 2015

28. Kalali Kattida Gundu, Koralali Kattida Bendu - Basavanna



కన్నడ వచనం 
ಕಾಲಲಿ ಕಟ್ಟಿದ ಗುಂಡು, ಕೊರಳಲಿ ಕಟ್ಟಿದ ಬೆಂಡು!
ತೇಲಲೀಯದು ಗುಂಡು, ಮುಳುಗಲೀಯದು ಬೆಂಡು!
ಇಂತಪ್ಪ ಸಂಸಾರಶರಧಿಯ ದಾಂಟಿಸಿ
ಕಾಲಾಂತಕನೇ ಕಾಯೋ, ಕೂಡಲಸಂಗಯ್ಯ!

తెలుగు లిపిలో 

కాలలి కట్టిద గుండు,  కొరళలి కట్టిద బెండు
తేలలీయదు గుండు, ముళుగలీయదు బెండు 
ఇంతప్ప సంసారశరధియ దాంటిసి 
కాలాంతకనే కాయో కూడలసంగయ్య!


తెలుగు వచనం 

కాలికి కట్టిన గుండు, మెడకు కట్టిన బెండు 
తేలనీయదు గుండు, మునుగనీయదు బెండు
ఇంటువంటి సంసారశరధి దాటించు 
కాలాంతకా కావుమా కూడలసంగయ్య!

వచనకర్త ఆంతర్యం 

కష్టసుఖాలతో కూడిన సంసారం మభ్యపెడుతూ ఉంటుంది. ఆ పరమేశ్వరుని కృప లేనిదే ఈ సంసారసాగరాన్ని దాటడం సాధ్యం కాదు. 

విశ్లేషణ 

పూర్వము తప్పులు చేసిన వారికి రాజులు శిక్షలు వేసేవారు. మరణ శిక్షలలో కూడా కొన్ని భయంకరంగా ఉండేవి. నీటిలో ముంచడం వంటివి. మాములుగా నీటీలో పడేస్తే తిరిగి ఈదుకుంటూ వస్తారని, ఒక బరువైన రాతి గుండుని కట్టి విడిచేవారు. వాడు నీట మునిగి, బయటకి రాలేక మరణించేవాడు. 

ఈత నేర్పాలంటే ఊళ్ళల్లో బెండు కట్టి నీటిలోకి తోసేస్తారు. అలా విడువబడిన వాడు నీటిలో మునుగకుండా బెండు చూసుకుంటుంది, తేలుస్తుంది . అలా అతడు ఈత నేర్చుకుంటాడు. 

సంసారమనేది మన గత జన్మల ప్రారబ్దాల కారణంచేత, పాపపుణ్యాల ఫలాలతో కూడి, కొన్నిసార్లు కష్టాలలో గుండువలే ముంచుతూ, మరికొన్ని సార్లు బెండువలే సుఖాలలో తేలుస్తూ ఉంటుంది. అటు మునగదు, ఇటు తేలదు. మనిషి జన్మలో అనునిత్యం కష్టాలు, సుఖాలు అనుభవిస్తూనే ఉంటాడు. పెద్ద పెద్ద కష్టాలు, సుఖాలు అలోచించవలసిన పని లేదు, రోజు చిన్న చిన్నవీ కల్గుతూనే ఉంటాయి. ఉదాహరణకు మండుటెండలో నడవాల్సి వస్తే కష్టమైతే, వెంటనే చల్లని మంచినీళ్ళు త్రాగడం సుఖమవుతుంది. ఇటువంటి కష్టసుఖాల కలయికతో గడిచే జీవతం సముద్రంలాగా విశాలమైనది, అంతు చిక్కడం చాలా కష్టం. చాలామంది అంతుగురించి తెలియక, అలోచించడం మాని ఆ సంసారం సాగర  ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు. ఈ ప్రవాహమే కాలం (time). 

