Sunday, October 18, 2015

35. Samsaravembudu Ondu Galiya Sudaru


కన్నడ వచనం 
ಸಂಸಾರವೆಂಬುದು ಒಂದು ಗಾಳಿಯ ಸೊಡರು!
ಸಿರಿಯೆಂಬುದು ಒಂದು ಸಂತೆಯ ಮಂದಿ ಕಂಡಯ್ಯ!
ಇದ ನೆಚ್ಚಿ ಕೆಡಬೇಡ;
ಸಿರಿಯೆಂಬುದ ಮರೆದು ಪೂಜಿಸು
ನಮ್ಮ ಕೂಡಲಸಂಗಮದೇವನ!

తెలుగు లిపిలో 
సంసారవెంబుదు ఒందు గాళియ సూడరు 
సిరియెంబుదు ఒందు సంతెయ మంది కండయ్య 
ఇద నెచ్చి కెడబేడ 
సిరియెంబుద మరెదు పూజిసు 
నమ్మ కూడలసంగమ దేవన

తెలుగు వచనం 
సంసారమనునది ఒక గాలిలో దీపము 
సిరియనునది సంతలోమంది వంటిది కదయ్యా 
ఇది నచ్చి చెడకు
సిరియనునది మరచి పూజించు 
మన కూడలసంగమ దేవుని 

వచనకర్త ఆంతర్యం 
పరమేశ్వరున్ని పుజించే సమయంలో విషయ వాంఛలు, ధనం గురించిన ఆలోచనలు వదిలి, శుద్ధమైన మనస్సుతో పూజించాలి. 

విశ్లేషణ 

ఎన్నో విధాలుగా పూజించాను, కాని దానివల్ల ఎలాంటి ప్రతిఫలము దొరకడం లేదు అనే సంశయము కలుగుతుంటుంది కొన్ని సార్లు. ఇది ఒకరకం. ఎంతో వైభవంగా పూజ చేసాను అని గర్వంగా చెప్పుకుంటాము. పైగా చేసే పూజకన్నా ప్రచారం ఎక్కువ. ఇది ఇంకొకరకం. 

ఎంత వైభవంగా చేస్తే అంత మందిని పిలవాలి. పైగా అందరూ వస్తారని అలంకారాల మీద ధ్యాస - ఆ రోజు ఏ బట్టలు కట్టుకోవాలి, ఏ నగలు వేసుకోవాలి అని ముందు నుండే ప్రణాలికలు, తయారీ. పూజించడానికి కూర్చున్నప్పుడు మాత్రం మనస్సు అక్కడ నిలువదు. పూజకోసం పీటల మీద కూర్చొని, వచ్చినవారిని సైగలతో పలకరిస్తాము. అంటే "చిత్తం శివుని మీద, భక్తి చెప్పులమీద!!", అవునా, కాదా? చేయించేవారు ఎదో చెబుతారు, మనం చేసేస్తాము. అక్షంతలు వాసన చూసి వెనక్కి వేయడం నుండి మొదలుకొని, నీళ్ళు వదిలే వరకు ఎదో చెబుతున్నారు మనం చేస్తున్నాము. కాని ఏమి జరుగుతుందో తెలియదు. తెలుసుకొనే ప్రయత్నమూ ఉండదు. మరమనిషి (ROBOT) తనను నియంత్రించే యజమాని (computer programmer) సూచనలను అనుసరించినట్లు. కాని మరమనుషులము కాముగదా.. మనసు ఒకటి ఉంది కదా!! అది మాత్రం స్వేచ్చగా సంసారంలో విహరిస్తూ ఉంటుంది. అంటే చేసేది ఎంత పెద్ద వ్రతమైనా, పూజైనా అది చెప్పుకోవడానికే గాని, దానివల్ల ఒరిగేది కొంచమే అవుతుంది. 


మనస్సు చెదరడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి నిత్యసంసారములోని సుఖదుఃఖముల ఆలోచనలు (విషయ వాంఛలు). రెండవది సంపద యొక్క ప్రభావం. ఈ రెండూ మనస్సుని నిలువనీయక ఎప్పుడు ఖాళీ దొరికినా వచ్చి చేరతాయి. 

శివపూజకు ఉపక్రమించే ముందు వీటివల్ల కలగబోయే అంతరాయాలను ముందే పసిగట్టగల్గితే ఉపయోగం ఉంటుంది. ఈ వచనంలో బసవన్న ఈ పసగట్టడం నేర్చుకోమంటున్నారు.  సంసారము గాలిలో దీపంలా ఎప్పుడు రెపరెపలాడేది, శాశ్వతము కాదు. కాబట్టి విషయవాంఛలను  గురించి ఆలోచనలను ప్రక్కన బెట్టమని మొదటి ప్రతిపాదన. 

