Sunday, August 21, 2016

41. Emmavaru Besagondare Shubhalagnavannirayya - Basavanna

కన్నడ వచనం 
ಎಮ್ಮವರು ಬೆಸಗೊಂಡರೆ ಶುಭಲಗ್ನವೆನ್ನಿರಯ್ಯಾ,
ರಾಶಿಕೂಟ, ಋಣಸಂಬಂಧವುಂಟೆಂದು ಹೇಳಿರಯ್ಯಾ,
ಚಂದ್ರಬಲ ತಾರಾಬಲವುಂಟೆಂದು ಹೇಳಿರಯ್ಯಾ,
ನಾಳಿನ ದಿನಕಿಂದಿನ ದಿನ ಲೇಸೆಂದು ಹೇಳಿರಯ್ಯಾ,
ಕೂಡಲಸಂಗಮ ದೇವನ ಪೂಜಿಸಿದ ಫಲ ನಿಮ್ಮದಯ್ಯಾ

తెలుగు లిపిలో 
ఎమ్మవరు బెసగొండరె  శుభలగ్నవన్నిరయ్యా  
రాశి కూట ఋణ సంబంధవుంటిందు  హేళిరయ్యా 
చంద్రబల తారాబలవుంటిందు  హేళిరయ్యా
నాళిన దినికిందిన దిన లేసెందు  హేళిరయ్యా 
కూడలసంగమ దేవన పూజిసిద ఫల నిమ్మదయ్యా 

తెలుగు వచనం 
నీవాళ్ళు ఒప్పిననాడే శుభలగ్నమనవయ్యా 
రాశికూటములు, ఋణ సంబంధములు కలిసొచ్చెననవయ్యా 
తారాబలము చంద్రబలము కుదిరేననవయ్యా 
 రేపటి కన్నా నేడే లెస్సయననవయ్యా 
కూడలసంగమ దేవుని పూజించిన ఫలము నీదయ్యా !!

అర్థం 
శివశరణులతో సంప్రదించి నిశ్చయించిన తరువాత శుభలగ్నము వెంటనే వచ్చెనని తలవాలి. మంచిదినము అనేది మరల వెదకక్కర లేదు. శరణుడనెడి వాడు తమవారి మాటను వెంటనే నెరవేర్చాలి. పరమేశ్వరుని పూజించిన ప్రతిదినము శుభదినమే అవుతుందని, ఆ పూజ ఫలముగా దైవబలము, తారాబలము, చంద్రబలం, రాశులు, తిథివార నక్షత్రములన్ని అనుకూలముగా ఉంటాయని గట్టి నమ్మకంతో ఉండెడి వాడే నిజమైన వీరశైవుడు.      

విశ్లేషణ 

గతములో లగ్నవెల్లియదొ విఘ్నవెల్లియదొ అనే వచనంలో వీరశైవులు వర్జ్యకాలము, తిథివార నక్షత్రములను పట్టించుకోరని ప్రస్తావించుకున్నాము. అదే విషయాన్న బసవన్న ఈ వచనంలో చెబుతున్నారు. 

ఇక్కడ నీవాళ్లంటే "శివశరణుల"ని అర్థం చేసుకోవాలి. శరణులు నిర్ణయించిన పనిని నిర్వహించడానికి ఉత్సాహముతో, ఆతృతతో ఉంటాడు. మరుదినము కొరకు, శుభఘడియ కొరకు  వేచియుండక  ఈ రోజే శుభమని వెంటనే పనిని ప్రారంభిస్తాడు. ఒక్కసారి నిర్ణయించిన తరువాత తిథివారములు గాని, తారాబలము, చంద్ర బలములతో కూడిన ముహూర్తమునుగాని మరల లెక్కించ వలసిన పనిలేదు. నిత్యమూ శివారాధనతో నుండెడి వారాల మాటకు విఘ్నము కలిగించగల శక్తి ఏ గ్రహములోగని, ఏ రాశిలో గాని ఉండదు. "అన్నీ వీరశైవునికి అనుకూలంగా మారుతాయి" అనేది బసవన్న ప్రతిపాదన.  

ఒకవేళ విఘ్నము కలిగినా, శివార్పణా భావముతో కార్యాన్ని చేసే వీరశైవుడు అది శివేచ్ఛగా స్వీకరిస్తాడు తప్ప, ఇతర శక్తుల ప్రభావాన్ని ఎంచడు, వాటి జోలికిపోడు.    