జగత్తులోని ప్రతీ వస్తువు కాలం యొక్క అధీనంలో ఉంటుంది. కాలము ఎవ్వరూ ఆపలేని ప్రవాహము. నిరంతరం సాగిపోతూనే ఉంటుంది. అనుక్షణం ఇలా గడిచి పోతున్న కాలం జగత్తులో మార్పులు తెస్తూ ఉంటుంది. ఉదాహరణకు పొద్దున్న కాచిన పువ్వు మధ్యాన్నానికి వాడిపోతుంది. మరుదినానికి మట్టయి పోతుంది. పువ్వుకి ఒక్క రోజైతే మనకి వందేళ్ళు, అంతే తేడా. ఎలాగైతే కాలం పువ్వుని భక్షించిందో, అలాగే మననీ తినేస్తుంది. అందుకే కాలము జగత్తుని భక్షిస్తుందని అంటారు. బ్రహ్మాదిపిపీలికాంతము (బ్రహ్మ నుండి మొదలుకొని చీమ వరకు) అందరూ కాలానికి లోబడే ఉంటారు. ఎంతో మంది వీరులు, అవతార పురుషులు, దేవతలు, రాక్షసులు కాలంలో వచ్చారు, పొయ్యారు. రాముడని, కృష్ణుడని పూర్వపు అవతారాలతో పాటు, నేడు గొప్పగా పూజించే సాయిబాబా వరకూ రకరకాల అవతారాలు వచ్చినా కాలానికి లోబడి, ఏదో విధంగా నిర్యాణం చెందిన వారే.  
ఇలా జగత్తుని నిదానంగా మింగే కాలాన్ని చుట్టుకున్న సర్పంతో పోలుస్తారు. చుట్టుకున్న పాము నెమ్మదిగా కదులుతూ కదలిక తెలియకుండా ఒకే ఆకారంతో ఉంటుందో, కాలం కూడా తన ఉనికి తెలియకుండా గడచి పోతూ ఉంటుంది. 

మరి ఇన్ని సంఘటనలకు, జగత్తులోని విషయాలను తనకు తాను వశపరచుకొని శాసించే కాలానికి అదుపులేదా? కాలమ్లో భాగమైన సంసారమనే సముద్రంలో జీవులంతా కొట్టుకు పోవలసిందేనా? ఇటువంటి కాలాన్ని శాసించే వారెవరైనా ఉన్నారా? అంటే ఆ ప్రశ్నకు సమాధానమే కాలకాలుడు, కాలాంతకుడు అయిన పరమేశ్వరుడు. కాలమైన ఆ మహాసర్పాన్ని తన మెడలో వేసుకొని చిరునవ్వుతో, అభయ హస్తంతో చెబుతున్నాడు, ఈ కాలము నన్నేమీ చేయలేదు, నా అధీనంలో ఉంది భయపడకండి అని. నటరాజ స్వరూపంలో కాలాన్ని తనవశం చేసుకొని, అభయమిస్తూ తన ఎడమ పాదము వైపు చూపే మూర్తే చెబుతుంది, ఈ ఎడమ పాదాన్ని ఆశ్రయిస్తే (కుంచితాంఘ్రిం భజేహం) నువ్వు కాలాతీతుడవుతావు అని. 

నిజంగానా? అవును.. 
మార్కండేయ చరిత్ర చూడండి. కాలానికి లోబడి ఈ ప్రపంచంలో ప్రతీ జీవి అంతమొందేలా శాసించే సమవర్తి యముడు. అది అతని ధర్మం. అందుకే అతనికి మరో పేరు కాలుడు. తన పాదాలను ఆశ్రయించిన చిన్ని వాన్ని కాపాడడానికి ఆ ఎడమపాదమే లేచి, కాలుడైన యమ్మున్ని ఛాతిపై తన్ని చంపింది. కాలాన్ని హతమార్చింది. అప్పుడే కాలాంతకుడైనాడు రుద్రుడు.  

వేదం పలుసార్లు ఈ రుద్రున్ని"క్షయద్వీరాయ" అని పొగిడింది - అంటే "నశించుచున్న వీరులు/భ్హృత్యులు కలవాడా" అని. అంటే ఏంతో మంది గొప్పవాల్లనుకునే వీరులు నీ ముందు పడిపోతూ ఉంటారు, నువ్వు మాత్రం కాలానికి అతీతుడవై అలా నిలిచుండి పోతావు అని. అదే కాలకాలున్ని ఇంకో చోట నమస్తారాయ (నమః + తారాయ) అని పొగిడింది. అంటే కాలాతీతమైన సంసారమనే సాగరం నుండి తరింపజేసేవాడు, దరిజేర్చేవాడు అని.  అందుకే బసవన్న ఈ వచనంలో ఆ కాలాంతకున్ని పిలిచాడు, సంసారసాగరాన్ని దాటించవయ్యా అని. ఇక ఆ కాలకలుడైన కూడల సంగమేశ్వరున్ని వినా ఇతరాత్రులని వేడితే చిన్న చిన్న కోరికలు తీరుతాయేమో గాని సంసారం బంధం విడుతుందా? ప్రాజ్ఞులు ఆలోచించండి.  