శివపూజ నిరాడంబరంగా ఉంటుంది.  నీళ్ళు, భస్మము, ఏ పువ్వో,పత్రో తప్పితే ఉపయోగించే వస్తువులు కూడా ఏమీ ఉండవు. నీవు తినే పదార్థాన్నే నైవేద్యంగా పెట్టడం తప్ప గొప్పగా చేయాల్సిన వంటలూ లేవు. ఇక్కడ ధనంతో, డంబచారంతో చేసేదేమీ ఉండదు. ఇది రెండవ ప్రతిపాదన. 

వీరశైవులకు అన్ని వ్రతాలు నిషేధించబడి కేవలం శివపూజ మాత్రమే నిత్య దీక్షగా వ్రతముగా ప్రతిపాదించబడింది. ఇక ఇటువంటి నిరాడంబరమైన పూజ చేసేవానికి ధనమును, ధనార్జనను గురుంచిన ఆలోచన ఉండకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అలా చేయడం అలవాటైతే మనిషికి వ్యక్తిత్వ వికాసము కూడా కలుగుతుంది. - తనకు సిరి లేదనే బాధ కాని, ఉన్నదనే అహంకారము గాని లేక అందరితో సమానంగా వ్యవహరించడం నేర్చుకుంటాము. మనస్సు నిలుస్తుంది కాబట్టి ఆ శివలింగములో లయించి ముక్తి మార్గంలో ముందుకు సాగడమూ సులువవుతుంది.  

కాబట్టి ఇలాంటి పూజనే అలవరచు కుందాం.. 

శరణు శరణార్థి!!









  

Sunday, October 4, 2015

34. Bhaktiyemba Prithviya Mele - Basavanna


కన్నడ వచనం 

ಭಕ್ತಿಯೆಂಬ ಪೃಥ್ವಿಯ ಮೇಲೆ, ಗುರುವೆಂಬ ಬೀಜವಂಕುರಿಸಿ
ಲಿಂಗವೆಂಬ ಎಲೆಯಾಯಿತ್ತು
ಲಿಂಗವೆಂಬ ಎಲೆಯಮೇಲೆ, ವಿಚಾರವೆಂಬ ಹೂವಾಯಿತ್ತು
ಆಚಾರವೆಂಬ ಕಾಯಾಯಿತ್ತು, ನಿಷ್ಪತ್ತಿಯೆಂಬ ಹಣ್ಣಾಯಿತ್ತು
ನಿಷ್ಪತ್ತಿಯೆಂಬ ಹಣ್ಣು ತೊಟ್ಟು ಕಳಚಿ ಬೀಳುವಲ್ಲಿ
ಕೂಡಲಸಂಗಮ ದೇವನು ತನಗೆ ಬೇಕೆಂದು ಎತ್ತಿಕೊಂಡ..!!!


తెలుగు లిపిలో 

భక్తియెంబ పృథ్వియ మేలె గురువెంబ బీజవంకురిసి 
లింగవెంబ ఎలెయాయిత్తు 
లింగవెంబ ఎలెయమేలె విచారవెంబ హూవాయిత్తు, ఆచారవెంబ కాయాయిత్తు, నిష్పత్తియెంబ  హణ్ణాయిత్తు 
నిష్పత్తియెంబ హణ్ణు తొట్టు కళచిబీళువల్లి 
కూడలసంగమ దేవను తనగె బేకందు ఎత్తికొండ !!

తెలుగు వచనం 

భక్తియనే పృథివిపై గురువనే బీజమంకురించి 
లింగమనే ఆకు మొలిచెను 
లింగమనే ఆకుపై, విచారమనే పువ్వాయెను, ఆచారమనే కాయాయెను,
నిష్పత్తియను పండాయెను
నిష్పత్తియనే ఈ ఫలము పండి కొమ్మనువేరై పడువేళ 
కూడలసంగమ దేవుడు తనకు కావలెనని ఎత్తుకొనెను !!

వచనకర్త ఆంతర్యం
భక్తి గురువు దయవల్ల చిగురించి, లింగముయొక్క సహాయముతో, విచారంతో వికసించి, ఆకారముతో పండి ఫలమైనప్పుడు జీవుడు శివునికి ఆమోదయొగ్యుడై శివార్పితమవుతాడు. 

విశ్లేషణ 

ఒక భక్తుడు శివునికి స్వీకారయోగ్యుడై శివైక్యము పొందే విధానాన్ని ఒక మొక్కని ఉపమానముగా చేసికొని చక్కగా వివరించే వచనమిది. వీరశైవములో ఒక జీవుడు శివైక్యము పొందడానికి షట్స్థలములు అంటే భక్త స్థలము నుండి ఐక్య స్థలము వరకు గల ఆరు స్థలములలో ప్రయాణము చేయవలసి ఉంటుంది. అయితే ఈ గమనాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపకరించే వచనం ఇది. 