పై వచనంలో "కూడలసంగమ దేవుని పూజించిన ఫలము నీదయ్యా!" అనే వాక్యము ముఖ్యము, "శివశరణుల నిర్ణయము" ముఖ్యము. నిత్య ఇష్టలింగ పూజ చేసే వారలకు మాత్రమే వర్తించే పద్ధతులివి - ఇతరులకు కాదు.  పైమూడు వాక్యాలు చదివి, తమకు అనుకూలముగా శివారాధను మరచి, తమ స్వప్రయోజనాలకై బసవన్న వచనాన్ని వాడుకునే నాస్తికులు కూడా ఉన్నారు..  జాగ్రత్త!! 

ముహుర్తాది విషయములు సామాన్య ధర్మమును పాటించు భవులకు సంబంధించినవి. కర్మకాండలను,సామాన్య ధర్మమును పాటించే వారికి అవి అవసరము- వారు పాటించుటలో తప్పులేదు. అత్యాశ్రమ ధర్మైన వీరశైవాన్ని స్వీకరించిన వారు తమ పూర్వకర్మలను త్యజించాలని ఖండితంగా చెప్పబడింది. 

అయితే ఈనాటి వీరశైవులము మన ధర్మమార్గము తెలియక, తెలిసినా వాటిపై సంపూర్ణవిశ్వాసములేక, లేదా ఏదైనా జరిగిపోతుందని భయముతో సామాన్య భవులవలే వ్యవహరిస్తున్నాము. మనకు మార్గ నిర్ధేశకులైన జంగమలను కూడా ముహూర్తాలను నిర్ణయించమని అడుగుతున్నాము. పూర్వకర్మలను కొనసాగించడం వలన శివపూజ వ్యర్థమని తెలియాలి. 

మన ధర్మము గురించి తెలియనివారు ఒక వేళ భయపెట్టినా , లేదా ఇటువంటి వాటిని ప్రోత్సహించినా, నిర్మొహమాటంగా అలాంటి సలహాలను పక్కన బెట్టవచ్చు. మనము ఇతరులను మన మార్గాన్ని పాటించమని ప్రాధేయపడడంలేదు; అలానే వారి మార్గాన్ని మన జీవనశైలిపై రుద్దు కోవలసిన అవసరంలేదు. 

సిద్ధాంత శిఖామణి (నవమ పరిచ్ఛేదం - 39వ శ్లోకము) ప్రకారము  

శివపూజాపరో భూత్వా పూర్వకర్మ విసర్జయేత్ 
అథవా పూర్వకర్మస్యాత్ సా పూజా నిష్ఫలా భవేత్ || 

శివపూజాపరుడైన వాడు తన పూర్వకర్మలను వదిలిపెట్టవలెను. అట్లుకాక పూర్వకర్మలను కొనసాగించినట్లయితే ఆ శివపూజ నిష్ఫలమవుతుంది. 

నిత్యశివారాధనలో ఉంటూ శివేతరశక్తులేవో శివసంకల్పానికి అడ్డు పడతాయేమోననుకోవడము అవివేకము, తానుచేసే పనిలో విశ్వాసము  లేకపోవడమే అవుతుంది. అటువంటి విశ్వసములేని పూజ వ్యర్థమే కదా? అసలు ప్రపంచములో శివేతరశక్తులే లేనప్పుడు ఏ శక్తి శివకార్యమునకు అడ్డుపడగలదు? అనే ఆత్మవిశ్వాసముతో  సాగేవాడే నిజమైన వీరశైవుడవుతాడు. 

శరణు శరణార్థి!!

 


   

Sunday, August 14, 2016

40. Lagnavelliyado Vighavelliyado Sangayya? - Basavanna

కన్నడ వచనం
ಲಗ್ನವೆಲ್ಲಿಯದೊ  ವಿಘ್ನವೆಲ್ಲಿಯದೊ ಸಂಗಯ್ಯ?
ದೋಷವೆಲ್ಲಿಯದೊ ದುರಿತವೆಲ್ಲಿಯದೊ ಸಂಗಯ್ಯ?
ನಿಮ್ಮ ಮಾಣದೆ ನೆನೆವವಂಗೆ ಭವಕರ್ಮವೆಲ್ಲಿಯದೊ ಕೂಡಲ ಸಂಗಯ್ಯ?

