Tuesday, April 12, 2016

39. Nelavonde Holageri Shivalayakke - Basavanna



కన్నడ వచనం 

ನೆಲವೊಂದೆ ಹೊಲೆಗೇರಿ ಶಿವಾಲಯಕ್ಕೆ
ಜಲವೊಂದೆ ಶೌಚಾಚಮನಕ್ಕೆ
ಕುಲವೊಂದೆ ತನ್ನ ತಾನರಿದವಂಗೆ
ಫಲವೊಂದೆ ಷಡುದರುಶನ ಮುಕ್ತಿಗೆ
ನಿಲವೊಂದೆ ಕೂಡಲಸಂಗಮದೇವಾ ನಿಮ್ಮನರಿದವಂಗೆ !!


 తెలుగు లిపిలో 
నెలవొందె హొలగేరి శివాలయక్కె 
జలవొందె శౌచాచమనక్కె   
కులవొందె తన్న తానరిదవంగె 
ఫలవొందె షడుదరుశన ముక్తిగె 
నిలవొందె కూడలసంగమదేవా నిమ్మనరిదవంగె !!

తెలుగు వచనం 
నెలవొక్కటే మాలవాడ శివాలయములకు 
జలమొక్కటే శౌచాచమనములకు
కులమొక్కటే తమ్ముతామెరిగిన వారలకు 
ఫలమొక్కటే షట్-దర్శన ముక్తికి 
నిలవొక్కటే కూడలసంగమదేవా, నిన్నెరిగిన వారలకు!!

వచనకర్త ఆంతర్యం  
జ్ఞానులైన వారలు జాతిమత బేధములను, ఉచ్చనీచములను ఎంచక అందరిని ఒకే దృష్టి కోణంలో చూస్తారు. కేవలం శివునెరుగుటకు మాత్రమే ప్రయత్నము చేస్తారు.  

విశ్లేషణ 

తెలుగునాట ఈ వచనం చదవగానే అన్నమయ్య కవిత గుర్తుకు రాక మానదు. 

నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియూ నొకటే 
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి యొకటే, చండాలుడుండేటి సరిభూమి యొకటే 

అని అన్నమయ్య పదిహేనవ శతాబ్దంలో వ్రాసిన పదకవితకు, బసవన్న పన్నెండవ శతాబ్దములో చాటిన ఈ వచనమే ప్రేరణ అనుకోవడంలో అతిశయోక్తి ఏమీ ఉండదు. 

భారతావనిలో వర్ణవ్యవస్థ స్వార్థపరుల అహంకారాలవల్ల పెడదోవ పట్టి, సమాజంలో హెచ్చు తగ్గులు విపరీతంగా పెరిగి, జాతిని ముక్కలు చేసి, ధర్మాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటే ఇది తప్పని మొదటిసారి విప్పుకున్న గళం బసవన్నది. వీరశైవుల సామాజిక సమానత్వ ఉద్యమము చరిత్రలోనే మొదటి క్రాంతిగా పరిగణింపబడింది.  ఆ తరువాత ఎన్నో దేశాలలో క్రాంతి ఉద్యమాలు (French Revolution, Russian Revolution, American Revolution లాంటివి) జరిగాయి. 
అయితే ఈనాడు ఇటువంటి విషయాలను ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడం సర్వసామాన్యం. కొందరు వర్ణవ్యవస్థను తిడుతూ బసవన్న పేరు వాడుకోవడం కూడా చూస్తుంటాము. కానీ పరిశీలిస్తే ఒక వ్యత్యాసం ఉంది. బసవన్న వర్ణవ్యవస్థను వ్యతిరేకించి అందరినీ ధర్మము వైపు, భక్తి వైపు మళ్ళించారు. ఈనాటి "సంఘ సంస్కర్తలు"గా పిలిపించుకునే వారు జనాలను భక్తికి, ధర్మానికి దూరంగా తరలిస్తున్నారు. కాబట్టి తస్మాత్-జాగ్రత్త!! భగవంతునికి, భక్తికి దూరంగా ఉంచే ఏ విషయమైన వీరశైవులకు పనికిమాలిన సిద్ధాంతమే. 