ముందు జీవునికి శివభక్తి ఉండాలి. భక్తి ఉన్న జీవుని శరీరము సాగు చేయడనికి ఉపయుక్తమైన మంచి సారవంతమైన నేల వంటిది. ఇదే వీరశైవ భాషలో అంగము. ఇటువంటి నేలపై ప్రారబ్ధము వల్ల గురువు కటాక్షము కలిగి శివోపదేశము వల్ల సాధన మొదలవుతుంది. ఇదే గురువనే  బీజము (లేదా విత్తనము) పడి మొలక అంకురించడము (sprout up). ఇక భక్తి లేనివాడు ఆధ్యాత్మికంగా బీడువడ్డ, లేదా సాగుచేయడానికి ఉపయుక్తము కాని, నేల అని చెప్పక్కరలేదు. అటువంటి నేలపై విత్తనము పడ్డా మొలవదు. 

గురూపదేశముతో చేసుకొన్న లింగప్రతీష్ట ఆకువలె ఉత్పన్నమవుతుంది. అంగముపై ప్రతిష్టించుకున్న ఇష్టలింగముతో పాటు, హృదయాన ఉండే ప్రాణలింగము,  మనస్సున కలిగే భావలింగము యొక్క అవగాహన కలుగుతాయి. అంటే లింగము ఎవరో ఇస్తే మెడకు తగిలించుకునే వస్తువు కాదు. అంగములో భాగముగా తెలుసుకోవాలి. ప్రాణభావలింగాలను మొలిపించుకోవాలి. దానికి సాధన కావాలి. 

ఇటువంటి లింగదీక్షలో ఉన్న అంగము ఇప్పుడు బాగా ఆరోగ్యమైన మొక్కగా కనబడుతుంది. ఇటువంటి పచ్చని మొక్కకు విచారమనే పుష్పము ఉత్పన్నమవుతుంది. ఇక్కడ విచారమంటే విషయవాంఛల గూర్చిన పిచ్చి ఆలోచనలు కావు. నిర్మలమైన, లింగధ్యాన నిమగ్నమైన మనస్సులో తనను తాను తెలుసుకొనే ఆలోచన. అందమైన పువ్వుని తన్మయత్వముతో చూస్తూ ఉండి పోయినట్లు, ఈ విచారణలో మనస్సు లయమవ్వడమే పువ్వు యొక్క వికాసము. 

ఇటువంటి పువ్వు కాయగా మారినప్పుడు ఆచారముగా పరిణమిస్తుంది. విచారణ మనస్సులో కలిగితే ఆచరణ బాహ్యంగా వెలువడుతుంది. వీరశైవమున ఇవే లింగాచార, సదాచార, శివాచార, గణాచార, భృత్యాచారములనే పంచాచారములు. ఇటువంటి ఆచారముల వలన కేవలము తన  ఆత్మ వికాసమే కాక సమాజ శ్రేయస్సు కూడా కలుగుతుంది. ఇటివంటి కాయగా మారిన అంగము ఫలముగా పండటము, ఒక శివభక్తుడు ఎలా ఉండాలో అందరూ చూస్తారు. చాలా మంది నేర్చుకుంటారు, తమని తాము ఉత్తమ అంగములుగా సరిచేసుకునే ప్రయత్నమూ చేసే అవకాశమూ ఉంటుంది. 

ఇలా అచారములతో పండిన అంగము పరిపక్వత చెందిన తరువాత మొక్కతో ఎటువంటి బంధాన్ని ఉంచుకోదు. సులభంగా విడిపోతుంది. శ్రుతిలో మృత్యుంజయ మంత్రము ఇదే చెబుతుంది

త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం 
ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షియమామృతాత్

ఉర్వారుకము అంటే పండిన దోసకాయ, ఇవబంధనాత్ మొక్కనుండి విడిపోయినట్లు అని. పండిన దోసకాయ ఎలాగైతే ఎలాంటి బాధ లేకుండా తన మొక్క నుండి విడినట్లు, నన్ను ఈ జననమరణ చక్రము నుండి విడిపించవయ్య అని కోరడము వెనక ఆంతర్యము ఇదే. పండటము అంటే వీరశైవుల భాషలో గురుణాదత్త లింగదీక్షలో తనను తాను తెలుసుకొని  శివజ్ఞానంలో పండడము. ఇటువంటి పండిన జీవుడే నిష్పత్తి (accomplished) చెందిన వాడవుతాడు. ఈ నిష్పత్తి చెందటమే శివానుభవములో పండిన అంగము. ఇలా పండిన అంగము సంసారబంధాలను తృంచుకుని శివైక్యమునకు సిద్దమవుతుంది. అదే ఏ బాధలేకుండా మొక్కనుండి విడువడడము. 

ఇలా విడివడే పరిపక్వమైన ఫలము వంటి జీవున్ని శివుడు ప్రేమతో కావాలని స్వీకరిస్తాడు, తనలో కలుపుకుంటాడు అని బసవ ఉవాచ. ఇదే శివజీవ-ఐక్యము, లింగాంగ సామరస్యము. ఈ విధంగా ఆ కూడాలసంగనిలో జీవైక్యమైన వారికి జరామరణములు ఉండవు- అదే  మృత్యోర్ముక్షియమామృతాత్. 

శరణు శరణార్థి!!