శరణు శరణార్థి!!



     




Sunday, July 12, 2015

27. Saganiya Benakana Madi - Basavanna

కన్నడ వచనం 

ಸಗಣಿಯ ಬೆನಕನ ಮಾಡಿ ಸಂಪಿಗೆಯರಳಲ್ಲಿ ಪೂಜಿಸಿದರೆ
ರಂಜನೆಯಹುದಲ್ಲದೆ, ಅದರ ಗಂಜಳ ಬಿಡದಣ್ಣ!
ಮಣ್ಣ ಪ್ರತಿಮೆಯ ಮಾಡಿ ಮಜ್ಜನಕ್ಕೆರೆದರೆ
ನಿಚ್ಚ ಕೆಸರಹುದಲ್ಲದೆ ಅದರಚ್ಚಿಗ ಬಿಡದಣ್ಣ!!
ಲೋಕದ ಮಾನವಂಗೆ ಶಿವದೀಕ್ಷೆಯ ಕೊಟ್ಟರೆ
ಆ ಕೆಟ್ಟವನೇಕೆ ಸದ್ಭಕ್ತನಹನು ಕೂಡಲಸಂಗಮದೇವಾ ?

తెలుగు లిపిలో 
సగణియ బెనకన మాడి సంపిగెయరళల్లి పూజిసిదెరె 
రంజెనెయహుదల్లెదె, అదర గంజల బిడదణ్ణ!
మణ్ణ ప్రతిమెయ మాడి మజ్జనక్కెరెదరె 
నిచ్చ కెసరహుదల్లదె ఆదరచ్చిగ బిడదణ్ణ!
లోకద మానవంగె శివదీక్షయ కొట్టరె 
ఆ కెట్టవనేకె సద్భక్తనహను కూడలసంగమదేవా ?


తెలుగు వచనం 

పెండ గణపతి చేసి సంపెంగపూలతో పూజించిన 
రంజనమగునేమోగాని, దాని పేడకంపు విడదన్న!
మన్ను ప్రతిమను జేసి మంచినీట్లోముంచిన
బురదముద్దగ మారునేగాక తననైజం విడదన్న!
లోకపు మానవునికి శివదీక్షను ఇచ్చిన 
ఆ చెడ్డవాడెందుకు సద్భక్తుడగును కూడలసంగమదేవా?

వచనకర్త ఆంతర్యం 

శివదీక్షను ఇచ్చే ముందు దీక్షార్హతను పరికించి ఇవ్వాలి. చెడ్డవారికి ఇస్తే వాడు మంచి వాడయిపోడు. 

విశ్లేషణ 

శివదీక్ష తీసుకోవడం ఒక గంభీరమైన విషయమని, గురువు దీక్ష ఇచ్చే ముందు పరికించి ఇవ్వాలని, దీక్షాగ్రాహి నియమనిష్టలతో ఉండవలసి ఉంటుందని ఇదివరకు మనము "కుంబళకాయిగెఉంటే  కట్ట కొట్టడె" అనే వచనంలో చర్చించుకున్నాము. అదే విషయాన్ని ఇంకో కోణంలో వేరే ఉదాహరణలతో చెబుతుంది ఈ వచనం.