ఇక వచనంలోకి వస్తే -

నెలవొక్కటే మాలవాడ శివాలయములకు
శివాలయమైనా, మాలవాడైనా నెలవైనది ఒకే నేలపైన. నేలకు అంటూ లేదు. అది మానవ కల్పితము మాత్రమే. 

జలమొక్కటే శౌచాచమనములకు
శౌచానికి (అంటే శుభ్రపరచుకోడానికి) వాడే నీరు, ఆచమనము చేయడానికి వాడే నీరు ఒకటే. అంటే నీటికి అంటు లేదు. 

కులమొక్కటే తమ్ముతామెరిగిన వారలకు
తానేమిటో తెలుసుకున్న వానికి, అంటే ఆత్మజ్ఞానము  కలిగి "నేనూ" అనేది శివుడే అని  తెలుసుకొని "శివోహం "అనే భావంతో మెలిగే వానికి ప్రపంచమంతా శివుడే.  అంటే అన్ని ప్రాణులలో, అన్ని దిశలలో, దశలలో, స్థావర జంగమాలన్నింటిలో (అంటే కదలనివి, కదిలేవి) వాటి నిర్మాణానికి అవసరమైన ముడిపదార్థమైన శివుడే దరిశనమిస్తాడు. వీరశైవ ధర్మము ఈ ఆత్మజ్ఞానాన్ని , శివజ్ఞానాన్ని ఆర్జించడమనే ఏకైక ధ్యేయము కలది. ఈ జ్ఞానానికి దూరము చేసే ఏ పద్ధతినిగాని, ఏ శాస్త్రాన్ని గాని, ఏ కర్మను గానీ వీరశైవము పట్టించుకోదు. ఇక అంతటా శివుని చూసేవానికి కులమెక్కడిది?

ఫలమొక్కటే షట్-దర్శన ముక్తికి
ముందు షడ్డర్శనముల గురించి క్లుప్తంగా చర్చించుకుందాం.  ఋషులు ఆరు రకాలైన సిద్దాంతాలను దర్శించి రూపొందించారు. వారి (దివ్య) దృష్టికి అందాయి కాబట్టి అవి దర్శనాలు అనబడ్డాయి.  ఈ ఆరు కూడా ఆ కాలంలో ప్రాచుర్యంలో ఉండేవి. ఈనాటి హైందవ ధర్మములో అన్నీ కలగొలుపుగా కనబడతాయి. 

మొదటిది గౌతమ మునిచే దర్శించబడిన "న్యాయ", లేదా తర్క శాస్త్రము. ఇది ప్రత్యక్షము, ఉపమానము, అనుమానము, శబ్దము అనే నాలుగు "ప్రమాణాల"తో ఈశ్వర నిరూపణము చేస్తుంది. ప్రమాణంతో నిరూపించడమే న్యాయ శాస్త్రము. 

రెండవది కణాదుడు దర్శించబడిన "వైశేషిక" సూత్రము. ఇక్కడ పరమాణువుల సంయోగముతో మహేశ్వరుని ప్రేరణతో విశ్వములోని ఏ పదార్థమైనా ఏర్పడుతుందని నమ్మే శాస్త్రము. మహేశ్వరుని నుండి ఉద్భవించిన  బ్రహ్మ  సృష్టి కార్యము నెరవేరుస్తాడని, లయ చేయవలసి వచ్చినప్పుడు  బ్రహ్మ మహెశ్వరునిలో లయమై, ఆ తరువాత ఈశ్వరుడు ప్రతీపదార్థన్ని పరమాణువులుగా లయము చేస్తాడని విశ్వాసము. 
 
మూడవది కపిల మునిచే దర్శించబడిన "సాంఖ్య" శాస్త్రము. ప్రకృతి, పురుషులను ప్రతిపాదించే తత్వము ఇది. ప్రకృతిలోని సత్వ, రాజస్, తమో గుణముల సమతుల్యము చెదిరినప్పుడు పురుషుడు తన ఉనికిని కలిగి ఉంటాడని, పురుషుడు తన నిజ స్వరూపమైన శివ తత్వమును ఎరిగిననాడు, ప్రకృతిలో కలిగిన వికారము తాను కానని ఎరిగి కైవల్యము పొందుతాడని విశ్వాసము.  

నాల్గవది పతంజలి మునిచే దర్శించబడిన "యోగ" శాస్త్రము. ప్రకృతి, పురుషుడు, ఈశ్వరుడు అనే మూడింటిని ప్రతిపాదించి యోగమార్గము చేత "ఆత్మయే ఈశ్వరుడ"ని తెలుసుకొని, దర్శించుకొని సమాధి స్థితి ద్వారా నిర్వాణము అనగా ముక్తి పొందటము ఇక్కడ ధ్యేయము. 

ఐదవది జైమినిచే దర్శించబడిన "పూర్వమీమాంస" లేదా కర్మమీమాంస. ఇక్కడ వైదిక కర్మలచేత ఆరాధన, అగ్నిష్టోమాది క్రతువులు చేయడం, మంత్రములచేత ఉపాసన వీరి నమ్మకము. వర్ణశ్రమాలు పాటిస్తారు. కర్మకాండను పూర్తిగా నమ్ముతారు. వీటిచేతనే తరించగలరని వీరి విశ్వాసము. 

ఆరవది బాదరాయణునిచే దర్శింపబడిన "ఉత్తరమీమాంస" లేదా  "వేదాంతము". వీరు వేదములోని కర్మకాండకు కాకుండా ఉపనిషత్తులకు ప్రాముఖ్యము ఇస్తారు. ఆత్మ, పరమాత్మ, మాయ వంటి విషయముల చుట్టూ చర్చ జరుగుతుంది.  "జ్ఞాన" మార్గాన్ని ప్రతిపాదిస్తారు. ఈనాటి ద్వైత, అద్వైత,విశిష్టాద్వైత, శక్తివిశిష్టాద్వైతములన్నీ వేదాంత ప్రతిపాద్యములే. ఇక్కడ కూడా అహం బ్రహ్మాస్మి, శివోహం, తత్వమసి అనే భావం జ్ఞానమార్గము ద్వారా ఎరిగి సచ్చిదానంద స్థితి పొందడము ఉద్దేశ్యము. 

ఈ ఆరు సిద్ధాంతాలలో కొన్ని పరస్పర వైరుధ్యాలు కనిపించినా, కొన్ని అంగీకారాలు కనిపించినా, వీటి ధ్యేయము మాత్రము ఒక్కటే - 1. పరమేశ్వరుని తత్వ ప్రతిపాదన, 2.జీవుని స్వరూపము, 3. జగత్తు యొక్క నిర్మాణము, 4. మోక్ష మార్గము. 
ఈ దర్శనాలలో ఏ మార్గాన్ని విశ్వసించినా అన్నింటి ఫలము మోక్షము మాత్రమే అని బసవన్న నాలుగవ వాక్యము. 

నిలవొక్కటే కూడలసంగమదేవా, నిన్నెరిగిన వారలకు
ఇది  అన్నిటికన్నా ముఖ్యమైన ప్రతిపాద్యము. ఎన్ని ఎరిగినా, ఎన్ని తెలుసుకున్నా, ఎంత గొప్పవారలైనా  నిలకడ కనిపించదు; ఎప్పుడూ ఏదో తాపత్రయము, అశాంతి. నిలకడ కలిగిన స్థానము శాంతి స్థానము కేవలం పరమేశ్వరుడు  ఆ కూడల సంగమున్ని తెలుసుకున్న వాని స్థానము మాత్రమే. అన్ని మార్గాలను, వైషమ్యాలను వదలి పరమేశ్వరుని తెలుసుకోవడమే పరమధ్యేయమై వీరశైవులు ఉండాలని బసవన్న బోధ. 

శరణు శరణార్థి!! 






    





No comments:

Post a Comment