Sunday, December 13, 2015

37. Umba Battalu Bere Kanchalla, Noduva Kannadi Bere Kanchalla - Basavanna

కన్నడ వచనం 

ಉಂಬ ಬಟ್ಟಲು ಬೇರೆ ಕಂಚಲ್ಲ
ನೋಡುವ ಕನ್ನಡಿ ಬೇರೆ ಕಂಚಲ್ಲ
ಭಾಂಡ ಒಂದೇ ಭಾಜನ ಒಂದೇ
ಬೆಳಗೇ ಕನ್ನಡಿ ಎನಿಸಿತ್ತಯ್ಯಾ
ಅರಿದಡೆ ಶರಣ ಮರೆದಡೆ ಮಾನವ
ಮರೆಯದೆ ಪೂಜಿಸು ಕೂಡಲಸಂಗನ.

తెలుగు లిపిలో 

ఉంబ బట్టలు బేరె కంచల్ల 
నోడువ కన్నడి బేరె కంచల్ల 
భాండ ఒందే భాజన ఒందే 
బెళగే కన్నడి ఎనిసిత్తయ్య  
అరిదడె శరణ, మరెదడె మానవ 
మరెయదె పూజిసు కూడలసంగన

తెలుగు వచనం 

తినే కంచము వెరే కంచుగాదు, చూసే అద్దము వేరు కంచుగాదు 
భాండము ఒకటే, భాజనమూ ఒకటే - మెరిస్తే అద్దమనిపిస్తుంది 
తెలిసుకొన్నవాడు శరణుడు, మరచినవాడు మానవుడని 
మరువక పూజించు కూడలసంగముని 

వచనకర్త ఆంతర్యం 

లోకంలో మానవులందరూ ఒకటే అని గుర్తెరగి, భక్తితో శివుని పూజించు వాడే నిజమైన శరణుడు!!

విశ్లేషణ 

ప్రపంచములోని విషయములన్ని శివుని నుండే పుట్టాయని నమ్ముతారు వీరశైవులు. ప్రతీ జీవునిలో ప్రేరకుని రూపంలో ఉండేది మహేశ్వరుడని విశ్వసిస్తారు. మరి జీవునికి శివునికి తేడా లేదా?  నేను శివున్నైతే శివునిలా నాకు శక్తులు లేవే? వంటి ప్రశ్నలు వస్తాయి. వీటిని వీరశైవము ఈ విధంగా వివరిస్తుంది- 
ప్రతీ జీవుడు శివుని అంశే అయినా, జీవున్ని అవిద్య అనే మాయ కప్పి ఉంచుతుంది. ఈ మాయ ప్రభావమువల్ల నేను అల్పున్ని (చిన్నవాన్ని) అన్న అపోహలో జీవుడు ఎన్నోజన్మలుగా పుడుతూ చస్తూ అలవరచుకుంటాడు - చీమై పుడితే చీమనని, ఏనుగై పుడితే ఏనుగునని, మనిషై పుడితే మనిషినని భ్రమిస్తూ తన స్వస్వరూపమైన శివున్ని మరచిపోయి ఉంటాడు. ఈ అవిద్యను తొలగించు కోవాలంటే ముందు "నేనెవరిని?" అనే కుతూహలము కలగాలి. అది కలిగిననాడు మనిషి ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మజ్ఞానం వైపు ప్రయాణిస్తాడు. గురువు దానిని ప్రేరేపిస్తాడు, చేయి పట్టుకు నడిపిస్తాడు. అయితే ఈ జ్ఞానము కేవలము పుస్తకము చదివో, కేవలం ఎవరో చెబితే నేర్చుకొనేది కాదు. అనుభవ పూర్వకంగా కలగాలి. ఉదాహరణకు పుస్తకాలు చదివి పరీక్ష వ్రాస్తే వైదుని (doctor) పట్టా ఇచ్చెయ్యరుగా? ముందు ఐదారు సంవత్సరాలు ఒక్కొక్క తరగతిలో ఉంచి పొందవలసిన విద్య నీర్పుతారు.  అనుభవం కలగడానికి కొన్నాళ్ళు వైద్యశాలలో పనిచేయిస్తారు. ఆచరణాత్మకంగా నేర్పిస్తారు. సరిగ్గా వైద్యం చేస్తే అప్పుడు వైద్యునిగా గుర్తిస్తారు. పట్టా ఇస్తారు. ఈ మార్గంలో ఆ వ్యక్తికీ అనుభవముద్వారా వైద్యము యొక్క జ్ఞానము కల్గుతుంది. 
అదే విధంగా నేనే శివున్ననే లింగంగా సామరస్య భావము, ఐక్య భావము కలగాలంటే చాలా కష్టపడి ఆచరణయుక్తంగా అష్టావరణములు, పంచాచారములను పాటించి, షట్ స్థలములనే వివిధ తరగతులలో ఉంటూ క్రమంగా శివైక్య భావాన్ని అనుభవపూర్వకంగా (with experience) పొందవలసి ఉంటుంది. అలా పొందెడి వారు, లేదా ఎరిగి అటువంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నవారు శరణులు అని పిలవ బడతారు. 