తెలుగు లిపిలో 
లగ్నవెల్లియదొ విఘ్నవెల్లియదొ సంగయ్య?
దోషవేల్లియదొ దురితవెల్లియదొ సంగయ్య?
నిమ్మ మణదె నేనెవవంగె భావకర్మవెల్లియదొ కూడల సంగయ్య?   

తెలుగు వచనం
లగ్నమెక్కడిదో విఘ్నమెక్కడిదో సంగయ్య?
దోషమెక్కడిదో దురితమెక్కడిదో సంగయ్య?
మిమ్ములను మానక తలచువానికి భవకర్మమెక్కడిదో కూడల సంగయ్య?


వచనకర్త ఆంతర్యం 

పరమేశ్వరుని నిత్యమూ తలుస్తూ మైమరచి వర్తించే వీరశైవ శరణునకు శుభాశుభములు గాని, దోషములు, పాపములు గాని అంటవు. 

విశ్లేషణ 

వీరశైవధర్మానువర్తనులైన వారు కర్మపాశములు తమకు అంటవనే  ప్రగాఢవిశ్వాసముతో ఉంటారు. 
జగత్తులోని సమస్తము పరమేశ్వరుడైన శివుని సంకల్పము వల్ల జరిగే నిర్మాణమని, శివుని వల్లే నడుస్తుందని, శివునిలోనే పుట్టి శివునిలోనే లయమవుతూ ఉందని, శివేతరమైనదేది ప్రపంచములో లేదని గట్టిగా నమ్ముతారు. 

సృష్టికి పూర్వము ఎలాంటి వికారములు లేని నిర్గుణ బ్రహ్మమైన శివుడు మాత్రమే ఉండే వాడు. ఆతను తన స్వతంత్రమైన ఇచ్ఛతో తనలోనుంచే శక్తిని ప్రకటించుకొని  సృష్ట్యారంభం చేసాడని వీరశైవ సిద్ధాంత శిఖామణి వివరిస్తోంది. 

ఈ శక్తి వైశిష్టుడైన శివుడే విశ్వంలో మూడు రూపాలలో మారిపోతాడు. 
1. భోజ్యము - అనుభవించబడే జడ పదార్థము. ఉదాహరణకు మట్టి, రాళ్ళూ, నీరు, చెట్లు వంటివి అన్న మాట, 
2. జీవుడు - ఇతడు చైతన్యము కలిగిఉన్నా తాను శివుడననే నన్న విషయము మరచి, విషయ ప్రపంచములో మునిగి, అవిద్య అనే మాయతో కప్పబడిన జంతువు 
3.  మహేశ్వరుడు - మహామాయని తన వశములో ఉంచుకొని దానివల్ల ఏ విధంగానూ ప్రభావితము కాకుండా జీవులను ప్రపంచాన్ని నడిపించే వాడు. 
దీని ప్రకారము కాబట్టి ప్రపంచములోని ఏ పదార్థమైనా శివుడే అయి ఉన్నది!! 

అయితే ఇలా ప్రారంభమైన సృష్టి తదనంతరము రకరకాలుగా మారిపోయింది - ఆకాశము, నక్షత్రాలు, గ్రహాలు, భూమి, నీరు, చెట్లు -చేమలు వంటి జడ ప్రపంచము ఒకటైతే, దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, పశు, పక్షి, జంతు, మానవాది జీవులుగా మరో విధంగా క్రమంగా పరిణామము చెందింది. 

వీరశైవేతరులు, ఈ విధంగా పరిణమించిన ప్రపంచాన్ని విడివిడిగా రకరకాలైన రూపంలో దర్శించి వాటిలో తమకు నచ్చిన చిన్న చిన్న శక్తులను తమ కోరికలను తీరుచుకోవడానికి ఆరాధిస్తారు. తాము చేసే కార్యము ఏదైనా కూడా స్వప్రయోజనమును ఆకాంక్షించి చేస్తారు. ఉదాహరణకు ఒక పూజ చేస్తే ఎదో ఒక "కార్య" సిధ్యర్థం అని సంకల్పంతో చేస్తారు. ఫలము ఆకాంక్షిస్తున్నాడు కాబట్టి అట్టి కర్మల ఫలితము పాపమైనా, పుణ్యమైనా ఆ జీవునికి అంటుకుంటుంది. ఈ కర్మ చక్రములో జీవుడు మరణించిన తరువాత కూడా ఈ పుణ్యపాపముల ఫలితములు అనుభవించడానికి మళ్ళీ ఇంకో జీవునిగా పుట్టవలసి వస్తుంది. కొన్ని సార్లు మానవ జన్మ కూడా లభిస్తుంది.  ఆత్మజ్ఞాన మార్గదర్శనం లేని మానవులు తమ కర్మలను అలానే కొనసాగిస్తూ  జీవన్మరణ/కర్మ చక్రంలో తిరుగుతూ ఉంటారు. అటువంటి వారిని "భవులు" అంటారు.  భవులు తమకు పరిస్థితులు సానుకూలంగా ఉండడానికి, విషయ వాంఛలు తీర్చుకోడానికి యజ్ఞయాగాది కర్మలు, గ్రహ శాంతి, దోష నివారణ, పాప పరిహరణకు వ్రతాలూ, పూజలు, శుభ ముహూర్థం, వర్జ్యము వంటి సమయాసమయ భేదములు, అంటూ, శౌచము వంటి పద్ధతులను సంప్రదాయంగా పాటిస్తారు.  ఎందుకంటే వారిది  కర్మ మార్గజీవనశైలి ; ఇది తప్పు అని అనడం లేదు  - వారికి  అవి అవసరం.  

ఇక  ఆత్మజ్ఞాన విచారణ, గురులింగజంగమ సంబంధముతో ముముక్షువులైన  వీరశైవులు మాత్రం ప్రపంచాన్ని విడివిడిగా గాక శివుడనే భావనతో చూడడం నేర్చుకుంటారు. ఏ కర్మ చేసిన ఎదో ఫలితం పొందాలనే ఆశతో కాక శివార్పణ భావంతో చేస్తారు- దీనివల్ల వీరికి కర్మ ఫలాలు అంటవు. నిత్య శివపూజ తప్ప ఏ వ్రతాలూ పాటించరు; అగ్నిష్టోమాది క్రతువులకు దూరంగా ఉంటారు. ప్రాపంచిక సుఖప్రయోజన ఫలాలను పొందే ప్రయోజనాధ్యేయంతో ఏ పూజలు చేయరు.  వీరికి సర్వశక్తిమంతుడైన శివుడు తప్ప ఇతరాత్ర దేవతలు ఎవ్వరు రుచించరు.
ఇటువంటి ఆచారముతో ఉంటూ భవి మార్గములకు దూరంగా ఉండే వీరశైవులకు -
- సర్వము శివస్వరూపమైనప్పుడు ఇక అంటు-ముట్టు లెటువంటివి? అయితే దీనర్థం పరిశుభ్రతతో ముడిబెట్టేరు సుమా! - నిత్యం త్రిసంధ్యలలో స్నానముతో కూడిన శివ పూజా విధానము వీరశైవులకు నియమంగా ఉంది. ఇంట్లో మరణంగాని , పిల్లలు పుట్టినప్పుడు గాని, నెలలు మొదలైన అంటులను వీరశైవులు పాటించడం కూడదని, అందరు అన్ని పరిస్థితులలోను ఇష్టలింగారాధన విడువరాదని ఖచ్చితంగా చెప్పబడింది. 
- కాలము కాలకాలుడైన శివుని సృష్టి అయినప్పుడు, శుభలగ్నము,వర్జ్యము ఎక్కడిది? అందుకే వీరశైవులు పంచాగం, వర్జ్యాలను పాటించరు.  
- అన్ని దిక్కులు శివుని ముఖములైనప్పుడు, వాస్తుదోషమెక్కడిది? ప్రాపంచిక సుఖదుఃఖములు శివ ప్రసాదంగా భావించి అనుభవించే వీరశైవులను గ్రహదోషాలు ఎలా బాధిస్తాయి?  కాబట్టి తిథి, వార, నక్షత్ర, వర్జ్యమూల వంటి కాలదోషములను వీరశైవులు పట్టించుకోరు. గ్రహశాంతి, వాస్తుదోషము, శుభాశుభ శకునములు వంటి భవ సంప్రదాయములను వీరశైవులు పాటించరు. 

నిత్య శివమార్గములో నిమగ్నులై, శివానుభవులై కర్మలకు దూరమై పాపపుణ్యములను త్యజించి జీవన్ముక్తులయ్యెడి వారు వీరశైవ శరణులు. బసవన్న ఈ విషయాన్నే ఈ వచనంలో ప్రస్తావించారు.  

శరణు శరణార్థి !!