పేడతో విగ్రహం చేసి సువాసనగల పూలతో పూజించినా కూడా మనకి చూడడానికి సంతోషదాయకంగా కనబడుతుందేమోగాని పేడ కంపుపోదు. ఈ ఉదాహరణ చెప్పుకోడానికి సులువుగా ఉన్నా, ఆలోచిస్తే ఒక మర్మం కనబడుతుంది. గణపతి విగ్రహం పుట్టమన్నుతో చేస్తారుగాని పేడతో చెయ్యరు. ఎదైనా చేసే ముందు సరియైన పదార్థాన్ని వాడడం ముఖ్యం. లేకపోతే ఎన్ని సుగంధ భరితమైన పుష్పాలతో అలంకరించినా కంపుపోనట్లు, దీక్ష తీసుకునే వానికి లోకంలో స్వార్థాలతో సాంగత్యం ఉంటే ధరించిన లింగాన్ని అలంకారం కోసమో, సంఘంలో పదవికోసమో, వేరే ప్రయోజనాలకోసమో వాడుకుంటాడు. అంటే వీరశైవులమనే పేరుతో ఇంట్లో నిత్య శివార్చన విషయం ఎట్లున్నా, బైట మాత్రం ఆ మిషతో రాజకీయాలు చేసి పదవులు పొందడానికి, గొప్పలు చెప్పుకోడానికి వాడుకోవడం వంటివి. అక్కడ వారికి పదవివల్ల వచ్చే ధనప్రయోజనాలు తప్ప ఆత్మప్రయోజనం ఏమీ ఉండదు. 

మన్నుతో చేసిన విగ్రహాన్ని అభిషేకం చేస్తే మట్టి ముద్దే అవుతుంది, బురదగా మారటం దాని నైజం. ఒక విగ్రహం చేసినప్పుడు దాన్ని వాడే విధానం కూడా అలోచించుకోవాలి. అభిషేకం చేయాలంటే ఏ రాతి విగ్రహమో, కంచు విగ్రహమో వాడాలి కాని మట్టి విగ్రహం వాడితే అది బురద ముద్దగా మారుతుంది. అలానే వీరశైవదీక్ష ఇవ్వాలంటే వాడికి కావలసిన భక్తి ఉంటే, దీక్షలో నిలబడే పట్టుదల ఉంటే, మనో స్థైర్యము ఉంటే, అటువంటి వానివల్ల ప్రయోజనం ఉంటుంది. లేకపోతే దీక్షను దురుపయోగపరచి చెడతాడు. పేరుకు వీరశైవులమని చెప్పుకుంటూ చేయకూడని విషయాలను చేసే వారిని చూస్తే అర్థమవుతుంది. లింగావంతులై ఉండి, సంప్రదాయమైన కుటుంబాలలో నుండి వచ్చి మాంసాహారము, మద్యపానము వంటివి నిషిద్ధమని తెలిసికూడా వాటిని చేసేవారిని చూస్తున్నాము - ఇదే బురదగా మారడమనడానికి  ఉదాహరణ. 

మాములు మనుష్యులకు శివదీక్షను ఇవ్వటంవల్ల  వాడు సద్భక్తుడు కాజాలడు. మరి మా ఇంట్లో పుట్టిన వారికి శివదీక్ష ఇవ్వాలా?వద్దా? అనే అలోచనలో, వెంటనే ఎందుకొచ్చిన బాధలే ఇవ్వకపోతే సరిపోతుందిగదా అని సరిపెట్టు కొనేరు! 
తల్లిదండ్రులైన వారికి పిల్లలకు తమ ఇంటి సంప్రదాయాలు నేర్పడం, వారికి స్వధర్మ బోధచేయడం తప్పించుకోలేని కర్తవ్యం. కాబట్టి ఎలాగైతే వారి చదువుకోసమని, పెళ్ళికోసమని, ఎప్పుడు ఏది కొనివ్వాలో దానికోసమని ఎలాగైతే భవిష్యత్ ప్రణాళికలు వేసుకొంటామో,అదే విధంగా అత్యంత ముఖ్యంగా చేయవలసింది వారిని శివదీక్షకు అర్హులుగా తీర్చిదిద్దే ప్రణాళిక. ఈ ప్రణాళిక ఏ ఖర్చు లేనిది, ధనం కూడబెట్టవలసిన అవసరం లేనిది, సులువుగా చేయగలిగేది - "ఏది మంచిదో, ఏది చెడో విడమరచి చెప్పడం, శివభక్తిని పెంపొందించడం, వారు భవిషత్తులో బురదగా మారకుండా నిలబెట్టడం" అంతే! అలా ముందు నుండి మలచబడినవాడు దీక్షకు సత్పాత్రుడవుతాడు.    

శరణు శరణార్థి..