నిత్యమూ పదును పట్టి నున్నగా చేస్తే కంచు అద్దముగా మెరుస్తుంది.  (ఆ కాలంలో అద్దము కంచుతోనే తయారు చేసేవారు). తినే కంచాన్ని కంచుతో చేసినా అంతగా మెరవదు - కారణం దాని ఉపయోగము వేరు; కానీ దాన్ని నున్నగా చేస్తే అదికూడా అద్దముల మెరుస్తుంది కదా. కంచానికి, అద్దానికి  లక్షణాలు ఉపయోగాలు వేరైనా వాడే ముడి పదార్థము మాత్రము కంచే. 

మనుషులు కూడా ఏంతో మంది ఉంటారు. వారిలో శివభక్తిలో మునిగి, లింగాంగ సామరస్యమును పొంది, ప్రతీ జీవునిలో మహేశ్వరుడే ప్రేరకుడై ఉంటాడని తెలుసుకుని ఎరిగి ప్రవర్తించే జీవుడు శరణుడవుతాడు. ఇలాంటి శరణుడు రాయిని, వజ్రాన్ని సమానంగా చూస్తాడు. మట్టిని బంగారాన్ని ఒకే విధంగా చూస్తాడు.  అందరిని సమంగా ఆదరిస్తాడు, అందరితో సమంగా వ్యవహరిస్తాడు. రకరకాల పాత్రలరూపంలో ఉన్నా కుండలన్నింటికీ ముడి పదార్థం మట్టే, అలానే ప్రపంచానికి ముడిపదార్థం శివుడని అని గ్రహించి ప్రతి వస్తువులో శివున్ని చూడడం అనుభవపూర్వకంగా నేర్చుకుని, నిత్యం శివానందంలో మునిగి తేలుతూ, ఎరుకతో తిరిగే అవస్థ శరణులు పొందుతారు. ఇలా ఎరుగక తిరిగే వారు, సత్యాన్ని మరచి తిరిగేవారు అంటే మనలాంటి వారు, మామూలు మనుషులు.  

అద్దము మెరిసి స్వస్వభావాన్ని ప్రతిబింబింపజేస్తుంది. అదే విధంగా జ్ఞాని అయిన మనిషి శరణునిగా మెరుస్తూ, జ్ఞానాన్ని ప్రతిబింబింపజేస్తుంటాడు. ఈ జ్ఞానము ఇతరులకు ఉపయుక్తమై, మార్గదర్శకమై, శివుని ఆజ్ఞగా లోకాన్ని నడిపించే పథమవుతుంది. శివశరణుల అద్దము నుండి వెలువడిన వచనములే ఈనాటికీ మనకోసమై ప్రతిబింబించే జ్ఞానము. 

అయితే ఇంత జ్ఞానము ఉన్న శరణులు నిరాడంబరులై, ఎలాంటి అహంకారము లేక, ఇతరులనుండి ఎటువంటి ఆపేక్ష లేక అందరిపై సమాన భావం కలిగి ఉంటారు. మేము జ్ఞానాన్ని పంచుతున్నాము మా కళాశాలకు ఇంత రుసుం చెల్లించండన్నట్లు, ఆశ్రమాలను ఏర్పాటు చేసుకుని విరాళాలతో డంబాచారం చేసే నేటి సన్యాసులను శరణులని భ్రమ పాడేరు సుమా! 

శరణులుగా మారాలనుకునే మనుషులు, అన్ని జీవులలో అభేద్య భావముతోనే శివున్ని పూజించాలనేది బసవన్న ఉవాచ. 

శరణు శరణార్థి!!







1 comment: